. నేను లేకుంటే ఓడిపోయేవారు: టెస్లా అధినేత చురకలు
. సెక్స్ కుంభకోణంలో ట్రంప్ పాత్రపై తీవ్ర ఆరోపణలు
. మండిపడ్డ అధ్యక్షుడు: వ్యాపార రాయితీల్లో కోతలు తప్పవంటూ హెచ్చరిక
వాషింగ్టన్: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ఇందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా, స్పెస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ప్రత్యక్ష ఉదాహరణలు. వీరిద్దరికి అమెరికా అధ్యక్ష ఎన్నికలప్పుడు స్నేహం కుదిరింది. కలిసి పనిచేశారు. ఒకన్నొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. వీరి బ్రోమాన్స్ కొన్ని నెలలు కొనసాగింది. ఆపై బెదిరింపులకు దిగారు. నువ్వెంత అంటే… నువ్వెంత అనుకునే స్థాయికి వచ్చారు. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లు వీరిద్దరి మధ్య అగ్గిరాజేసింది. దీనిని మస్క్ వ్యతిరేకించడంతో బ్రోమాన్స్ ముగిసింది. ఇద్దరి మధ్య దూరం విపరీతంగా పెరిగింది. కత్తులు దూసుకునే స్థాయికి తీసుకు వచ్చింది.
తాజాగా ట్రంప్పై మస్క్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తన మద్దతు లేకపోతే ట్రంప్ అసలు అధ్యక్షుడు అయ్యేవారు కాదని వ్యాఖ్యానించారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్తో ట్రంప్కు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. సెక్స్ కుంభకోణంలోని వాస్తవాలను ట్రంప్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దాస్తోందని మస్క్ ఆరోపించారు. భవిష్యత్తులో నిజానిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. దీంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మస్క్ ఆరోపణలను తిప్పికొట్టారు. ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో అసంతృప్తికి గురైనట్లు తెలిపారు. తన స్నేహితుడు శ్వేతసౌధంలో లేకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలవడానికి తనకు మస్క్ అవసరం లేదని ట్రంప్ చెప్పారు. మస్క్ మద్దతు లేకున్నా పెన్సిల్వేనియాలో గెలిచేవాడినన్నారు. అదే సమయంలో మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు కొత్త పార్టీ పెట్టే ఎలా ఉంటుందని నెటిజన్లను మస్క్ అడిగారు. ‘80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా..’ అంటూ ఎక్స్ మాధ్యమంగా పోల్ నిర్వహించారు. ట్రంప్ అభిశంసనను సూచించే పోస్టును మస్క్ సమర్ధించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలన్న ఆ పోస్టును రీ పోస్టు చేశారు. ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నారు.
ట్యాక్స్ బిల్లుపై వివాదం ఎందుకు…
‘ట్యాక్స్ బిల్లు’ ట్రంప్, మస్క్ బ్రోమాన్స్ను ముగించేసింది. వాస్తవానికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోజ్)లో మస్క్ ఉండగానే గొడవలు మొదలయ్యాయి. ఆయన పాత్రకు ట్రంప్ కార్యవర్గం కత్తెరేసింది. మే నెలలో వచ్చిన ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించారు. దీనివల్ల ఖర్చులు పెరిగి.. డోజ్ శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుందని అభ్యంతరం తెలిపారు. ఈ బిల్లులో చాలా అంశాలు మస్క్ వ్యాపారాలకు నష్టం చేకూర్చేవిగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్యాక్స్ బిల్లు కారణంగా విద్యుత్తు కార్లపై ట్యాక్స్ క్రెడిట్ గణనీయంగా తగ్గుతుంది. ఈ క్రెడిట్లు సాధించేందుకు 2.5 లక్షల డాలర్లను లాబీయింగ్ కోసం టెస్లా వెచ్చించింది. డోజ్ అధిపతిగా మస్క్కు ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగి హోదా దక్కింది. అక్కడి చట్టం ప్రకారం 130 రోజులు మాత్రమే అది ఉంటుంది. మస్క్ కొనసాగడం సాధ్యం కాదని శ్వేతసౌధం చెప్పింది. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిన్స్ట్రేషన్ను తన స్టార్లింక్ శాటిలైట్ సిస్టమ్ను నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు వినియోగించాలని మస్క్ భావించాడు. అదీ కుదరలేదు. శ్వేతసౌధం అందుకు నిరాకరించింది. నాసా అడ్మిన్స్ట్రేటర్ పదవికి మస్క్ మిత్రుడు జారెడ్ ఇస్సాక్ మన్ను తొలుత ట్రంప్ ప్రతిపాదించారు. కానీ, టెస్లా అధినేతతో దూరం పెరగడంతో.. ఇస్సాక్ మన్ నామినేషన్ను ఉపసంహరించుకొన్నాడు. ఇది మస్క్కు కోపం తెప్పించింది. స్పేఎస్ఎక్స్ డ్రాగన్ సేవలు విరమించుకుంటానని వెల్లడిరచారు. ఒప్పందాల రద్దుతో బిలియన్ డాలర్లు ఆదా అవుతాయని ట్రంప్ కూడా బుదలిచ్చారు.
అంతరిక్షయానంపై నీలినీడలు…
భారత వ్యోమగామి అంతరిక్షయానంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను తరలించడంలో స్పేస్ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ కీలకం. యాక్సియం-4 మిషన్పై తాజా పరిస్థితుల ప్రభావం ఉంది. ఈ మిషన్లో నాసా, స్పేస్ఎక్స్, ఇస్రో భాగస్వాములు. భారత వ్యోమగాని శుక్లాతో పాటు అమెరికా, పోలాండ్, హంగరీకి చెందిన ముగ్గురు వ్యోమగాములు వెళ్లనున్నారు. ఈ యాత్ర రెండుసార్లు వాయిదా పడగా 10వ తేదీన ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మస్క్ తొలుత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో డ్రాగన్ అంతరిక్ష నౌకను స్పేస్ఎక్స్ డీకమిషన్ చేయడం మొదలుపెడున్నట్లు పేర్కొన్నారు కానీ ఆపై వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో మిషన్ షెడ్యూల్ ప్రకారం సాగనున్నట్లు తెలుస్తోంది.