Thursday, June 12, 2025
Homeఇక ఏటా 3 పంటలు

ఇక ఏటా 3 పంటలు

. తుపాను ముప్పు తప్పేలా ముందుగానే సాగునీరు
. ఖరీఫ్‌ పంట ప్రణాళిక పక్కాగా అమలు
. నరేగా నిధులతో వరిపొలాల గట్లు వెడల్పు
. అంతరపంటలతో అధిక లాభాలు సాధించేలా చర్యలు
. ఎరువుల వినియోగం తగ్గించాలి
. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఖరీఫ్‌ పంటలను తుపాన్ల నుంచి రక్షించుకునేలా పంటకాలాన్ని ముందుకు తీసుకురావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వ్యవసాయ శాఖ అధికారులు కార్యాచరణ మొదలుపెట్టారు. ఇందుకు అనుగుణంగా గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాలకు ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేశారు. అధికారులు ఈ మేరకు వివరాలను మంగళవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన వ్యవసాయ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రికి తెలిపారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో భూములకు కాలువల ద్వారా ఇప్పటికే నీరు విడుదల చేశామని, జులై మొదటివారంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌లో ప్రధానంగా వరి, కందులు, వేరుశనగ, పత్తిసాగు చేస్తుండగా… వేరుశనగ, పత్తి సాగు తగ్గుతూ వస్తోందని, కందుల సాగు మాత్రం పెరిగిందని, వరి సాగు స్థిరంగా కొనసాగుతోందని అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 365 రోజులు సాగుభూములు పచ్చగా ఉండేలా చూడాలని, ఇందుకోసం 3 పంటల విధానం తీసుకురావాలని అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతపురం వంటి జిల్లాల్లో 365 రోజుల్లో కేవలం 4 నెలలే పంటలు సాగు చేసి, 8 నెలల పాటు భూములు ఖాళీగా వదిలేస్తున్నారని, దీనివల్ల భూసారం దెబ్బతింటోందన్నారు. అలాకాకుండా మిగిలిన 8 నెలలు కూడా ఏదో ఒక పంట సాగు చేసే పరిస్థితులు కల్పించాలని చెప్పారు. వచ్చే వేసవిలో జలవనరుల లభ్యత ఉన్న 141 మండలాల్లోనూ పంటల సాగు జరిగేలా రైతుల్ని సన్నద్ధం చేయాలన్నారు. ఇందులో 19 మండలాలు రిజర్వాయర్లు, 57 మండలాలు చెరువులు, 65 మండలాలు భూగర్భ జలాలపై ఆధారపడి ఉన్నాయని, వీటిని వినియోగించుకుని దిగుబడులు సాధించాలన్నారు. వరిలో అధిక డిమాండ్‌ ఉన్న సన్నరకాలు పండిచేలా రైతులను ప్రోత్సహించాలని చెప్పారు.
20 ఏళ్లల్లో 14 తుపాన్లు
గత 20 ఏళ్లుగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌ 14 తుపాన్లను ఎదుర్కొంది. వీటిలో 5 తుపాన్లు అక్టోబర్‌లో, 6 తుపాన్లు నవంబర్‌లో, 3 తుపాన్లు డిసెంబర్‌లో రాష్ట్రంపై ప్రభావం చూపాయి. అక్టోబర్‌లో వచ్చే తుపాన్లు ఎక్కువగా ఉత్తర కోస్తా, తూర్పుగోదావరి జిల్లాలకు నష్టం కలిగించాయి. ఎక్కువగా నష్టపోతున్న వరి రైతుకు ఆదాయం మరింత పెరిగే మార్గాలు చూడాలని సీఎం సూచించారు. వరిలో అంతర పంటగా గట్లపై కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలన్నారు. రైతుల పొలం మధ్యలో వెడల్పుగా అదనపు గట్లు వేసేలా అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే ఈ గట్లు నరేగా నిధులతో ఏర్పాటు చేయాలని, వరిపంట మధ్యలో లేదా పంట చుట్టూ ఆక్వాకల్చర్‌, హార్టీకల్చర్‌ సాగుకు కూడా ప్రయత్నించాలని సూచించారు. ‘ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి… భూసారాన్ని కాపాడేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలి. ఎరువులు, పురుగుమందుల వినియోగంపై తాజా సమాచారం ఉండాలి. రాష్ట్రంలో గత ఏడాది పంటకాలంలో 39 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు వినియోగించగా, ఈ ఏడాది దానిని 35 లక్షల మెట్రిక్‌ టన్నులకు తగ్గించేలా చూడాలి. పల్సెస్‌, మిల్లెట్స్‌ సాగు పెరగాలి. ఈ సీజన్‌లో రైతులు కోరిన 24 గంటల్లోగా బ్యాంకులు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు పర్చూరు ఏఎంసీలో ప్రారంభించామని, దీనిపై రైతుల్లో సంతృప్తి వ్యక్తమైందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. హెచ్‌డీ బర్లీ స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. పంటల బీమా, వ్యవసాయ యాంత్రీకరణ, మార్క్‌ఫెడ్‌కు సంబంధించిన సేవలను ఇకపై వాట్సప్‌ ద్వారా రైతులు పొందే అవకాశం కలిగిందని తెలియజేయగా… రైతులకు ఆఫ్‌ లైన్‌, ఆన్‌లైన్‌లో కూడా వ్యవసాయ విజ్ఞానంపై అవగాహన పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు