ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: మణిపూర్ మారణకాండకు ప్రధాని మోదీ విధానాలే కారణమని, ఘటనకు పాల్పడిన మానవమృగాలను ఉరితీయాలని, దేశంలో మతచిచ్చురేపుతూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న ఆరెస్సెస్ను నిషేధించాలని, అసమర్థ ప్రధాని రాజీనామా చేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు.మణిపూర్లో హింసాకాండను ఖండిస్తూ, బాధితులకు సంఫీుభావంగా సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ, సంఘాల శ్రేణులు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో భగత్ సింగ్ సెంటర్ నుంచి బోసు బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ డౌన్ డౌన్, అసమర్ధ మోదీ రాజీనామా చేయాలి, మణిపూర్ లో శాంతి నెలకొల్పాలని బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ గత రెండున్నర మాసాలుగా గిరిజన జాతుల మధ్య ఘర్షణలో మణిపూర్ రావణకాష్టంగా మారితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదన్నారు. ప్రజల మధ్య కులాలు, మతాలు పేరుతో విద్వేషాలు రగిల్చి దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా మోదీ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ అజెండా అమలు చేయడమే ధ్యేయంగా కేంద్ర పాలన సాగుతోందన్నారు. క్రైస్తవులు, గిరిజనులు, మైనారిటీలపై విచ్చలవిడిగా దాడులు చేసి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని, తక్షణం రాష్ట్రపతి జోక్యం చేసుకొని శాంతి భద్రతలను కాపాడేందుకు రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవుల శేఖర్, కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కుట్రే: ఓబులేసు మణిపూర్ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న మారణకాండ డబుల్ ఇంజిన్ సర్కార్ కుట్రేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఓబులేసు విమర్శించారు. ఈ కుట్ర వెనుక ఆర్థిక, రాజకీయ, మతపర కోణం దాగి ఉందని స్పష్టం చేశారు. మణిపూర్లో జరుగుతున్న మారణహోమంపై రాజకీయ పార్టీలు
ప్రజా సంఘాలతో గుంటూరు మల్లయ్యలింగంభవన్లో మంగళవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఓబులేసు మాట్లాడుతూ గత 80 రోజులుగా మణిపూర్లో అనేక ఆకృత్యాలు చోటుచేసుకుంటుంటే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం దుర్మార్గమన్నారు. ఇప్పటికే మణిపూర్ రాష్ట్రంలో రగులుతున్న అగ్నికీలలో చిక్కుకుని 35 వేల మంది వరకు నిరాశ్రయులై ఇతర ప్రాంతాలలో తలదాచుకుంటున్నారని, సుమారు 160 మంది వరకు ప్రాణాలు విడిచారని తెలిపారు. మహిళా సాధికారత, బేటి బచావో`బేటి పడావో నినాదం ఇదేనా అంటూ ప్రశ్నించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, సీపీఐ(ఎంఎల్) రెడ్స్టార్ రాష్ట్ర సమితి సభ్యులు మన్నవ హరిప్రసాద్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు వి.నరసింహారావు, ఎంసీపీఐ(యు) నాయకులు కె.శ్రీధర్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు గనిరాజు మాట్లాడుతూ విదేశీ పర్యటనలకు సమయం కేటాయిస్తున్న మోదీకి మణిపూర్ ఘటనలపై స్పందించేందుకు సమయం లేకపోవడం శోచనీయమన్నారు.
ప్రధాని అసమర్థత వల్లే మణిపూర్లో హింసాకాండ: పి.హరినాథరెడ్డి
మణిపూర్ హింసకాండకు మోదీ విధానాలే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి విమర్శించారు. తిరుపతి బైరాగి పట్టెడ పద్మావతి పార్క్ సర్కిల్ మణిపూర్ హింసకాండను అరికట్టాలని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ట్రం మణిపూర్ లో గత కొన్ని నెలలుగా ప్రజలు మంటల్లో మాడిపోతుంటే అదుపు చేయలేని అసమర్థులు మోదీ, అమిత్షా అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ రామానాయుడు, జిల్లా కార్యదర్శి పి మురళి, నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి, జిల్లా కార్యదర్శి కె.రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి నదియా మంజుల తదితరులు పాల్గొన్నారు.
