ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇసుక అక్రమ తవ్వకాలపై ఉన్నతన్యాయస్థానం మండిపడింది. అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని జగన్ సర్కార్ను సుప్రీం ఆదేశించింది. ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు లేకుండా చేపట్టిన ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీం ధర్మాసనం ఆర్డర్స్ పాస్ చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. అక్రమ ఇసుక తవ్వకాలపై తీసుకున్న చర్యలపై మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖను ఆదేశించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తేదీలోపు అక్రమ ఇసుక తవ్వకాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్జీటీ తీర్పుపైన ఎలాంటి స్టే విధించలేదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అక్రమాలకు పాల్పడిన వారిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఎన్జీటిని కూడా సుప్రీం ఆదేశించింది. అక్రమ ఇసుక తవ్వకాలు జరపడం లేదని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని జేపీ వెంచర్స్కు కూడా ఆదేశాలు జారీచేసింది. పర్యావరణ అనుమతులు లేని చోట ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని కూడా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనుమతులు ఉన్న చోట మ్యానువల్గా మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలని పేర్కొంది. పిటీషనర్ నాగేంద్ర కుమార్ అక్రమ ఇసుక తవ్వకాలపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించింది. పిటీషనర్ ఫిర్యాదులపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసం ఆదేశాలు జారీ చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చట్టాల మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణ మే 10కి వాయిదా వేసింది. కాగా.. ఎన్నికలు ఉన్నందున అఫిడవిట్ దాఖలుకు సమయం ఎక్కువ కావాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఉన్నతన్యాయస్థానం త్రోసిపుచ్చింది. ఎన్నికల కన్నా పర్యావరణ అంశాలే ముఖ్యమని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది.