ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 లో మొట్ట మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ‘‘సార్క్’’ దేశాల అధిపతులను ఆహ్వానించారు. ఇది అద్భుతమైన విదేశాంగ విధానం అన్న ప్రశంసలూ అందుకున్నారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానం ఏమిటో కనీసం దిల్లీ పీఠాలపై అధిష్టించిన పెద్దలకైనా అర్థం అవుతోందో లేదో తెలియదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో, ఆ తరవాత కాల్పుల విరమణ ప్రకటించడంలో మోదీ ప్రభుత్వం అనుసరించిన పద్ధతి సర్వత్రా విమర్శలకు గురవుతోంది. పాక్ ప్రేరేపిత తీవ్రవాద స్థావరాలపై భారత రక్షణ దళాల దాడి నిర్ణాయక దశలో ఉన్నప్పుడు గత నెల పదో తేదీన అమాంతం కాల్పుల విరమణ ప్రకటించడం మోదీ భక్తులతో సహా అందరినీ అయోమయంలో పడవేసింది. తాను చెప్పినందువల్లే భారత్-పాక్ దళాలు కాల్పులు విరమించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదే పనిగా చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వం ఇంతవరకు ఖండిరచలేదు. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని మంగళవారం ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ ‘‘సరెండర్’’ మోదీ అన్నారు. సరెండర్ అంటే లొంగిపోవడం. అమెరికా ఆదేశాలకు లొంగిపోయి కాల్పులు విరమించారని చెప్పడం రాహుల్ గాంధీ ఉద్దేశం. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత మోదీని విమర్శించడం, ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా దేశ ద్రోహం జాబితాలో చేరిపోయాయి. మోదీనో, ప్రభుత్వాన్నో విమర్శించడం అంటే దేశాన్ని విమర్శించడం అని మోదీ భక్తులు ఒంటికాలి మీద లేస్తున్నారు. అలా ప్రభుత్వాన్ని విమర్శించే వారిని దేశాన్ని తూలనాడడంగా భావిస్తున్నారు. మరో వేపున త్రివిధ దళాల అధిపతి చౌహాన్ పాకిస్థాన్ సైనిక వ్యవహారాల అధిపతి కాల్పులు విరమిద్దాం అని ప్రతిపాదించినందువల్లే దాడి నిలిపివేశాం అంటున్నారు. కాల్పుల విరమణకు కారణం ఏమిటో ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక్క మాట కూడా చెప్పలేదు. మోదీ మాత్రం దేశమంతా తిరుగుతూ ఆపరేషన్ సిందూర్ తమ ఘనతేనని చాటుకుంటూనే ఉన్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రతిపక్షాలకే కాదు దేశంలో అనేక మందికి అనేకానేక అనుమానాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే తన చొరవ వల్లే కాల్పుల విరమణ జరిగిందని అనేక సార్లు చెప్పుకుంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే అది కచ్చితంగా లొంగుబాటే. ఇది మన విదేశాంగ విధానంలోని దివాలాకోరు తనానికి చరమ స్థాయి. రాహుల్ ఈ ఉద్దేశంతోనే ‘‘సరెండర్’’ మోదీ అన్నారు. పాకిస్థాన్ మీద దాడి చేయడానికి కేవలం పహల్గాం ఘాతుకం మాత్రమే కారణం అని మోదీ మాటలు వింటే నమ్మబుద్ధేయడం లేదు. తీవ్రవాదాన్ని తుదముట్టించాల్సిందే. తీవ్రవాదాన్ని పెంచి పోహిస్తున్న పాకిస్థాన్కు గుణపాఠం చెప్పాల్సిందే. కానీ పుల్వామాలో తీవ్రవాదులు చేసిన దాడిలో మన భద్రతా దళాలకు చెందిన దాదాపు 40 మంది ప్రాణాలర్పించారు. అది పహల్గాం కన్నా పెద్ద సంఘటన. తేడా అల్లా అప్పుడు బలైంది భద్రతా దళాల వారైతే ఇప్పుడు తీవ్రవాదుల తూటాలకు నేలకొరిగింది అమాయక యాత్రికులు. యుద్ధంలో మన రక్షణ దళాలకు, మన ఆయుధ సంపత్తికి జరిగిన నష్టం గురించి ఎవరూ ప్రశ్నించడం లేదు. అమెరికా పనుపున కాల్పుల విరమణ నిజమే అయితే అది లొంగుబాటే గదా! ఈ ప్రశ్నలు వేటికీ ప్రభుత్వం నోరు విప్పి సమాధానం చెప్పదు. తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్థాన్ ఆగడాల గురించి అంతర్జాతీయ సమాజానికి విడమర్చడం కోసం మోదీ ప్రభుత్వం పంపిన ఏడు బృందాలు తమ పర్యటనలో కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యత ఏ మేరకు ఉందో చెప్తున్న దాఖలాలే లేవు. అలాంటప్పుడు రాహుల్ గాంధీ ‘‘సరెండర్’’ మోదీ అంటే ఉలుకెందుకో!
