భారత్ను పావుగా వాడుకుంటున్న అమెరికా: సీపీఐ విమర్శ
న్యూదిల్లీ : భారత్ను అమెరికా పావులా వాడుకుంటున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాకు మోకరిల్లుతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) విమర్శించింది. ఈ మేరకు సీపీఐ జాతీయ కార్యదర్శివర్గం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తితో రాజీ పడే విధంగా అమెరికాతో రక్షణ ఒప్పందాలు చేసుకోవడాన్ని తప్పుపట్టింది. ఆసియాపసిఫిక్ ప్రాంతంలో తమ ఆధిపత్యవాద విధానాన్ని అమలు చేసేందుకు భారత్ను పావులా వాడుకుంటోందని సీపీఐ హెచ్చరించింది. అమెరికా ఉచ్చులో చిక్కుకోకుండా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ‘ఇటీవల అమెరికాలో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోదీ ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్తో కలిసి రెండు దేశాల సమగ్ర అంతర్జాతీయ
వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి సంకల్పించారు. ఇదే క్రమంలో లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ అవగాహన ఒప్పందం (ఎల్ఈఎంఓఏ)2016, కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ, సెక్యూరిటీ (సీఓఎంసీఏఎస్ఏ)
2018, బేసిక్ ఎక్స్ఛేంజ్, కోఆపరేషన్ (బీఈసీఏ)
2020ల ఒప్పందాలను కొనసాగించాలని నిర్ణయించారు. ఈ ఒప్పందాలన్నీ అమెరికా ముందు మోదీ మొకరిల్లేలా ఉన్నాయని పేర్కొంది. రక్షణ సహకారాన్ని, అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలను పెంపొందించేలా తాజా ఒప్పందాలు జరిగాయి. భారత్లో యుద్ధ సామాగ్రిని, సైనిక సమర్థ్యాన్ని సహ భాగస్వామ్యంలో పెంచుకునేలా ఒప్పందాలకు అవకాశం ఉన్నప్పటికీ లాజిస్టిక్స్, నిర్వహణ, మరమ్మతులకు అనుమతివ్వడం, అమెరికా నావికా, వైమానిక దళాల మోహరింపునకు మన నావికా స్థావరాలు, సైనిక విమానాశ్రయాలను వినియోగించేందుకు అంగీకరించడం సరైనది కాదు. ఇది వ్యూహాత్మక స్వయంప్రతిపత్తితో రాజీ పడటమే అవుతుందని పేర్కొన్నది. హిందూ మహాసముద్రంలోనూ ఇటువంటి చర్యలకు పూనుకునే విధంగా మిగతా శక్తులకు ప్రేరణ లభిస్తుందని హెచ్చరించింది. పర్యవసానంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో అస్త్రాల పోటీ పెరుగుతుందని సీపీఐ పేర్కొంది. ఉక్రెయిన్లో యుద్ధం, మైన్మార్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ గురించి సంయుక్త ప్రకటన పేర్కొందిగానీ పలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ నిత్యదాడులు, దురాగతాలపై రెండు దేశాలు మౌనం వహించాయని వ్యాఖ్యానించింది.