స్వామినాథన్ సిఫార్సుల మేరకు పంటలకు మద్దతు ధర
. కౌలు రైతుల రక్షణ కోసం నూతన చట్టం
. ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల డిమాండ్
. రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల ఎదుట ధర్నాలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని, కేంద్రప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను పునర్పరిశీలించి డాక్టర్ స్వామినాథన్ సిఫారసుల ప్రకారం సమగ్ర ఉత్పత్తి వ్యయానికి 50 శాతం కలిపి మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని, కౌలురైతుల రక్షణ కోసం నూతనకౌలు చట్టాన్ని తీసుకురావాలని…తద్వారా కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు జీ ఈశ్వరయ్య, కేవీవీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కౌలురైతులసంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.కాటమయ్య, పి.జమలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలురైతు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య కడప జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ గుంటూరు జిల్లా పెదకాకాని మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనంతపురం జిల్లా,ఆత్మకూరు మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ జమలయ్య ఎన్టీఆర్ జిల్లా, ఏ కొండూరు తహశీల్దార్ ఆఫీస్ దగ్గర రైతులు, కౌలురైతులతో ధర్నా నిర్వహించి తహసీల్దార్ కు వినతిపత్రం అంద జేశారు. కె జగన్నాథం కర్నూలు జిల్లా కేంద్రంలో, కృష్ణాజిల్లా చల్లపల్లిలో గుత్తికొండ రామారావు, వినుకొండ మండల కేంద్రంలో ఉలవలపూడి రాము పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో బుడితి అప్పలనాయుడు పాల్గొన్నారు. చిరుతల మల్లికార్జున అనంతపురం రూరల్ మండల కేంద్రం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రైతు నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయకపోవడం బాధాకరమ న్నారు. గత ఏడాది ఇవ్వకుండా రైతాంగాన్ని ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ఈ సంవత్సరంలోనైనా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే సాగు చేసే ప్రతి రైతు, కౌలు రైతు కుటుంబాలకు రూ. 20 వేలు చొప్పున పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు. సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకొని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి వడ్డీ లేని పంట రుణాలు 5లక్షల రూపాయల వరకు అందించాలని కోరారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం హామీలేని పంట రుణాలు రెండు లక్షల వరకు జారీ చేయాలని, తద్వారా కౌలు రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏడాది ఏప్రిల్ నెల ప్రారంభం నుండి గ్రామసభలు నిర్వహించే వారని, ఈ ఏడాది ఇంతవరకు కౌలు గుర్తింపు కార్డు జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. కౌలు రైతుల రక్షణ, సంక్షేమానికి నూతన కౌలు చట్టం తీసుకొస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు అమలుకు నోచుకోలేద న్నారు. కౌలురైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే నూతన కౌలు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ముడి వంట ఆయిల్ దిగుమతులపై ఉన్న సుంకాన్ని 27.5% నుంచి 17.5 శాతానికి కుదించింది. దీనివల్ల ఆయిల్ పామ్ రైతులు తీవ్రంగా నష్టపోతారని, ముఖ్యంగా కౌలురైతులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పునర్పరిశీలించి ముడి వంట ఆయిల్ దిగుమతి సుంకాన్ని 17.5% నుంచి 40 శాతం వరకు పెంచాలని, తద్వారా ఆయిల్ పామ్ సాగు చేసే దేశీయ రైతాంగాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్రూట్ జ్యూస్ పై కేంద్ర ప్రభుత్వం విధించిన 40 శాతం జీఎస్టీని ఉపసహరించుకోవాలని కోరారు. ఒకవైపు ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తూ మరోవైపు భారాలు మోపటం సరైనది కాదన్నారు. ఏటా పెరుగుతున్న ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు దిగుబడితో సంబంధం లేకుండా పెరుగుతున్న కౌలు రేట్లు కూడా నియంత్రించాలని దానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.