. అంగన్వాడీలవి అత్యవసర సేవలనుకుంటే 26 రోజులుగా ఏం చేశారు?
. లక్షమంది మహిళలకు న్యాయం చేయలేని సీఎం జగన్
. తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర బంద్ చేస్తాం
. వైసీపీ ప్రభుత్వానికి రామకృష్ణ, రాఘవులు హెచ్చరిక
విశాలాంధ్ర – విజయవాడ : ఎస్మా చట్టాన్ని రద్దు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని వక్తలు అన్నారు. లక్ష మంది మహిళల విషయంలో మూర్ఖంగా ప్రవర్తించిన ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే వరకు ప్రజలు ఊరుకుకోబోరని హెచ్చరించారు. అంగన్వాడీల సమ్మె ఆదివారానికి 26వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా విజయవాడ, ధర్నాచౌక్లోని శిబిరాన్ని సీపీఐ, కాంగ్రెస్, సీపీఎం, న్యూడెమొక్రసీ, అమ్ఆద్మీ, ఎంఎల్ పార్టీల నాయకులు సందర్శించి, సంఘాభావం తెలిపారు. సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు మాట్లాడుతూ అక్కా చెల్లెమ్మలంటూ అధికారంలోకి వచ్చిన తరువాత లక్షమంది అంగన్వాడీలకు అన్యాయం చేశారని సీఎం జగన్ను విమర్శించారు. ఐసీడీఎస్ను అత్యవసర సేవగా పరిగణించే ఎస్మా ప్రయోగించినట్లు చెబుతున్న మీరు… 26 రోజులుగా సమ్మె చేస్తుంటే వారి సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. ఎస్మా ప్రయోగించడం మూర్ఖత్వమని విమర్శించారు. చర్చల పేరుతో సమస్యలు పరిష్కరించకుండా బెదిరించారని, దొంగల వలే కార్యాలయాల తాళాలు పగులకొట్టించి ఉద్యోగులు, సిబ్బంది మధ్య ఘర్షణకు యత్నించారని దుయ్యబట్టారు. సాధికార యాత్ర పేరుతో ఊరూరా తిరుగుతూ లక్షమంది మహిళల గురించి పట్టించుకోని జగన్ ఏ సాధికారత సాధిస్తారని ప్రశ్నించారు. ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటు, జరగబోయే ఎన్నికల్లో సీటు ఆశించే వారికీ అంగన్వాడీలు తగు హెచ్చరిక జారీ చేయాలని సూచించారు. హైదరాబాద్లో కేసీఆర్ను పరామర్శిందుకు సమయం ఉన్న సీఎంకు అంగన్వాడీలతో మాట్లాడేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు. ఎస్మాను తక్షణమే ఎత్తివేయాలని, అంగన్వాడీలతో చర్చించి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే జగన్ను ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సీట్లు, ఓట్లు, అధికారం తప్ప సీఎంకు మరేమీ పట్టడం లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని దివాళా తీయించారని విమర్శిస్తే ఆర్థికస్థితి బాగుందనే ప్రభుత్వం… జీతాలు పెంచమంటే డబ్బులు లేవనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. జగన్ లాంటి మూర్ఖపు సీఎం రాష్ట్ర చరిత్రలో లేరని విమర్శించారు. అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించకుంటే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి రాష్ట్ర బంద్ చేస్తామని రామకృష్ణ హెచ్చరించారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలపై సోమవారం రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ నిర్వహించనున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు.
ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన అంగన్వాడీలలో భయం లేదని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ అన్నారు. అంగన్వాడీలు చేస్తున్నది న్యాయమైన పోరాటం కాబట్టే ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఫణిరాజ్ విమర్శించారు. అంగన్వాడీలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ నిలవలేదని హెచ్చరించారు. ప్రజలతో సంబంధం లేనట్లు పాలన సాగించే జగన్ను రాష్ట్ర ప్రజలు తాడేపల్లి ప్యాలెస్కు పరిమితం చేస్తారని ఎంఎల్ పార్టీ నేత జాస్తి కిషోర్బాబు హెచ్చరించారు. న్యూడెమొకసీ నేత మల్లిఖార్జునరావు మాట్లాడుతూ ఉద్యమాలను తేలికగా తీసుకునే ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించలేదని, తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలిత, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు, వి.ఉమా మహేశ్వరరావు, కమిటీ సభ్యులు కె. ధనలక్ష్మి, డీవీ కృష్ణ, ఐఎఫ్టీయూ నాయకులు కె.పొలారి, రవిచంద్ర, సీఐటీయూ అనుబంధం అంగన్వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బేబీరాణి, ఉపాధ్యక్షులు ఎన్సీహెచ్.సుప్రజ, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, నరహరిశెట్టి నరసింహారావు (కాంగ్రెస్), పోతిన రామారావు (జైభారత్ పార్టీ) పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర కోశాధికారి ఆర్.పిచ్చయ్య ఆలపించిన ఉద్యమ గీతాలు ఆకట్టుకున్నారు.
అన్నమయ్య జిల్లలో: అన్నమయ్య జిల్లాలో సుండుపల్లిలో అంగన్వాడీల శిబిరాన్ని మాజీ ఎమ్మెల్సే కత్తి నరసింహారెడ్డి సందర్శించి సంఫీుభావం తెలిపారు. అంగన్వాడీలకు వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని, పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు బుక్కే విశ్వనాథ్ నాయక్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి సుజాత, రజిని, రామతులసి, పద్మ, సంధ్యా లోకేశ్వరి, స్వర్ణకుమారి పాల్గొన్నారు.
ఎస్మా ప్రయోగం దుర్మార్గం: ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాల్సిందిపోయి వారిపై ఎస్మా ప్రయోగించడాన్ని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి. రామచంద్రయ్య, కేవీవీ ప్రసాద్ తీవ్రంగా ఖండిరచారు. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకి తెస్తూ జీవో నెం. 2ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని, ఇలాంటి ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించి గర్భిణులు, పిల్లలకు ఆసౌకర్యం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.