మానవ మృగాలను తక్షణమే ఉరితీయాలి: ఈశ్వరయ్య
మణిపూర్ రాష్ట్రంలో గిరిజన మహిళలను అమానుషంగా నగ్నంగా ఊరేగించిన అత్యాచారం చేసిన మానవ ఉన్మాదులను తక్షణమే ఉరితీయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి. ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా తొండూరులో సీపీఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ మణిపూర్ లో జరుగుతున్న మరణ హోమానికి మత భావజాల ఉగ్రవాద సంస్థ ఆర్ఎస్ఎస్ కారణమని, దేశంలో ఆర్ఎస్ఎస్ను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ ఘటనపై రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు మాట్లాడకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పులివెందుల ఏరియా కార్యదర్శి వెంకట రాములు, తొండూరు మండల కార్యదర్శి మురళి’ లక్ష్మీనారాయణ,రవి,రామాంజనేయులు, బాబు తదితరులు పాల్గొన్నారు
మణిపూర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి : అక్కినేని వనజ, కేవీవీ ప్రసాద్
మణిపూర్ రాష్ట్రంలో మహిళలలను నగ్నంగా ఊరేగించిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని, మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లను అరికట్టాలని,బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి,రాష్ట్రపతి పాలన విధించాలని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. విజయవాడ లెనిన్సెంటర్లో మంగళవారం రైతు, మహిళ, విద్యార్థి,యువజన, కార్మిక, వ్యవసాయ కార్మిక తదితరులు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతుసంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డేశోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ మణిపూర్ లో మహిళలపై మారణ హోమం జరుగుతుంటే దృతరాష్ట్రుల్లా కేంద్ర, రాష్ట్ర మంత్రులు గుడ్లప్పగించి చూడడం దుర్మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.రవీంద్రనాథ్, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.దుర్గాభవాని, రైతుసంఘం సినీయర్ నాయకులు వై.కేశవరావు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఏవీ నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు ఏ.వెంకటేశ్వర రావు, రైతుసంఘం రాష్ట్ర నాయకులు పి.జమలయ్య ఐద్వా రాష్ట్ర నాయకులు కే.శ్రీదేవి, ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనురాధ, పీఓడబ్ల్యూ పద్మ, కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ, కార్మిక సంఘ నేతలు హరనాథ్,ఎం హరిబాబు,పోలారి, తదితరులు పాల్గొన్నారు.
మోదీ పాలనలో మహిళలకు రక్షణ కరువు: పి.రామచంద్రయ్య
మణిపూర్ రాష్ట్రంలో జరిగిన దమనకాండకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు పి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. మంగళవారం కర్నూలు, నంద్యాల జిల్లాలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన కార్యక్రమంలో రామచంద్రయ్య, కర్నూలులో సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు, ఆలూరులో సీపీఐ కర్నూలు జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, డోన్లో నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు పాల్గొని ఆందోళనలు నిర్వహించారు.
మణిపూర్లో హింసాకాండను అరికట్టాలి:
డేగా ప్రభాకర్
మణిపూర్ రాష్ట్రంలో మతోన్మాదుల హింసలను అరికట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మణిపూర్ రాష్ట్రంలో మతోన్మాదుల హింసలను ఆపాలని, కేంద్ర ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడాలని కోరుతూ సీపీిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సెంటర్, అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న డేగా ప్రభాకర్ మాట్లాడుతూ రెండు తెగల మధ్య విద్వేషాలను బీజేపీ రాష్ట్ర ప్రభుత్వమే కావాలని రెచ్చగొడుతున్నదని విమర్శించారు. జిల్లా కార్యవర్గ సభ్యురాలు కొండేటి బేబీ. ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్,సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో
మణిపూర్ హింసాకాండకు నిరసనగా, బాధితులకు మద్దతుగా మైలవరం, రెడ్డిగూడెంలలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సీహెచ్ కోటేశ్వరరావు, జగ్గయ్యపేటలో జరిగిన నిరసన కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ సెక్రటరీ దోనేపూడి శంకర్, నాయకులుబుడ్డి రమేష్, సీహెచ్ దుర్గ కోటేశ్వరరావు, జూనెబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణాజిల్లా గన్నవరంలో నిరసన కార్యక్రమం జరిగింది.