అధిక చార్జీలతో అందరికి నష్టం: అమెరికాకు చైనా స్పష్టీకరణ
బీజింగ్: అమెరికా పోర్టులను సందర్శించే చైనా సంబంధిత నౌకలపై భారీ రుసుము వసూతు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమైంది. తాజా చర్యలను బీజింగ్ తీవ్రంగా ఆక్షేపించింది. పోర్టులపై తప్పుడు విధానాలు ఆపాలంటూ అమెరికాకు స్పష్టంచేసింది. భారీగా చార్జీలు విధించడంతో అన్ని వర్గాలకు నష్టం జరుగుతుందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ శుక్రవారం తేల్చిచెప్పారు. ‘అంతర్జాతీయ షిప్పింగ్ వ్యయం అమాంతం పెంచేశారు. ఇది అంతర్జాతీయ ఉత్పత్తి, సరఫరా గొలుసుల సుస్థిరతను దెబ్బతీస్తుంది. ఈ పద్ధతిలో అమెరికా నౌకల తయారీ పరిశ్రమను పునరుద్ధరించలేరు’ అని ఆయనన్నారు. పద్ధతి మార్చుకోవాలని… వాస్తవాలను, బహుపాక్షిక నిబంధనలను గౌరవించాలని అమెరికాను కోరారు. తప్పుడు విధానాలను తక్షణమే ఆపేయాలన్నారు. చైనా తన న్యాయపరమైన హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటుందని స్పష్టంచేశారు. చైనాలో తయారైన, ఆ దేశానికి చెందిన నౌకలు అమెరికా పోర్టుల్లో డాక్ అయితే వాటిలోని మొత్తం సరుకుపై భారీగా చార్జీలు వసూలు చేస్తామని అమెరికా వాణిజ్య ప్రతినిధి గురువారం వెల్లడిరచారు.