తాడి ప్రకాష్
సెల్: 9704541559
ఫిబ్రవరి 18, 2018…
హైదరాబాద్, నాంపల్లి తెలుగు యూనివర్సిటీ…
ఆదివారం సాయంత్రం అయిదున్నర… ఎన్టీఆర్ ఆడిటోరియం కళకళలాడుతోంది. రచయితలు, సాహితీ వేత్తలు, కవులు, కళాకారులు, కమ్యూనిస్టు కార్యకర్తలతో కిటకిటలాడుతోంది. ఎక్కడా రవ్వంతచోటు లేదు. గోడల కానుకునీ, మెట్ల మీదా, స్టేజీ మీదా, స్టేజీ ముందూ జనం…జనం…
గూగీవాథియాంగో అనే ఒక మహోన్నత మానవుడు, కాంతిమంతమైన విశాలమైన వేదికమీద కూర్చొని ఉన్నాడు. బలంగా, దృఢంగా, వినయంగా, నల్లటి నలుపుతో మెరుస్తున్నాడా మనిషి. నిండుగా నవ్వుతున్నాడు. పక్కనే ఉన్న సాహితీవేత్త సుశీతారు, జర్నలిస్టులు కె.శ్రీనివాస్, ఎన్.వేణుగోపాల్తో మాట్లాడుతున్నాడు. సభలోని జనమంతా విప్పారిన కళ్లతో గూగీనే చూస్తున్నారు. ఆ ఆఫ్రికన్ మహా రచయితను చూసి పరవశిస్తున్నారు. ఆ కెన్యా తిరుగుబాటు వీరుని మాటల కోసం ఎదురుచూస్తున్నారు.
ఏం రోజది! ఎలాంటి క్షణాలవి!
పాల్రాబెసన్ పాట గుండె లోతుల్లోంచి వినిపిస్తున్నట్టు, Gవ్ బజూ ర్aఅసబజూ…టఱస్త్రష్ట్ర్ టశీతీ వశీబతీ తీఱస్త్రష్ట్ర్ం అని వూగుతూ, భుజాలు కదుపుతూ బాబ్ మార్లే పాడుతున్నట్టు
కనిపించని ఒక ఉద్వేగం ఏదో అక్కడ అందర్నీ ఆవహించి ఉంది.
ఎంత అదృష్టం చేసుకున్నాం!
మేం ఎంత పుణ్యం మూట గట్టుకున్నాం!
తెలియని ఒక తన్మయత్వంతో…
గూగీ అనే పూనకంతో వూగుతున్నాం. ఉద్యమ చరిత్రలో ఒక మహత్తర సన్నివేశానికి సాక్షులుగా ఉన్నాం.
ఒక్కరోజు ముందు, ఎన్.వేణుగోపాల్కి ఫోన్ చేసి, ఆర్టిస్ట్ మోహన్ వేసిన పెయింటింగ్ ఒకటి గూగీకి కానుకగా ఇద్దాం అన్నాను. వేదిక మీదికి పిలుస్తాను, మీరే వచ్చి గూగీకి ఇవ్వండి అన్నాడు. కొన్ని అదృష్టాలు అలా అలవోకగా వస్తాయి. దృఢకాయుడైన ఆఫ్రికన్ డ్రమ్మర్ పెయింటింగ్ ఒకటి మోహన్ వేసి ఉన్నాడు. కంప్యూటర్లో వెతికి, పెద్ద కలర్ప్రింట్ అవుట్ వేయించి, ఫ్రేమ్ చేయించాను. వేణుగారు పిలవగానే, ఆ జన సందోహం నుంచి వేదిక మీదికి వెళ్లాను. ఒక నిమిషం ఆ బొమ్మ గురించి మాట్లాడి, సభలో అందరికీ కనిపించేలా ఆ పెయింటింగ్ని ఎత్తి పట్టుకుని గూగీవైపు రెండు అడుగులు వేశాను. అందుకోవడం కోసం గూగీ లేచి నిలబడ్డారు.
ఆడిటోరియంలో చప్పట్లు పెను తుపానై వీచాయి. సభ హోరెత్తి పోయింది. ఆ పెద్ద ఫ్రేమ్ని అందుకున్న గూగీ ఆప్యాయంగా నా భుజం తట్టి, బొమ్మ చాలా బావుందని, ఎంతో చక్కగా వేశావనీ అన్నారు. ఒక్కమాట, అని నేను అన్నాను. ఆ పెయింటింగ్ వేసింది మోహన్ అనే ఒక పెద్ద ఆర్టిస్టనీ, అతను మా అన్నయ్య అనీ, నేనొట్టి జర్నలిస్టుని మాత్రమేననీ చెప్పాను. గీతలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయనీ, తనకెంతో నచ్చిందనీ గూగీ అన్నారు.
మహత్తరమైన నవలలు రాసిన, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అందుకున్న ఆయన అరచేతిని చాచి, నాకు షేక్హ్యాండ్ ఇచ్చారు. థాంక్యూ అన్నారు. ఆ క్షణం మరువలేనిది. ఆ ఆనందం చెప్పనలవి కానిది. ఆ చప్పట్ల, అభినందనల, కరచాలనాల ప్రవాహంలోంచి వేదిక దిగి వచ్చాను. గుగీవాథియాంగో చేసిన గొప్ప ప్రసంగాన్ని విన్నాను.