మోదీ ప్రభుత్వం తన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులను విమర్శించడం పరిపాటి అయింది. విమర్శకులపై ‘‘దేశద్రోహ’’ ముద్ర వేస్తోంది. మోదీ మీద, మోదీ ప్రభుత్వం మీద వస్తున్న విమర్శలను దేశాన్ని చులకన చేయడం, అపఖ్యాతిపాలు చేయడం కింద చిత్రిస్తోంది. ప్రధానమంత్రి విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఇక్కడి పార్టీల మీద దుమ్మెత్తి పోయడం మాత్రం మోదీకి, ఆయన భక్త బృందానికి తప్పుగా కనిపించలేదు. ఆపరేషన్ సిందూర్ విషయంలో బీజేపీ మాతృ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్ుకు అంతగా నచ్చినట్టు లేదు. ఆ నాయకులు నర్మగర్భమైన విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తానే దేశానికి ఏకైక ప్రతినిధిని, తనను విమర్శించడం దేశద్రోహం అని భావించే తత్వం మోదీది. ప్రభుత్వాన్ని విమర్శించే వారిని జాతి విద్రోహులుగా, వేర్పాటువాదులుగా, దేశ ద్రోహులుగా చిత్రించడం మోదీ హయాంలో 2016 నుంచే స్పష్టంగా కనిపిస్తోంది. 2016లో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, జాధవ్ పూర్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ‘‘హం క్యా చాహ్తే-ఆజాదీ’’ అన్న నినాదాలను వక్రీకరించి మోదీ ప్రభుత్వం వారిని దేశద్రోహులుగా చిత్రించింది. కేసులు మోపింది. జైళ్ల పాలు చేసింది. ఇదంతా దేశమంటే తానేనన్న అహంభావం మోదీలో గూడు కట్టుకోవడంవల్ల కలిగిన అభిప్రాయమే. ఎంతటి మహత్తర నాయకుడైనా దేశం కన్నా తానే గొప్పవాడిని అనుకుంటే అది ఘనీభవించిన అహంకారానికి మాత్రమే చిహ్నం. దేశాన్ని ఓ మాతృమూర్తిగా అనుకుని భారతమాత అనొచ్చు. కానీ ఆ మూర్తి కన్నా మోదీ పెద్దవాడు అంటే మాత్రమే సహించే ప్రసక్తే లేదు. ఆ లెక్కన నిద్రలో కూడా నెహ్రూను తూలనాడి ఆనందపడిపోయే మోదీ కూడా మాజీ ప్రధానిని తప్పుపట్టడం కూడా ఆ లెక్కన అదీ దేశాన్ని విమర్శించడమో, దేశద్రోహమో కావాలిగా! మోదీ ఒక్క ట్రంప్ కే కాదు చైనాకు కూడా లొంగి పోయారు. 2020 నుంచి చైనా నెమ్మది నెమ్మదిగా మన దేశంలోకి వందల మైళ్లు చొచ్చుకొచ్చి అక్కడ శాశ్వత నిర్మాణాలు చేపడ్తోంటే మోదీ ఇప్పటికి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విదేశాంగ మంత్రి జై శంకర్ అయితే ‘‘అమ్మో! చైనాతో ఎలా తలపడగలం!’’ అని ముందే దాసోహం అన్నారు. తాజాగా చైనా పాకిస్థాన్కు అండగా నిలబడితే మోదీగానీ, ఆయన ప్రభుత్వంలోని పెద్దలుగానీ నోరు విప్పిన పాపాన పోలేదు. బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా మొదలుకుని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ లాంటి ఛోటా మోటా నాయకులు కూడా రాహుల్ గాంధీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. మోదీ ఒక్క ట్రంప్ కే కాదు తన మిత్రుడైన అదానీకి ప్రయోజనం చేకూర్చడం కోసం ఎప్పుడో తాను లొంగి పోవడమే కాదు దేశ ప్రయోజనాలనే పణంగా పెట్టారు.మోదీ ప్రతి విదేశీ పర్యటనలో అదానీకి కాంట్రాక్టులు దక్కాయి. ఇది కేవలం అదానీకి లొంగి పోవడం కాదు. దేశాన్ని తాకట్టు పెట్టడమే.