. చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీం కీలక ఆదేశం
. ధర్మాసనం ఎదుట హాజరైన ఎన్నికల అధికారి
. ‘ఎక్స్’ మార్క్ ఎందుకు వేశారని ప్రశ్న
న్యూదిల్లీ : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మేయర్ ఎన్నికలో వినియోగించిన బ్యాలెట్ పత్రాలు, వీడియోలను సుప్రీంకోర్టుకు తీసుకురావాలని… ఇందుకోసం ఒక జ్యుడిషియల్ అధికారిని నియమించాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించింది. బ్యాలెట్ పేపర్లు, కౌంటింగ్ వీడియోను మంగళవారం పరిశీలిస్తామని తెలిపింది. హైకోర్టు జనరల్ నియమించిన జ్యుడిషియల్ అధికారికి తగిన భద్రత కల్పించాలని కూడా సుప్రీంకోర్టు చండీగఢ్ పాలనా అధికారులను ఆదేశించింది. ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ వేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ‘ఎన్నికల అధికారిని విచారణ చేయాల్సి ఉంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మేమే చండీగఢ్ మేయర్ ఎన్నికల బ్యాలెట్ పత్రాలు, వీడియో రికార్డులను పరిశీలిస్తాం’ అని ధర్మాసనం పేర్కొంది. మేయర్ ఎన్నికలపై కేసును మంగళవారం కాకుండా వేరే రోజు విచారించాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. సుప్రీంకోర్టు గత ఆదేశాల మేరకు చండీగఢ్ మేయర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ మసీప్ా అత్యున్నత న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. బ్యాలెట్ పేపర్లపై ఎందుకు ‘ఎక్స్’ మార్క్ వేశారని ప్రశ్నించింది. ‘అప్పటికే చెల్లబాటు కాని ఎనిమిది బ్యాలెట్ పేపర్లపై ‘ఎక్స్’ గుర్తు వేశాను. అప్పుడు ఆప్ కౌన్సిలర్లు గందరగోళం సృష్టించారు. బ్యాలెట్ పేపర్లు లాక్కోవడానికి ప్రయత్నించారు’ అని ధర్మాసనం ఎదుట అనిల్ మసీప్ా తెలిపారు. కాగా మసీప్ాను మంగళవారం కూడా విచారణకు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. ఒక రిటర్నింగ్ అధికారిని ప్రధాన న్యాయమూర్తి విచారణ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి.
సుప్రీంకు ఆప్ కౌన్సిలర్
జనవరి 30న జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో తగినంత సంఖ్యా బలం(16) లేకపోయినా బీజేపీ మేయర్ అభ్యర్థి మనోజ్ సోంకర్ అనూహ్య విజయం సాధించారు. మెజారిటీకి అవసరమైన కౌన్సిలర్ల బలం(20) ఉన్నప్పటికీ ఆప్- కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కుల్దీప్ కుమార్ ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో పట్టపగలే మోసం జరిగిందని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఎన్నికల అధికారి బ్యాలెట్ పత్రాలపై పెన్నుతో ఏదో రాసి.. వాటిలో కొన్నింటిని చెల్లకుండా చేశారని కాంగ్రెస్, ఆప్ ఆరోపించాయి. ఈ క్రమంలోనే ఎన్నికల రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 5న విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎన్నికల అధికారిపై తీవ్ర స్థాయిలో మండిపడిరది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసినట్లు వీడియో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. ‘ఎన్నికల నిర్వహణ తీరు ఇదేనా? ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇది ప్రజాస్వామ్యం హత్యే. ఆయనపై విచారణ జరపాలి’ అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు, వీడియోగ్రఫీని భద్రపరచాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి వ్యక్తిగతంగా ఫిబ్రవరి 19న హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు రిటర్నింగ్ అధికారి అనిల్ మసీప్ా సోమవారం హాజరయ్యారు.
మేయర్ రాజీనామా
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న కేసు సుప్రీంకోర్టులో విచారణ జరిగిన ముందు రోజే(ఆదివారం) మేయర్ పదవికి మనోజ్ సోంకర్ రాజీనామా చేశారు. మరోవైపు, మేయర్ రాజీనామా చేసిన రోజే ముగ్గురు ఆమ్ ఆద్మీ పార్టీ( ఆప్) కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. కొత్తగా బీజేపీలోకి మారిన వారితో కలిపితే బీజేపీ కౌన్సిలర్ల సంఖ్య 14కు చేరింది. ఆప్కు 13, కాంగ్రెస్కు 7, శిరోమణి అకాలీదళ్కు ఒక కౌన్సిలర్ ఉన్నారు.