. జార్ఖండ్ పరిణామాలపై పార్లమెంటులో తీవ్ర చర్చ
. బీహార్లో ఒకలా… జార్ఖండ్లో మరోలా…
. కేంద్రాన్ని నిలదీసిన ‘ఇండియా’ కూటమి సభ్యులు
. ప్రభుత్వం రాజ్యాంగాన్ని ముక్కలు చేస్తోందని ఖడ్గే విమర్శ
న్యూదిల్లీ: జార్ఖండ్ పరిణామాలపై పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం దద్దరిల్లాయి. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం, హేమంత్ సోరెన్ అరెస్టుపై విపక్షాలు మండిపడ్డాయి. మోదీ సర్కారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని విమర్శించాయి. గంటల వ్యవధిలో బీహార్లో ప్రభుత్వం ఏర్పాటైందని, జార్ఖండ్లో మాత్రం జాప్యం చేస్తున్నారని వ్యాఖ్యానించాయి. ప్రభుత్వ పక్షపాత ధోరణికి నిరసనగా విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్సభ, రాజ్యసభలో శుక్రవారం చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ (ఇండియా) ఎంపీలు జార్ఖండ్ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తారు. ఈ అంశంపై ఉభయసభల్లోనూ వాడివేడిగా చర్చ జరిగింది. జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత గవర్నర్ రాష్ట్రంలో పరిపాలన కోసం మధ్యంతర ఏర్పాట్లు చేయకపోవడంపై ‘ఇండియా’ కూటమి ఎంపీలు పార్లమెంటు నుంచి వాకౌట్ చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు పార్లమెంటు కార్యకలాపాలు కొనసాగాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే మాట్లాడారు. సభలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. బీహార్లో నితీశ్ కుమార్ రాజీనామా చేసిన 12 గంటల్లోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటయిందని, జార్ఖండ్లో మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారాన్ని జాప్యం చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రోద్భలంతోనే హేమంత్ సోరెన్ను అరెస్టు చేశారని, రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం ముక్కలు చేస్తోందని ధ్వజమెత్తారు.
సోరెన్ రాజీనామా తర్వాత 81 మంది సభ్యుల అసెంబ్లీలో 43 మంది మద్దతు ఎమ్మెల్యేల సంతకాలతో ఆయన వారసుడి పేరు గవర్నరుకు ఇచ్చారని, అటువంటి బదిలీకి మద్దతు ఇస్తున్న మరో నలుగురు ఎమ్మెల్యేలు రాష్ట్రం వెలుపల ఉన్నందున వారు సంతకాలు చేయలేకపోయారని ఖడ్గే తెలిపారు. సోరెన్ రాజీనామా తర్వాత ఆయన (గవర్నర్ సీపీ రాధాకృష్ణన్) ఎలాంటి ఏర్పాట్లు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసిన సందర్భంలో వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు రాజ్యాంగం అవకాశం కల్పించిందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు రాజీనామా చేసిన ముఖ్యమంత్రి లేదా మరొకరిని కొనసాగించడానికి గవర్నర్ తాత్కాలిక ఏర్పాట్లు చేస్తారని ఖడ్గే చెప్పారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు గల పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలిచి విశ్వాస తీర్మానం కోరుతున్నారని అన్నారు. దాదాపు 20 గంటల నిరీక్షణ తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కొత్తగా ఎన్నికయిన నాయకుడు చంపై సోరెన్కు గవర్నర్ను కలవడానికి ఆహ్వానం వచ్చిందని, అయితే మద్దతు లేఖలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించలేదని కాంగ్రెస్ నాయకుడు చెప్పారు. ఈరోజు (శుక్రవారం) మాత్రమే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారని ఖడ్గే విమర్శించారు. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత బీహార్లో జరిగిన పరిణామాలపై మాట్లాడారు. ఖడ్గే వ్యాఖ్యలను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తోసిపుచ్చారు. జార్ఖండ్లో వెలుగుచూసిన భారీ భూ కుంభకోణం కారణంగా ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని, పెద్దఎత్తున అవినీతికి పాల్పడిన వ్యక్తికి కాంగ్రెస్ మద్దతు తెలుపుతోందని, ఇది ఆ పార్టీ వైఖరికి నిదర్శనమని ఎదురుదాడి చేశారు. కాంగ్రెస్ డీఎన్ఏలో అవినీతి ఉందని, దీనిని మళ్లీ రుజువు చేస్తున్నదని, అవినీతిని కాంగ్రెస్ అంగీకరిస్తున్నదన్నారు. గవర్నర్ ప్రవర్తనపై సభలో చర్చించలేమని గోయల్ అన్నారు. అయితే, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై పట్టుబట్టాయి. ప్రభుత్వం ఏర్పడే వరకు సోరెన్ను కొనసాగించాలని లేదా మరొకరిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చేయాలని కోరడం ద్వారా మధ్యంతర ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
కేటాయింపుల్లో దక్షిణాదికి అన్యాయం
బడ్జెట్ కేటాయింపుల్లో తమకు అన్యాయం జరుగుతోందని, ఇదే కొనసాగితే… దక్షిణాది రాష్ట్రాలతో ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ వ్యాఖ్యానించారు. దీనిపై ఉభయ సభల్లోనూ తీవ్ర దుమారం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని రాజ్యసభలో పీయూష్ గోయల్ డిమాండ్ చేశారు. దేశాన్ని ఒక్కటిగా ఉంచాలనేదే కాంగ్రెస్ సిద్ధాంతమని, విభజన కోరే వారికి పార్టీ ఎప్పటికీ మద్దతు తెలపదని ఖడ్గే స్పష్టం చేశారు. డీకే సురేశ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలని, ఆయనపై పార్టీ తక్షణం చర్యలు తీసుకోవాలని లోక్సభలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు.
