Sunday, June 22, 2025
Homeవిశ్లేషణబడికి దూరంగా 27 కోట్ల చిన్నారులు

బడికి దూరంగా 27 కోట్ల చిన్నారులు

ఎం. లక్ష్మీరాజ్యం

ప్రాథమిక దశలో వికాస దీపం వెలిగించి, అనంతర కాలంలో ఆ కాంతుల్ని దేదీపమానం చేస్తూవిజ్ఞానఖనుల్ని, ప్రయోగశీలుర్ని అవతరింప జేయడమే విద్య మౌలిక లక్ష్యం. విజ్ఞానం కోసం పెట్టే పెట్టుబడి ఎప్పటికీ సత్ఫలితాలు అందిస్తుందనేది అక్షరసత్యం. దేశీయంగా అది సక్రమంగా నెరవేరుతోందా? ఈ ప్రశ్నకు సమాధానం బహిరంగ రహస్యమే! సమాజం నేడు ఎంతగా అభివృద్ధి చెందినా, అనేక మార్పులు వచ్చినా కోట్లాది మంది పిల్లలు విద్యకు దూరంగానే ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 2023లో దాదాపు 27.2 కోట్ల మంది చిన్నారులు బడికి దూరంగా ఉన్నారని ‘ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్ర సాంకేతిక సంస్థ (యునెస్కో) గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ టీం (జీఈఎం) అంచనా వేసింది. గత ఏడాది వేసిన అంచనా కంటే ఇది 2.1 కోట్ల మంది ఎక్కువ కావడం గమనార్హం. జాతీయ ఖండాంతర విద్యా నిబద్ధతలపై పురోగతిని జీఈఎం అంచనావేస్తుంది. ఆరు నుంచి 17 ఏళ్ల వయస్సు కలిగినవారిని బడికి వెళ్లే వయస్సు వారుగా ఐక్యరాజ్య సమితి నియమాల ప్రకారం వర్గీకరిస్తారు. 2023లో దాదాపు 27.2 కోట్ల మంది చిన్నారులు బడికి దూరంగా ఉన్నారన్న అంచనా ఖచ్చితంగా తక్కువ లెక్క, ఎందుకంటే సంఘర్షణ ఎక్కువగా ప్రభావితమైన 10దేశాల నుంచి వచ్చిన బాహ్య సమాచారం ప్రకారం, ముఖ్యంగా మయన్మార్‌, సొమాలియా, సూడాన్‌లలో కనీసం 1.3 కోట్ల మంది పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు, యువత పాఠశాలలకు దూరంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాల వయస్సు పిల్లల్లో 11 శాతం (దాదాపు 7.8 కోట్లు మంది), లోయర్‌ సెకండరీ పాఠశాల వయస్సు చిన్నారుల్లో 15 శాత మంది (6.4 కోట్లు), ఉన్నత పాఠశాల వయస్సు చిన్నారుల్లో 31 శాతం (దాదాపు 13 కోట్ల మంది) చిన్నారులు బడికి దూరంగా ఉన్నారని ఆ నివేదిక తెలిపింది. 2030 నాటికి బడి బయట ఉన్న జనాభాను 16.5 కోట్ల్లకు తగ్గించడానికి సమిష్టిగా కట్టుబడి ఉన్నాయని జీఈఎం నివేదిక విశ్లేషించింది. తాము అనుసరిస్తున్న ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా 2030 నాటికి ఆఫ్రికాలో బడి బయట జనాభాను 58లక్షలకు తగ్గించడానికి ఆఫ్రికా దేశాలు సమిష్టి నిబద్ధతను కలిగి ఉన్నాయి. అయితే, 2025 నాటికి ప్రాథమిక, దిగువ సెకండరీ పాఠశాల వయస్సు గల దేశాలలో నాలుగు శాతం పాయింట్లు, ఉన్నత మాధ్యమిక పాఠశాల వయస్సు గల దేశాలలో ఆరు శాతం పాయింట్లు ట్రాక్‌ నుంచి తప్పుతాయని అంచనా వేసింది. 