తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేస్తోంది. ఈ కారణంగా వాతావరణం అనుకూలించకపోవటంతో గన్నవరం ఎయిర్పోర్టులో మూడు విమానాలు అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. చండీఘర్ నుంచి హైదరాబాద్, గోవా నుంచి హైదరాబాద్, తిరువనంతపురం నుంచి హైదరాబాద్కు రావల్సిన విమానాలను అత్యవసరంగా గన్నవరం ఎయిర్పోర్టులో ల్యాండ్ చేశారు. ఒక్కో విమానంలో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఢిల్లీ, హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులను పొగమంచు కమ్మేసింది. దీంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పొగమంచు వల్ల వాతావరణం అనుకూలించికపోవడంతో మరికొన్ని విమానాలను దారి మళ్లించారు. ఉదయం 07:35 గంటలకు మస్కట్ నుంచి శంషాబాద్ రావాల్సిన ఒమాన్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. ఉదయం 8:05 గంటలకు రియాద్ నుంచి రావలసిన విమానం.. ఉదయం 9:10 గంటలకు జెడ్డా నుంచి రావాల్సిన విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు. పలు విమానాలు బెంగళూరు, నాగపూర్కు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా దట్టమైన పొగమంచు అలముకుంది. జాతీయ రహదారులపై ప్రయాణికులు కోల్కతా రహదారిపై కూడా పలు ప్రాంతాల్లో డ్రైవర్లు వాహనాలను నిలిపి వేశారు. ఎదురుగా వచ్చే , వెళ్ళే వాహనాలు కూడా కనిపించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై జగ్గయ్యపేట ప్రాంతంలో పొగ మంచు భారీగా అలుముకుంది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో రహదారి పక్కన వాహనాలు టీ స్టాల్స్, హోటళ్ళు వద్ద వాహనాలు నిలిపివేశారు.