. విపక్షాల వాకౌట్
. ఓటింగ్ బహిష్కరణ
. ప్రతిపక్షాలపై అమిత్ షా ఆరోపణలు
న్యూదిల్లీ : వివాదాస్పద దిల్లీ బిల్లును లోక్సభ ఆమోదించింది. దీనిని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించినా, చట్టసభల్లో ఆందోళనకు దిగినా, వాకౌట్ నిర్వహించినాగానీ కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించింది. దిగువ సభలో బలం ఉన్నందున అనుకున్నది సాధించింది. దిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలు వంటి అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకునే విధంగా దిల్లీ బిల్లును తీసుకొచ్చింది. దిల్లీ బిల్లుకు వ్యతిరేకంగా ఇండియా కూటమిలోని పార్టీలతో పాటు బీఆర్ఎస్ ఎంపీలు కూడా వాకౌట్ చేశారు. బిల్లును లోక్సభకు ప్రతిపాదించిన కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం దానిపై చర్చను కూడా ప్రారంభించారు. నాలుగున్నర గంటల పాటు చర్చ జరిగింది. దిల్లీతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి చట్టాలు చేసే పూర్తి స్వేచ్ఛ ` అధికారం కేంద్రానికి ఉందని చెప్పారు. ఇదే క్రమంలో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఈ బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత విపక్షం కుప్పకూలిపోవడం ఖాయమని చర్చ సమయంలో అమిత్షా అన్నారు. దిల్లీలోని ఆప్ ప్రభుత్వం నిబంధనలకు కట్టుబడి వ్యవహరించడం లేదని, అసెంబ్లీ సమావేశాలను కూడా క్రమంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. దిల్లీ కేబినెట్ సమావేశాలు కూడా క్రమపద్ధతిలో జరగడం లేదన్నారు. ఈ బిల్లు రాజ్యాంగబద్ధమైంది, దిల్లీ ప్రజలకు ప్రయోజనకారిగా ఉంటుందని అమిత్షా అన్నారు. దిల్లీ బిల్లుకు మద్దతు తెలపాలని ప్రతిపక్షాలకు సూచించారు. అయితే లోక్సభలో బిల్లుకు ఆమోదం లభించే క్రమంలో అనేక మంది ప్రతిపక్ష సభ్యులు నిరసనగా వాకౌట్ చేశారు. అంతకుముందు అమిత్షా మాట్లాడుతూజవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ వంటి నేతలు దిల్లీకి రాష్ట్ర హోదాను వ్యతిరేకించారని అన్నారు. మీ కూటమిలో ఉన్నారన్న ఒక్క కారణంతో దిల్లీలో జరుగుతోన్న అవినీతికి మద్దతు పలకొద్దని ప్రతిపక్షాలనుద్దేశించి అన్నారు. ప్రధాని మోదీ పూర్తి మెజార్టీతో విజయం సాధిస్తారని దీమాగా చెప్పారు. ‘2015లో దిల్లీలో ఆప్ అధికారంలోకి వచ్చింది. బదిలీల అంశం కాదు వారి బంగళాల నిర్మాణం వంటి వాటిల్లో జరుగుతోన్న అవినీతిని దాచేందుకు విజిలెన్స్ విభాగాన్ని నియంత్రిస్తుండటమే అసలు సమస్య. 2015 ముందు వరకు వివిధ ప్రభుత్వాల అధ్వర్యంలో దిల్లీలోని పరిపాలన సజావుగా సాగింది. జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లాభాయ్ పటేల్, సి. రాజగోపాలచారి, రాజేంద్ర ప్రసాద్, బీఆర్ అంబేద్కర్ వంటి నేతలు దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలన్న ఆలోచనను వ్యతిరేకించారు. దేశ రాజధానిలో ప్రభుత్వాధికారులపై ఎవరి నియంత్రణ ఉండాలన్న విషయంపై కొన్నేళ్లుగా కేంద్రం, ఆప్ ప్రభుత్వానికి మధ్య న్యాయపోరాటంపై కొద్ది నెలల క్రితం ఆప్ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఐఏఎస్లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై దిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని స్పష్టం చేసింది. అనంతరం పరిపాలన సేవలపై నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్కు అప్పగించేలా కేంద్రం ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. దాని స్థానంలో రూపొందించిన బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లో లోక్సభలో ప్రవేశపెట్టింది. దిల్లీకి సంబంధించి ఏ అంశంపైన అయినా పార్లమెంట్కు చట్టం చేసే అధికారం ఉందని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆ ఆర్డినెన్స్ వెల్లడి చేస్తోంది. దిల్లీకి సంబంధించి చట్టాలను రూపొందించేందుకు రాజ్యాంగంలోని నిబంధనలు అనుమతి ఇస్తున్నాయి’ అని అమిత్ షా అన్నారు.