‘చదువుపై నెహ్రూ శ్రద్ధ పెట్టారు… కానీ ఇప్పుడు…
‘స్వాతంత్య్రం తర్వాత పండిత్ జవహర్లాల్ నెహ్రూ విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఆయన ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, కళాశాలలు, ఐఐటీ వంటి సంస్థలు ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఈ సంస్థల ప్రయోజనాలు పొందారు. అయితే ఓబీసీ పిల్లలకు 27 శాతం రిజర్వేషన్లు అందుబాటులో లేవు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ పిల్లలకు రిజర్వేషన్లు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని ఖడ్గే అన్నారు. పార్లమెంటు భద్రత విషయంలో మీరు విఫలమయ్యారని ఆరోపించారు. పార్లమెంటుపై దాడిలో దొరికిన నిందితులకు కరెంటు షాక్లు ఇచ్చారని, ఫలానా పార్టీ పేరు చెప్పాలని చెబుతున్నారని తెలిపారు. బిల్కిస్ బానో కేసులో ప్రధాని మౌనంగా ఉండటాన్ని ఖడ్గే ప్రశ్నించారు. ‘బిల్కిస్ బానో విషయంలో ప్రధాని ఏమీ మాట్లాడలేదు. నిందితులకు పూలమాల వేసి స్వాగతం పలికారు. బీహెచ్యూలో అత్యాచారం జరిగినా… మహిళలపై వేధింపుల కేసు అయినా… వారు కూడా జవాబుదారీగా ఉండాలి. (అయోధ్య) రామ మందిరంలో విగ్రహం పూజలో కూర్చున్నప్పుడు మోహన్ భగవత్ కూడా ఆయనతో కూర్చున్నారు. ఇదే మోహన్ భగవత్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లపై చర్చకు డిమాండ్ చేశారు. మీకు కూడా కావాలా అదే?’ అని ఖడ్గే ప్రశ్నించారు. మరోవైపు ఉభయసభల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు పార్లమెంటులోని తన ఛాంబర్లో కేంద్రమంత్రులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ సహా మంత్రులు ప్రహ్లాద్ జోషి, అనురాగ్ ఠాకూర్, నితిన్ గడ్కరీ, అర్జున్రామ్ మేఫ్ువాల్ హాజరయ్యారు.
లోక్సభలోనూ ఆందోళన… వాకౌట్
మరోవైపు లోక్సభలోనూ ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర చర్చ జరిగింది. అనంతరం విపక్షాలు వాకౌట్ చేశాయి. వాకౌట్కు ముందు సభ్యులు సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించి నినాదాలు చేశారు. అంతకుముందు, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ ‘రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నట్లు ఆమె తన ప్రసంగంలో తెలిపారు. ఇది విన్న తర్వాత మేం చాలా బాధపడ్డాం. ఎందుకంటే రాష్ట్రపతికి ఇంతకు ముందే ఈ గౌరవం దక్కాల్సి ఉంది. కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించినప్పుడు కూడా కేంద్రప్రభుత్వం చేయలేదు. ఈ కొత్త పార్లమెంటు సంప్రదాయం భారతదేశంలోని ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని విస్మరిస్తోంది’ అని అన్నారు.