ఏడు నుంచి దక్షిణాది రాష్ట్రాల పర్యటన
న్యూదిల్లీ: సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. అందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయడానికి సమాయత్తమవుతోంది. అందులో భాగంగా వచ్చేవారం నుంచి దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఈసీ పర్యటనలు చేపట్టనుంది. తొలి విడతగా దక్షిణాది రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించనుంది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్చంద్ర పాండే, అరుణ్ గోయల్తో కూడిన బృందం జనవరి 7 నుంచి రాష్ట్రాల్లో పర్యటించనుంది. జనవరి 7 నుంచి 10వ తేదీ మధ్య తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఈసీ బృందం వెళ్లనున్నట్లు అధికారులు వెల్లడిరచారు. ఇప్పటికే డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు దాదాపు అన్ని రాష్ట్రాల్లో పర్యటించి… లోక్సభ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించారు. ఈసీ బృందం రాష్ట్రాల పర్యటనకు ముందు… వీరు ఎన్నికల సంఘానికి తమ నివేదిక ఇవ్వనున్నారు. కాగా, లోక్సభ ఎన్నికల నిర్వహణకు ముందు ఈసీ రాష్ట్రాల్లో పర్యటించడం సర్వసాధారణం. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, సీనియర్ పోలీసులు, పాలనా విభాగ అధికారులు, క్షేత్రస్థాయిలో ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందితో ఈసీ సమీక్షలు నిర్వహిస్తుంది. అయితే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈసీ బృందం పర్యటిస్తుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఇటీవలే ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాల్లో పర్యటన ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈసీ దేశవ్యాప్త పర్యటన పూర్తయిన అనంతరం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. 2019లో మార్చి 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా… ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఫలితాలు ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.