రెడ్డిగూడెం`విశాలాంధ్ర: పేదలకు భూమి హక్కు పట్టాల సాధన కోసం సీపీఐ పోరుయాత్ర చేపట్టింది. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కొత్తనాగులూరు ప్రధాన సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నాలుగు వేలమంది పేదలు అరుణ పతాకాలతో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సీహెచ్ కోటేశ్వరరావు నాయకత్వంలో సాగిన ర్యాలీని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ జెండా ఊపి ప్రారంభించారు. ప్రదర్శనలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రదర్శకులు అరుణపతాకాలను చేబూని, నినాదాలు చేస్తూ క్రమశిక్షణతో ప్రదర్శనలో సాగారు. ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములకు భూహక్కు పత్రాలు ఇవ్వాలనీ, ఎర్రజెండా వర్థిల్లాలనీ, సీపీఐ జిందాబాద్ అన్న ప్రదర్శకుల నినాదాలతో రెడ్డిగూడెం మారుమోగింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ 30 ఏళ్లుగా భూములు సాగుచేసుకుంటున్న పేదలకు…ఆ భూములపై హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. సాగుదార్ల పేర్లను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసి…పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. పేద సాగుదారులందరికీ పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేంతవరకు న్యాయ పోరాటం చేస్తామన్నారు. అక్కినేని వనజ మాట్లాడుతూ పేదలు సాగు చేసుకుంటున్న భూములపై పెద్దల కన్నుపడిరదని, ఆ భూములు సాగుదారులకే లభించేందుకు వ్యవసాయ కార్మిక సంఘం, సీపీఐ అధ్వర్యంలో పోరాటం చేయడానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వ హయాంలో పేదలు నిత్యావసరాలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందన్నారు. గ్యాస్ బండ అమాంతం రూ.1200లకు పెంచారని విమర్శించారు. సీహెచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ 30 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న పేదలకు భూ హక్కు పత్రాలు ఇవ్వాలని కోరుతూ పోరుయాత్ర చేపట్టామన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో పోరుయాత్రలో పాల్గొన్న పేదలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వ్యక్తిగత అర్జీలతో పాటు వినతిపత్రాన్ని తహసీల్దార్ ఎం.పాల్కు సీపీఐ నాయకులు అందజేశారు. తహశీల్దార్ స్పందిస్తూ హక్కుదారులందరినీ గుర్తించి సంబంధిత నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. కాగా, పేదలు తమ వెంట తెచ్చుకున్న భోజనాలను ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోనే జల్లి విల్సన్, అక్కినేని వనజ, సీహెచ్ కోటేశ్వరరావుతో కలిసి తిన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు సీహెచ్ దుర్గా కోటేశ్వరరావు, సీపీఐ మైలవరం నియోజకవర్గ కార్యదర్శి బుడ్డి రమేశ్, రెడ్డిగూడెం మండల కార్యదర్శి అడపా సుబ్బారావు, నాయకులు కోటి శ్రీనివాసరావు, మట్టకొయ్య సాంబయ్య, కోట సుబ్బారావు, నమ్మిక శ్రీను, మండపల్లి ప్రసాద్, జమ్మి వెంకటేశ్వరరావు, నక్కనబోయిన నాగేశ్వరరావు, దిరిశనపు బుడ్డాయి, సగ్గుర్తి కోటేశ్వరరావు, పల్లెపాం గోవర్థన, కొప్పుల రవి, పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.