. అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలి
. సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ డిమాండ్
విశాలాంధ్ర బ్యూరో – కర్నూలు : ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ది సాధిస్తుందని , వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహాలో నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. మంగళవారం సీఆర్ భవన్లో సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు పీ రామచంద్రయ్య, కార్యవర్గ సభ్యులు ఆవుల శేఖర్, జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్యతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర విభజన తరువాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎన్నికల సమయంలో ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు తదితర అంశాలు లేవన్నారు. గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు, అప్పులపైనే గవర్నర్ ప్రసంగం సాగిందన్నారు. గవర్నర్ ప్రసంగంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజలు నమ్మి ఓటు వేసినందుకు ఎటువంటి భరోసా ఇస్తుందో చెప్ప లేదన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని పూర్తిస్థాయి బడ్జెట్ ఏర్పాటు చేస్తే బాగుండేదన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో రోడ్లపరిస్థితి ఆధాన్నంగా ఉన్నదనీ, పోలవరం నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఆదుకొని ఆర్థికంగా గాడీలో పెట్టాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రం అర్థికంగా బలపడాలంటే ప్రత్యేక హోదా ద్వారానే సాధ్యమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చిత్తశుద్ది ఉంటే బీహార్ జేడీయూ నేత నితీష్కుమార్ , వైసీపీ సహకారంతో ప్రత్యేక హోదా కోసం కేంద్రప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలన్నారు. ముచ్చుమర్రిలో బాలికపై అఘాయిత్యం చేసి హత్య చేయడం దారుణమన్నారు. నేటికి మృతదేహాన్ని పోలీసులు గుర్తించలేకపోయారన్నారు. అధికారం వచ్చిన తరువాత టీడీపీ వారు వైసీపీపై దాడులు చేస్తున్నారని ఇందుకు రాజంపేట ఎంపీపై దాడి నిదర్శనమన్నారు. సీనియర్ రాజకీయ వేత్తగా చంద్రబాబుపై రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. లేకుంటే రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుందన్నారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో టీడీపీ ప్రభుత్వం విఫలం అయిందని వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని వైసీపీ నేత జగన్మోహన్రెడ్డి కోరడం సరైంది కాదన్నారు. రాజ్యాంగంపై నమ్మకం ఉన్న ఏపార్టీ రాష్ట్రపతి పాలన కోరదన్నారు. మదనపల్లెలో అగ్నిప్రమాదం కుట్రపూరితమైందని వెంటనే నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ సీనియర్ నాయకులు జగన్నాథం, జిల్లా సహయ కార్యదర్శి ఎస్ మునెప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజాసాహెబ్, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.