మొత్తం సీట్లు గెలిచి జనసేన రికార్డు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్… పార్టీ పెట్టిన పదేళ్లకు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగు పెట్టబోతున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో చిరంజీవి విలీనం చేసిన తర్వాత జనసేన పార్టీని పవన్ స్థాపించారు. అప్పుడే 2014 సార్వత్రిక ఎన్నికలు రాగా పూర్తిస్థాయిలో జిల్లా, మండల కమిటీలు ఏర్పాటు కాకపోవడంతో పవన్ పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చారు. 2019 ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. రాజోలులో రాపాక వరప్రసాద్ ఒక్కరే గెలుపొందారు. ఆయన తర్వాత వైసీపీలో చేరారు. ఓటమితో నిరాశ చెందకుండా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పవన్ ముందుకెళ్లారు. ప్రజా సమస్యలపై పోరాడారు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. పిఠాపురం బరిలో నిలిచిన పవన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. మిగిలిన 20 స్థానాల్లోనూ జనసేన గెలిచింది. అలాగే మచిలీపట్నం, కాకినాడ పార్లమెంటు స్థానాల్లోనూ గెలుపొందారు. దీంతో పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. 21 స్థానాలు గెలుచుకొని రెండవ అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించింది. దీంతో పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టనుండగా, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేయలేని జనసేన కూడా పార్టీయేనా అని విమర్శించిన వైసీపీ 10 సీట్లకే పరిమితం కావడం… మూడో స్థానానికి పడిపోవడం విధి విచిత్రం.