బీసీసీఐకి భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్ హెచ్చరిక
టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ను తొలగిస్తే టీమిండియాలో విపత్తు తప్పదని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్ బీసీసీఐని హెచ్చరించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్కు ఈ ప్రతిష్టాత్మక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల గంభీర్ సారథ్యంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కీలక ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను టెస్ట్ క్రికెట్ నుంచి బలవంతంగా రిటైర్ చేయించారనే ఆరోపణలు గంభీర్ ఎదుర్కొన్నారు. అయితే చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్ వంటి మూడు ప్రధాన ట్రోఫీలు గౌతీ సారథ్యంలోనే వచ్చాయి. కానీ టెస్ట్ క్రికెట్లో తడబడటంతో కోచ్గా తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో 2011 ప్రపంచ కప్ గెలిచిన జట్టు సభ్యుడైన మునాఫ్ పటేల్ తన మాజీ సహచరుడికి మద్దతిచ్చాడు. గంభీర్ను తొలగిస్తే పరిస్థితులు దిగజారవచ్చని హెచ్చరించాడు. గంభీర్ వంటి నిఖార్సయిన వ్యక్తిని కోచ్ పదవి నుంచి తొలగిస్తే, భారత జట్టులోని స్టార్ ఆటగాళ్లను మేనేజ్ చేయడం ఎవరికైనా చాలా కష్టమవుతుందన్నాడు. గంభీర్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం వల్ల చాలా మంది అతడిని ఇష్టపడరు కానీ జట్టు ప్రయోజనాల కోసం ఎంతటి కఠిన నిర్ణయాలనైనా తీసుకోవడానికి వెనుకాడని మునాఫ్ తెలిపాడు. ముఖ్యంగా జట్టులో క్రమశిక్షణ తప్పినా లేదా ఆటగాళ్లు సరిగ్గా రాణించకపోయినా, వారిని జట్టు నుంచి తప్పించే ధైర్యం గంభీర్కు ఉందన్నాడు. చివరకు విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లకు ‘నో’ చెప్పడం అంత తేలికైన విషయం కాదు. కేవలం దేశం కోసం కోచ్గా సేవలు అందిస్తూ గంభీర్ ఎంతో మంది శత్రువులను కూడగట్టుకున్నాడని చెప్పు కొచ్చాడు. క్రికెట్లో మ్యాన్ మేనేజ్మెంట్ అనేది అత్యంత కష్టమైన పని అని చెబుతూ గంభీర్ దానిని సమర్థవంతంగా చేస్తున్నాడని మునాఫ్ వెల్లడించారు. మునాఫ్ పటేల్ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. దిల్లీ జట్టు ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి, నాలుగు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.
గంభీర్ను తప్పిస్తే టీమిండియాలో సంక్షోభమే!
- Advertisement -