2025 నాటికి, దేశాల జాతీయ లక్ష్యాలతో పోలిస్తే 75లక్షల మందిని బడిలో చేర్చాలనే లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. ఈ లక్ష్య సాధన వాటికి పెద్ద సవాల్‌గా మారింది. ఎస్‌డీజీ 4కు దేశాలు అందించిన సహకారాన్ని సూచిస్తూ, ఎనిమిది బెంచ్‌మార్క్‌ సూచికలకోసం దేశాలు నిర్దేశించిన జాతీయ లక్ష్యాల వైపు పురోగతి మూడవ అంచనా ఇది. ఈ అంచనా 2015 నుంచి 2025 వరకు మధ్య కాలాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం (ప్రీ-ప్రైమరీ విద్యలో 7 శాతం పాయింట్లు ట్రాక్‌పైకి వెళ్లడం), బాల్య విద్యలో భాగస్వామ్యాన్ని విస్తరించడం (9 శాతం పాయింట్లు ట్రాక్‌పైకి వెళ్లడం, కోవిడ్‌ 19 ప్రభావం), ప్రాథమిక విద్య ముగిసే సమయానికి కనీస పఠన నైపుణ్యాన్ని సాధించడం (11 శాతం పాయింట్లు ట్రాక్‌పైకి వెళ్లడం, డేటా లేకపోవడం వల్ల ఆటంకం) వంటి కారణాల వల్ల 2025 జాతీయ లక్ష్యాల సాధనలో దేశాలు చాలా వెనుకబడి ఉన్నాయి. విద్య కోసం వ్యయం చేయడంలో చాలా దేశాలలోని ప్రభుత్వాలు వెనుకడుగువేస్తు న్నాయని ఆ నివేదిక విమర్శించింది. అనేక దేశాలు విద్యకు స్థూలదేశీయోత్పత్తిలో 4శాతం, మొత్తం ప్రభుత్వ వ్యయంలో 15 శాతం కూడా విద్య కోసం ఖర్చు చేయడంలేదని ఆందోళన వ్యక్తంచేసింది. నూతన నమోదు, హాజరు డేటాను పరిగణనలోకి తీసుకోవడం, ఆఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం అక్కడి బాలికల విద్యపై నిషేధం విధించడం బడికి దూరంగా ఉన్న చిన్నారుల సంఖ్య భారీగా పెరగడానికి ప్రధాన కారణాలుగా ఆ నివేదిక పేర్కొంది. ఐరాస ఆధునికీకరించిన జనాభా అంచనాలు కారణంగా ఈ చిన్నారుల సంఖ్య భారీగా పెరిగిందని కూడా ఆ నివేదిక వెల్లడిరచింది. బడికి దూరంగా ఉంటే చిన్నారుల సంఖ్య ఈ నివేదిక వెల్లడిరచిన సంఖ్య కన్నా ఇంకా అధికంగా ఉండే అవకాశంలేకపోలేదు. ఈ విషయాన్ని ఆ నివేదిక కూడా నిర్ధారించింది. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సంఘర్షణల వాతావరణం నెలకుంది. సరైనా గణాంకాల సేకరణకు ఇటువంటి పరిస్థితులు తీవ్ర అంతరాయం కలిగిస్తాయి. బడికి బయట ఉన్న చిన్నారులపై సంఘర్షణల వాతావారణం ప్రభావాన్ని తక్కువగా అంచనా వేస్తున్నారని తెలిపింది. ఇక మన దేశానికి వస్తే, ప్రస్తుతం దేశంలోని 1923 సంవత్సరాల వయసుగల యువతీ యువకుల్లో 28.4శాతం మంది మాత్రమే ఉన్నత విద్యను అందుకోగలుగుతున్నారు. గత ఏడాది మార్చి 7న విడుదల చేసిన ఉన్నత విద్యపై అఖిల భారత సర్వే 2022-23 ప్రకారం ఉన్నత విద్యలో విద్యార్థుల భాగస్వామ్య రేటు లేదా స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) 28.4 శాతానికి పెరిగింది. ఇది 2020-21 నుంచి 1.1 శాతం పెరుగుదల. చండీగఢ్‌, పుదుచ్చేరి, దిల్లీ, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, కేరళ, తెలంగాణలో అత్యధిక జీఈఆర్‌ నమోదైంది. భారత దేశంలో ఉన్నత విద్య అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆ సర్వే తెలిపింది. ప్రాప్యత, సమానత్వాన్ని నిర్ధారించడం ఉన్నత విద్య ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు వంటి అట్టడుగు వర్గాలకు మధ్య గణనీయమైన అసమానత ఉంది. వారు నాణ్యమైన ఉన్నత విద్యను పొందడంలో గణనీయమైన అడ్డంకులను ఎదుర్కొంటున్నారని ఆ సర్వే పేర్కొంది. దేశంలోని ఉన్నత విద్యాసంస్థలు అందిస్తున్న విద్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పరిశోధనలు చాలా పరిమితంగా జరుగుతున్నాయి. బోధనా సంస్థలు, పరిశోధనా సంస్థలు వేర్వేరుగా ఉండడమే అందుకు కారణమని తేల్చింది. ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో పరిశోధన, అభివృద్ధికి వెచ్చిస్తున్న ఖర్చు, పరిశోధకుల సంఖ్య చాలా తక్కువని ‘యునెస్కో నివేదిక’ పేర్కొన్నది. యూజీసీ, ఏఐసీటీఈ, న్యాక్‌ తదితర సంస్థల్లోని అక్రమాలు, అవకతవకలు, బయటివారి నియామకాలు, పెత్తనాలవల్ల ఉన్నత విద్య అభివృద్ధికి నోచుకోవడంలేదని కస్తూరి రంగన్‌ కమిటీ ఎత్తిచూపింది. ప్రతిభని కాదని సీనియారిటీకే అవకాశాలు ఇవ్వడంవల్ల రీసర్చ్‌ ఇన్నోవేషన్‌కి ప్రోత్సాహం కొరవడిరదని వ్యాఖ్యానించింది. దేశంలో ప్రైవేటు సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలు దారుణంగా ఉన్నట్లు ‘నీతి ఆయోగ్‌’ స్వయంగా నిర్ధారిస్తోంది. ఈ దుర్బల పునాదులపై సుదృఢ విద్యాసౌధం నిర్మాణం పగటి కలే. ఈ నేపథ్యంలో నూతన విద్యావిధానం ముసాయిదాలోని ప్రతిపాదనలు విద్యను కార్పొరేట్‌ పరంచేసేలా ఉన్నాయి. పేదలకు చదువును దూరం చేసేందుకు దోహదపడతాయనడంలో సందేహంలేదు.
నాణ్యత లేకపోవడం, ఉద్యోగానికి ఉపయోగపడకపోవడం మన ఉన్నత విద్యలోనున్న పెద్ద బలహీనత. ఉద్యోగాలకోసం వెళ్లే గ్రాడ్యుయేట్లలో సగం మందికి ఇంటర్వ్యూలో పాల్గొనే మెళుకువలు కూడా ఉండడం లేదని ‘ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌ `2023’ వెల్లడిరచింది. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 20శాతం మంది మాత్రమే తగిన ఉద్యోగాలకు అర్హులవుతున్నారని ప్రైవేట్‌ ఏజెన్సీలు నిర్వహించే ఎంప్లాయబిలిటీ రిపోర్ట్‌ పేర్కొంది. ఇలాంటి మౌలిక లోపాలు, లొసుగులు, బలహీనతలను అధిగమించే సిఫార్సులు మాత్రం ముసాయిదాలో కనిపించవు. మౌలిక వసతులు, ప్రోత్సాహకాలు, ఆర్థికంగా చేయూత కొరవడడం మన విశ్వవిద్యాలయాల పురోగతికి తీవ్ర ప్రతిబంధకాలు సృష్టిస్తోంది. రాశికాదు, వాసి ఘనంగా ఉండాలి. అధిక కేటాయింపులతోపాటు సిబ్బంది ఖాళీల సత్వర భర్తీ, భావి సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా కోర్సుల రూపకల్పన, అడుగడుగునా జవాబుదారీతనం సాకారమైతేనే మన ఉన్నత విద్య గాడినపడే అవకాశం ఉంటుంది. బడి చదువులు సవ్యంగా పట్టాలకు ఎక్కక, ఉన్నత విద్యారంగం గుల్లబారుతోంది. ఏదేమైనా సరే వివిధ దేశాలు తమ జాతీయ లక్ష్యాలను సాధిం చడంలో విఫలమైతే బడికి దూరంగా ఉండే విద్యార్థుల సంఖ్య పెరుగుదల కొనసాగుతూనే ఉంటుందని, ఒకవేళ దేశాలు తమ లక్ష్యాలను సాధించగలిగితే 2030 నాటికి బడికి దూరంగా ఉన్న చిన్నారుల సంఖ్యను 16.5 కోట్లకు తగ్గించవచ్చునని జీఈఎం నివేదిక పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు