. పంజాబ్`హరియాణా సరిహద్దుల్లోనే అన్నదాతలు
. శంభు వద్ద గుండెపోటుతో రైతు మృతి
. మరోసారి రైతులపై బాష్పవాయువు
. కేంద్ర మంత్రులతో చర్చలు విఫలం
. రేపు మరో విడత భేటీ
న్యూదిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) దక్కేలా చట్టం తీసుకురావడంతో పాటు ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం రైతులు మొక్కవోని దీక్షతో ఉద్యమిస్తున్నారు. రైతు సంఘాలు చేపట్టిన ‘చలో దిల్లీ’ ఆందోళన నాలుగోరోజుకు చేరింది. కాగా రైతులు దేశ రాజధాని దిల్లీలోకి ప్రవేశించకుండా కేంద్రం, హరియాణాలోని బీజేపీ ప్రభుత్వాలు పారా మిలటరీ దళాలను ఉపయోగించి అణచివేతకు పాల్పడుతున్నప్పటికీ రైతులు వెనక్కు తగ్గడం లేదు. శుక్రవారం హరియాణాలోని అంబాలా సమీపంలోని శంభు సరిహద్దు వద్ద బారికేడ్ల వద్ద నిరసన తెలుపుతున్న రైతులను చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు మరోసారి బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. మరో పక్క కేంద్ర మంత్రులు, రైతు నాయకుల మధ్య గురువారం రాత్రి జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఫిబ్రవరి 18న నాలుగో విడత చర్చల కోసం కేంద్ర మంత్రులు, రైతు నేతలు సమావేశం కానున్నారు. ఫిబ్రవరి 8, 12 మరియు 15 తేదీల్లో రెండు పక్షాలు సమావేశమైనప్పటికీ ఎటువంటి సానుకూల ఫలితం రాలేదు. కేంద్రం దిగొచ్చి తమ డిమాండ్లను అంగీకరించే వరకు రోడ్లపైనే ఉంటామని రైతులు స్పష్టం చేస్తున్నారు. పంజాబ్కు చెందిన వేలాదిమంది రైతులు మంగళవారం జాతీయ రాజధాని దిల్లీకి తమ పాదయాత్రను ప్రారంభించగా…. హరియాణ, పంజాబ్ సరిహద్దులోని శంభు, ఖనౌరీ పాయింట్ల వద్ద భద్రతా బలగాలు వారిని జల ఫిరంగులు, బాష్పవాయు గోళాలను ప్రయోగించి అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అప్పటి నుంచి రెండు సరిహద్దు పాయింట్ల వద్ద రైతు నిరసనకారులు రహదారులపైనే బైఠాయించారు. ఈ క్రమంలోనే ఓ రైతు గుండెపోటుతో మృతి చెందడం కలకలం రేపింది. శంభు సరిహద్దులో నిరసనకారులలో ఉన్న 63 ఏళ్ల రైతు శుక్రవారం గుండెపోటుతో మరణించారు. ఈ ఘటనపై రైతుసంఘ నేత సర్వణ్ సింగ్ పంధేర్ తీవ్రంగా స్పందించారు. రైతు మరణానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ‘ఈ ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణం. వేలాది మంది రైతులు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. వాళ్లతో చాలా మంది వృద్ధులు కూడా ఉన్నారు. సరైన సమయానికి మాకు మందులు అందడం లేదు. తిండి తినడానికి కూడా వీల్లేకుండా పోయింది. విశ్రాంతి తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి’ అన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లాకు చెందిన జియాన్ సింగ్ ఉదయం ఛాతీ నొప్పితో బాధపడగా… పంజాబ్లోని రాజ్పురాలోని సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పాటియాలాలోని రాజింద్ర ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా గురువారం రైతు నాయకులతో జరిగిన చర్చల్లో కేంద్రం తరపున కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ పాల్గొన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గురువారం రాత్రి 8గంటల 45 నిమిషాలకు ప్రారంభమైన చర్చలు దాదాపు 5గంటల పాటు కొనసాగాయి. రెండు పక్షాలు ఒక్కో అంశంపై సవివరంగా చర్చించుకున్నాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తెలిపారు. వివిధ అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. సంగ్రూర్, పాటియాలా, ఫతేగఢ్ సాహిబ్లో ఇంటర్నెట్పై ఆంక్షల ఆంశాన్ని కేంద్రం ముందు లేవనెత్తినట్లు భగవంత్ మాన్ చెప్పారు. పంజాబ్లోని ఆందోళనకారులపై హరియాణా పోలీసులు డ్రోన్ను ఉపయోగించి బాష్పవాయువు గోళాలు ప్రయోగించడాన్ని కూడా తాను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. హరియాణా-పంజాబ్ సరిహద్దుల్లో శాంతి భద్రతలను కాపాడుతామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. కనీస మద్దతు ధర, రుణమాఫీకి చట్టపరమైన హామీ సహా తమ డిమాండ్లపై కేంద్రంతో వివరణాత్మక చర్చ జరిగిందని కిసాన్ మజ్దూర్ మోర్చా(ఎస్కేఎం) ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. ఈ క్రమంలో కేంద్రమంత్రులు అందుకు కొంత సమయం కావాలని కోరారని చెప్పారు. ప్రభుత్వంతో ఘర్షణ కాకుండా సానుకూల ఫలితం రావాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. రైతులు పంజాబ్-హరియాణా సరిహద్దుల్లోనే ఉంటారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘అవును’ అని పంధేర్ అన్నారు. అదే సమయంలో.. శాంతియుతంగా నిరసనలు కొనసాగించాలని రైతులకు సంఘాల నేతలు పిలుపుఇచ్చారు. చర్చల అనంతరం కేంద్రమంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ… ‘మేము కలిసి కూర్చొని పరిష్కారం కనుగొంటాము’ అన్నారు.