నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే బ్రాండ్ తనకు అవసరం లేదని ఆయన అన్నారు. తనను వైసీపీ నుంచి బహిష్కరించారని… అయితే, ఎమ్మెల్యే పదవి నుంచి మాత్రం తొలగించలేరని చెప్పారు. తాను వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తనకు పోటీగా ఒక అనధికారిక ప్రతినిధిని పెట్టారని విమర్శించారు. ఆయన కారణంగానే తాను ఏడాది కాలంగా నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉన్నానని చెప్పారు. వెంటకటగిరి అభివృద్ధి కోసం నిధులు కావాలని సీఎం జగన్ కు లేఖలు రాస్తే ఇంతవరకు సమాధానమే లేదని ఆనం విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా నియోజకవర్గంలోని గ్రామాలకు సరిగా రావడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జాప్యంతో స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయని అన్నారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఏ తప్పు చేయలేదని… కానీ, వైసీపీ నేతలు తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలను ఎవరూ నిరూపించలేకపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమని జోస్యం చెప్పారు. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే రాష్ట్రంలో మాఫియా పెరిగిపోయిందని తాను చెప్పానని… అప్పటి నుంచి తనపై కక్షకట్టారని దుయ్యబట్టారు.