ఆప్ ఎంపీ సస్పెన్షన్
ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రింకు బిల్లుకు సంబంధించిన పత్రాలను చించి సభాపతి మీదకు విసిరారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా ఆయనను సభ ముగిసేంత వరకు సస్పెండ్ చేశారు. మూజువాణి ఓటు ద్వారా సస్పెన్షన్ను సభ ఆమోదించింది. ఈనెల 11తో సమావేశాలు ముగియనుండగా అప్పటివరకు పార్లమెంటుకు హాజరు కావద్దని రింకును స్పీకర్ ఆదేశించారు.
ఆయనది ఎన్నికల ప్రసంగం: అధిర్ రంజన్
దిల్లీ బిల్లుపై లోక్సభలో ఓటింగ్ను ప్రతిపక్షాలు బహిష్కరించాయి. ఏ అంశంపై ప్రతిపక్ష నేతలను మాట్లాడనివ్వకుండా అమిత్షా సభలో ఎన్నికల ప్రసంగం చేశారని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు. ఎన్నికైన ప్రభుత్వాల హక్కుల హరణే కేంద్రం కోరేదన్నారు. ప్రతిపక్షాలను దూషిస్తూ ఎన్నికల ప్రసంగాన్ని అమిత్షా చేశారని వ్యాఖ్యానించారు. మణిపూర్తో పాటు మరికొన్ని అంశాలపై అమిత్షా నుంచి స్పష్టతను కోరాలని భావించగా తమను మాట్లాడనివ్వలేదన్నారు. చర్చ సమయంలో ప్రతిపక్ష సభ్యులంతా ప్రశాంతంగా ఉన్నారని, అమిత్షాను కూడా అడ్డుకోలేదని, అయినాగానీ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తమ పార్టీని దూషించారని డీఎంకే నేత టీఆర్ బాలు అన్నారు.
అమిత్షా, అధిర్ రంజన్ మధ్య ఆసక్తికర సంభాషణ
లోక్సభలో అమిత్ షా, అధిర్ రంజన్ చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. నెహ్రూ కూడా దిల్లీకి రాష్ట్ర హోదా వ్యతిరేకించారని అమిత్ షా అనగా అధిర్ రంజన్ స్పందిస్తూ. ‘సభలో నెహ్రూ, కాంగ్రెస్ పార్టీని పదేపదే అమిత్షా పొగడటం బాగుంది. ఇది నిజమేనా? ఇది పగలా లేక రాత్రా? అనిపించింది. అమిత్ షా వద్దకు పరిగెత్తి నోరు తీపిచేయాలనిపించింది. ఆ నోటి నుంచి వచ్చిన పొగడ్తలు ఆశ్చర్యపర్చాయి’ అని అన్నారు. ఇంతలో అమిత్ షా కలగజేసుకొని ‘నెహ్రూను పొగడలేదు. ఆయన మాటను ప్రస్తావించాను. దీనిని పొగడ్త అనుకుంటే అభ్యంతరం లేదు’ అని బదులిచ్చారు. మణిపుర్, హరియాణా ఘటనలు మాత్రం మీకు కనిపించవు. దిల్లీలో కుంభకోణాలు జరుగుతున్నాయని మీరు భావిస్తేగనుక ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు ఉన్నాయిగా. మీరు ఆరోపిస్తున్న కుంభకోణాల కోసం ఈ బిల్లు తేవాల్సిన అవసరముందా..?’ అని ప్రశ్నించారు.