. 1వరకు కూల్చివేతల నిలుపుదల
. సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూదిల్లీ: ప్రభుత్వాలు ‘బుల్డోజర్ న్యాయం’ పేరుతో కూల్చివేతలకు పాల్పడటంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా అక్టోబర్ 1వ తేదీ వరకు బుల్డోజర్ చర్యల్ని నిలిపివేస్తూ ‘స్టే’ ఉత్తర్వులు జారీ చేసింది. బుల్డోజర్ న్యాయం పేరుతో నేర కార్యకలాపాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వారి ఇళ్లు, నిర్మాణాలను కూల్చివేయడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. కోర్టు అనుమతి తీసుకున్న తరువాతే కూల్చివేతలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ కూల్చివేతలపై అక్టోబర్ 1వ తేదీ వరకు స్టే విధిస్తున్నామని… ఇదే సమయంలో ఆక్రమణలు, అనధికారిక నిర్మాణాలను కూల్చివేయడానికి ఇలాంటి అనుమతులేవీ అవసరం లేదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. అక్టోబర్ 1వ తేదీ వరకు తమ ఆదేశాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ‘తదుపరి తేదీ వరకు కోర్టు అనుమతి తీసుకోకుండా కూల్చివేతలు చేపట్టకూడదు. అయితే, బహిరంగ వీధులు, ఫుట్పాత్లు, రైల్వే లైన్లు, బహిరంగ ప్రదేశాల్లో అనధికారిక నిర్మాణాలకు ఈ ఆర్డర్ వర్తించదు’ అని కోర్టు స్పష్టం చేసింది. చట్టపరమైన, శిక్షార్హమైన చర్యల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లను, దుకాణాలను బుల్డోజింగ్ చేయకుండా నిరోధించాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. మునుపటి విచారణలో అత్యున్నత న్యాయస్థానం ఈ బుల్డోజర్ జస్టిస్ను తీవ్రంగా తప్పుబట్టింది. దేశ వ్యాప్తంగా కూల్చివేతలపై మార్గదర్శకాలు అవసరం అని పేర్కొంది. కాగా, సుప్రీంకోర్టు తీర్పును యూపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కూల్చివేతలు చట్టవిరుద్ధమని… ఒక సామాజికవర్గాన్నే లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు చేపడుతున్నారనే వాదన పూర్తిగా అవాస్తవం అన్నారు. ఈ వాదనలు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కూల్చిన వాటిలో ఏది అసంబద్ధంగా కూల్చివేశారో ఒక ఉదాహరణ ఇవ్వాలని, అసలు కారణాన్ని తాము వెల్లడిస్తామని మెహతా అన్నారు. చట్టవిరుద్ధమైన నిర్మాణాలకు నోటీసులు ఇచ్చిన తరువాతే కూల్చివేతలు జరుగుతున్నాయని సొలిసిటర్ జనరల్ స్పష్టం చేవారు. మరోవైపు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సీయూ సింగ్, ఎంఆర్ శంషాద్.. ఎస్జీ వాదనలను ఖండిరచారు. అక్రమ కూల్చివేతలు కొనసాగుతున్నాయని, సమస్య తీవ్రంగా ఉందని కోర్టుకు తెలియజేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.