1996లో ఒకసారి గూగీ హైదరాబాద్ వచ్చారు. మూడు, నాలుగు సభల్లో మాట్లాడారు. అప్పుడు నేను ఆంధ్రభూమి దినపత్రికలో పని చేస్తున్నందువల్ల గూగీ సభలకి వెళ్లలేకపోయాను. మోహన్ రెండు సభలకి వెళ్లాడు. గూగీ మాట్లాడిన విషయాలన్నీ నాకు ఫోన్ చేసి చెప్పాడు. గూగీ మాటలు మోహన్ని కదిలించాయని నాకు అర్థం అయింది. మోహన్ చెప్పిన మాటలతోనే వివరంగా పెద్ద వార్త రాశాను. గూగీ 2018 ఫిబ్రవరిలో వచ్చే నాటికి మోహన్ చనిపోయి అయిదు నెలలు అయింది. ఒక పెద్ద ఆర్టిస్టుని గుర్తు చేసుకుంటూ ఒక గొప్ప రచయితకి ఆ పెయింటింగ్ ఇవ్వాలని అనుకున్నాను.
గూగీ కేవలం అంతర్జాతీయ స్థాయి ఉన్న రచయిత మాత్రమే కాదు. వలసవాదంతో, నరహంతకులతో పోరాడిన వీరుడు. చదువూ సంధ్యాలేని నిరుపేద కెన్యా ప్రజల పక్షాన నిలబడి అనేక అవమానాలు పొందినవాడు. జైళ్లలో మగ్గిన వాడు. మొదట 17సంవత్సరాలు ఇంగ్లీషులోనే రచనలు చేసినా, సాంస్కృతిక జీవనది తల్లిభాషే అని గుర్తించి ‘గికియూ’ అనే కెన్యా ప్రాంతీయ భాషలోనే రచనలు చేశారు. చాలా ఆఫ్రికన్ ప్రాంతీయ భాషలకి లిపి లేని కాలం అది. ఇంగ్లీషులోనే రాయాలి. ఇంగ్లీషే లింకు లాంగ్వేజి. అలాంటి సమయంలో తన మాతృభాష గికియులో రాసి, ఖ్యాతిగాంచి, బుకర్ ప్రైజ్ గెలవడం మాటలు కాదు. హైదరాబాద్ సభలో గూగీ బాల్య జ్ఞాపకాలు, ‘‘యుద్ధ కాలంలో స్వప్నాలు’’ ఆవిష్కరించారు. దాన్ని విప్లవకవి వరవరరావు తెలుగు చేశారు. గూగీ ‘‘మట్టి కాళ్ల మహారాక్షసి’’ కూడా వరవరరావే అనువాదం చేశారు. నైజీరియా స్టార్ రైటర్ చినువా అచెబే గూగీకి గురువు, మిత్రుడు, ఫిలాసఫర్. కెన్యాలో బతుకు దుర్భరమై గూగీ అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చింది. అక్కడో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు. వేలమంది విద్యార్థుల్ని ప్రభావితం చేశారు. ఒకసారి గూగీ కెన్యా వెళ్లినప్పుడు, అక్కడి నిరంకుశ ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ప్రభుత్వ తొత్తులు కొందరు గూగీ భార్యపై అత్యాచారం చేశారు. ఆయన తల్లినీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు. నరకయాతన అనుభవించినా, చీకటి ఖండంలోని అనాగరికులైన తన జనం కోసం గూగీ అక్షర దీపాలు వెలిగిస్తూనే ఉన్నాడు. ఒక పాట్రిస్లుముంబా, ఒక మాల్కంఎక్స్, ఒక మార్టిన్ లూథర్కింగ్, ఒక కెన్సరొవివా ఒక నెల్సన్మండేలా, ఒక బిషప్ డెస్మండ్టూటులు పరిచిన కాంతి దారుల్లోనే తన జీవితాదర్శాన్ని తెలుసుకోగలిగాడు. తల వంచని ఆఫ్రికా స్వేచ్ఛా గీతాన్ని ఆలపిస్తూనే ఉన్నాడు. మార్క్సిజం తన ఆయుధం అని ప్రకటించిన అక్షర యోధుడు గూగివాథియాంగో.
నవలలు, నాటకాలు, జ్ఞాపకాలు కొల్లలుగా రాసిన గూగీ 2025 మే 28 న మనల్ని విడిచి వెళ్లిపోయారు. బానిసత్వం నుంచి, వలస వాదుల నుంచి, ప్రజా కంటకుల నుంచి ఆఫ్రికా విముక్తి కోసం గూగీ చేసిన పోరాటం ఎప్పటికీ జ్వాజ్వల్యమానంగా నిలిచి వెలుగుతూనే ఉంటుంది. ఆయన మానవ జాతికి ఇచ్చిన అపురూపమైన సాహిత్య సంపదని చదువుకోవడమే, ఆయన పరిచిన వెలుగు వెన్నెల దారుల్లో ఒక అడుగు ముందుకు వేయగలగడమే ఆ పురుషోత్తమునికి మనం ఇచ్చే నివాళి.