ఏపీలో వర్షాలు ఊపందుకున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో 48 గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దీంతో రాష్ట్రంలో అనేక చోట ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రానికి బలహీనపడింది. ఈ ప్రభావంతో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయంటున్నారు.ఉత్తర కోస్తా, యానం ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వానలకు అవకాశం ఉందంటున్నారు. బుధవారం తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిస్తాయని అంచనా వేస్తున్నారు. నేడు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అత్యధికంగా 4.9 సెంటీమీటర్లు, పాతపట్నంలో 3.1, పలాసలో 3, మందసలో 2.8, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో 2.5, పల్నాడు జిల్లా అచ్చెంపేటలో 2, శ్రీకాకుళం జిల్లా సోంపేటలో 2 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడ్డాయి.