నేటి నుంచి పార్లమెంటు
. అస్త్రశస్త్రాలతో అధికార, విపక్షాలు
. మణిపూర్, అధిక ధరలు, దిల్లీ ఆర్డినెన్స్పై చర్చకు విపక్షాల పట్టు
. 31 కొత్త బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం
న్యూదిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. మణిపూర్ హింసాకాండ, ధరల పెరుగుదల, దిల్లీ ఆర్డినెన్స్ వంటి అనేక ప్రజాసమస్యలపై ప్రతిపక్షాలు మోదీ సర్కారును నిలదీయడానికి సమాయత్తమయ్యాయి. కేంద్రం కూడా అంతే దీటుగా స్పందించాలని నిర్ణయించుకుంది. తాజాగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కూటమిగా ఏర్పడి మంచి ఉత్సాహంగా ఉండగా…బీజేపీ కూడా ఎన్డీఏ పక్షాల సమావేశంతో ఎదురుదాడికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఆగస్టు 11వ తేదీతో ముగియనున్న ఈ సమావేశాల్లో 17 సిట్టింగ్స్ ఉంటాయి. మోదీ నిరంకుశత్వం, ప్రతిపక్షాలపై దాడులు, ఈడీ, సీబీఐ వంటి సంస్థల దుర్వినియోగం, పార్టీలను చీల్చే యత్నాలు, ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేయడం, కక్షసాధింపు రాజకీయాలు వంటి అంశాలపై పార్లమెంటు సమావేశాలు వేడెక్కనున్నాయి. ఉమ్మడి వ్యూహంతో పార్లమెంటును కుదిపివేయాలనేంత కసితో ప్రతిపక్షాలు ఉన్నాయి. ఏడాది చివరిలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో అధికారవిపక్షాలు తమకున్న అన్ని అస్త్రాలకు పదును పెడుతున్నాయి. మణిపూర్లో రగిలిన అగ్ని కీలల వేడి పాలకులకు తాకేలా చేయబోతున్నాయి. ఈశాన్య రాష్ట్ర పరిస్థితులపై చర్చ విషయంలో రాజీ పడేది లేదని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంచేశాయి. దిల్లీలో అధికారుల బదిలీ/నియామకాల అధికారాల ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తామని ప్రకటించాయి. దిగిరాని నిత్యావసరాల ధరలు, పెరిగిపోతున్న నిరుద్యోగం వంటి అనేక అంశాలతో పార్లమెంటు సమావేశాల అజెండాను సిద్ధం చేశాయి. ‘ఇండియా’గా 26 పార్టీలు కలిసి మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టనున్నాయి. ఎన్నికైన రాష్ట్రాల హక్కులను, అధికారాలను హరించే విధంగా దిల్లీ ఆర్డినెన్స్ ఉందని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని ఆప్తో పాటు అనేక పార్టీలు మోదీ సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నాయి. దీంతో మొదట ఇదే బిల్లును చట్టసభల్లో ప్రవేశపెడతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాము ప్రభుత్వానికి సహకరించే విధంగా సానుకూల దృక్పథంలో పార్లమెంటు సమావేశాలకు వస్తామని, సభలు సజావుగా జరిపించడం ప్రభుత్వం బాధ్యత అని ప్రతిపక్షాలు తేల్చాయి. నచ్చితే తీసుకోండి లేదంటే వదిలేయండి అనే వైఖరి, నా దారి రహదారి అన్న పద్ధతిని విడనాడి ప్రజా సంబంధమైన కీలకాంశాలపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉండాలని హితవు పలికాయి. ప్రతిపక్షాలది ఉమ్మడి వ్యూహమని, తాము వేసే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు సర్కార్ సిద్ధంగా ఉండాలని, మణిపూర్పై ఇప్పటివరకు పెదవి విప్పని ప్రధాని... ఆ అంశంపై చర్చకు తప్పక హాజరు కావాలని కోరాయి. ఇదిలావుంటే, మొత్తం 31 కొత్త బిల్లులను ఈసారి సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. డిజిటల్ వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు, జనన
మరణాల (సవరణ) బిల్లు వంటి కొన్ని కీలక బిల్లులు ఉభయసభల ఆమోదం కోసం రాబోతున్నాయి. జాతీయ నర్సింగ్ కమిషన్ బిల్లును సమావేశాల మొదటి రోజు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుక్ మాండవియా ప్రవేశపెట్టనున్నారు. 1948 నాటి డెంటిస్టుల చట్టం రద్దు, జాతీయ డెంటల్ కమిషన్ ఏర్పాటు కోసం జాతీయ డెంటల్ కమిషన్ బిల్లు లోక్సభ ముందుకు రానుంది. ఔషధాలు, వైద్య పరికరాలు, కాస్మెటిక్స్ బిల్లు, పురాతన కట్టడాలు, పురావస్తు ప్రాంతాల (సవరణ) బిల్లు, జాతీయ సహకార విశ్వవిద్యాలయ బిల్లు వంటివి కొత్త బిల్లుల్లో ఉండగా పెండిరగ్ బిల్లుల్లో జనవికాస్ బిల్లు ఉంది. కాగా, ప్రభుత్వం బుధవారం నిర్వహించిన అఖిలపక్షం సమావేశానికి 34 పార్టీల నేతలు హాజరయ్యారు.
ప్రవేశపెట్టనున్న బిల్లులు: సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు, 2019, డీఎన్ఏ టెక్నాలజీ (వినియోగం) నియంత్రణ బిల్లు`2019, మధ్యవర్తిత్వ బిల్లు 2021, బహుళ రాష్ట్ర సహకార సంఘాల (సవరణ) బిల్లు 2022, రాజ్యాంగ (ఎస్టీ) ఆర్డర్ (మూడో సవరణ) బిల్లు 2022, పోస్టల్ సేవల బిల్లు 2023, అంతర్జాతీయ ద్రవ్యనిధి, బ్యాంకు బిల్లు 2023, ప్రావిషనల్ పన్నుల వసూళ్ల బిల్లు 2023, జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు, ప్రెస్, రిజిస్ట్రేషన్ పీరియాడికల్స్ బిల్లు 2023, న్యాయవాదుల (సవరణ) బిల్లు 2023, గనులు, ఖనిజాలా బిల్లు, రైల్వే (సవరణ) బిల్లు 2023, జాతీయ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లు 2023, రాజ్యాంగం (జమ్ముకశ్మీర్) ఎస్టీలు/ఎస్సీల ఆర్డర్ (సవరణ) బిల్లులు.