ఎలిజీ రాయడమంటే ఆ శరీరాలతో సహా కాలిపోవడం. ప్రసూతి వైరాగ్యమంటే ఓ వేడుక. శ్మశాన వైరాగ్యమంటే ఓ విషాదం. ఈ రెంటికి మధ్య వెలుగుతూ కాలిపోవడమే జీవితమంటే. చివరి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయి. అంతకు ముందటి చిత్రాలు అయిన వారిని వెంటాడతాయి. బోయింగ్ బ్లాస్టో, రైలు ట్రాక్ బ్రేకింగో, బస్సు లోయలో పడడమో మనుషుల్ని దూరం చేసే వాహిక. శ్మశానానికి దగ్గరచేసే ఐహిక. వాళ్లు లేరు. రారు. కనిపించరు. మాట్లాడరు. మనల్ని మాత్రం చితాభస్మం సాక్షిగా చిత్రవధ చేస్తారు.
కూలింది విమానం కాదు. ప్రయాణాల మీద నమ్మకం. విహంగంలో కదా చివరి శ్వాస. ఏ అంగమూ గుర్తించలేం. డీఎన్ఏ ఒక్కటే పరిష్కారం. యంత్రం నిజం చెప్పదు. చెప్పజాలదు. మనిషి భృకుటి నుంచి వచ్చినది వినా ఏదీ నిజం కాదు. పగిలింది టైర్లు కాదు. పక్షి రెక్కల చప్పుడూ కాదు. ఓ మరణానికి, జీవికకు మధ్య మరణించింది మృత్యువు మాత్రమే. కారణాలు వెతకాల్సిన సమయంలో అకారణాల దేవులాటలు. సాంకేతికతలో దేశం పురోగతి. చప్పట్లు కొట్టాలి. సంబరాలు చేసుకోవాలి. ఈ అభివృద్ధితో విగత శరీరాలు… ఫినిక్స్ పక్షిలా శరీరాలుగా మారతాయా..! నవ వధువు, ముచ్చటైన ముగ్గురు పిల్లల కుటుంబం… మాజీ ముఖ్యమంత్రి… పరామర్శకు వచ్చి పరారైన దేహం. మృత్యువు ముందు అందరూ భగవద్గీత చదువుకోవాలి. అదొక్కటే మిగులుతుంది చిత్రంగా. ఇదే దైవ లీల అంటాడు ఆస్తికుడు. మృత్యువు నుంచి బయట పడిరది మాత్రం నాస్తికుడు. ఆస్తికులు, నాస్తికులు.. ఎవ్వరైనా కావచ్చు. ముందు మనుషులం కదా..! కళ్లముందు నడయాడే ప్రపంచీకులు. ఎవరికి వారే మన్కీ బాత్లు చెప్పుకోవాలి. పక్క వాడికి వినపడకూడదు. చావుకీ చెవులుంటాయి. గగనతలంలోనే కాదు.. ఇలాతలంలోనూ విహంగాలకు నేత్రాలుండవు. కళ్ల స్థానంలో డబ్బుల కట్టలు.
మనుషులు ముద్దలుగా మారిన… జారిన శకలాలు. నిర్లక్ష్యం ఖరీదు పరిహారమా..! తప్పిదాలతో పరిహాసమా..! ఒకే ఒక్క మృత్యుంజయుడు. 270 మందికి పైగా మృత్యుమూర్తులు. ఆ వైద్య విద్యార్థుల మధ్యాహ్నపు ఆకలి. ముద్ద గొంతులో అడ్డం పడి మరణపు వెక్కిళ్లు. ఓ లక్ష పిడుగుపాటు ప్రకంపనల అగ్ని. ఆకలీ ఆగ్నే. వారి చావు నిప్పుకణిక. ఈ భూమి మీద బ్రతికి ఉండడమంటే ప్రతి క్షణం మరణించడం. ఇక్కడ మరణించడమంటే సదా బ్రతికుండడం. ఫొటోలకు దండలా..! దండలకు ఫొటోలా.. ! చివరి సెల్ఫీ అబద్ధం. మొదట మాట అమూర్తం.
వేదాంతానికి ఊయల కట్టి నిత్యం జోలపాట పాడాల్సిన క్షణం. గొప్పకవి అజంతా అన్నాడు… మనిషి రోడ్డు మీద హఠాత్తుగా మటుమాయం కావడం మృత్యువు అని. కొత్త నిజం తెలిసొచ్చింది. రోడ్డే కాదు ఆకసం కూడా శ్మశాన స్థలే.
ఆమెకు పెళ్లి కుదిరింది. మృత్యువుతోనా…! తాళిబొట్టు నాశిరకం. కట్టకుండానే తెగిపడిన బతుకు గాలిపటం. శ్రద్ధాంజలి ప్రకటించిన ఎయిర్ ఇండియా. ప్రయాణాలపై శ్రద్ధ లేని ఓ నిర్లక్ష్యపు సంతాపం. ఒక్కో దేహానికి ‘‘కోటి’’ విలువ కట్టి ‘‘టాటా’’ చెప్పిన సంజాయిషీ. ప్రతి క్షమాపణకు ఆకలెక్కువ. ఆకలికి క్షమించే గుణం ఉండదు. చివరి ఆకలిది మరీ ఓదార్పులేని గుణం.
కాకుల ఆకలికి ఓ పిండ ప్రదానం. మనుషుల ఆకలికి ఓ ప్రమాదం. తనకు సంబంధం లేని ఓ ప్రమాదానికి బాధ్యుడయ్యాడు ఆనాటి ఓ మంత్రి. ఈనాటి ప్రమాదానికి పచ్చచొక్కా మంత్రికి సంబంధం లేదు. నాడు – నేడు వేరు కదా..! ఈ నవ యువ మంత్రికి చీమ కుట్టదు. తన వరం శాపం అని చీమకు బాగా తెలుసు. మంత్రి రామ్మోహనుడికి ఇంకా బాగా తెలుసు. ప్రమాదంలో కాలకుండా మిగిలిన భగవద్గీత పొత్తంపై ప్రమాణంచేసి మరీ చెబుతారు. అంతా నిజమే చెబుతున్నాను. నాకు తెలీదు. అవును తెలియదు. ఎవరికీ తెలియదు. తెలిస్తే జరుగునా…! తెలియకపోతే ఆగునా…! లాల్చీ జేబులో నిద్రపోతుంది వేదాంతం. మృత్యుశయ్యపై ఎవరెవరి అవయవాలో కలగాపులగం అవుతాయి. మనుషులంతా ఒక్కటే మళ్లీ నిరూపితమవుతుంది శ్మశానంలో. సర్వం బూడిద. బూడిదే సర్వం.
కళ్లు, చెవులు సమస్త అవయవాలు రూపాయలుగా రూపాంతరం చెందుతాయి. ఇక ఇక్కడ పనైపోతుంది. ఓటు వేసి చూపుడు వేలి మీద సిరా చుక్క వేయించుకుందాం. వ్యర్థ జీవులం కదా… పోతూ పోతూ హరిహర వీరమల్లు సినిమా చూసి పోదాం. దారి ఇవ్వండి. నేను ఇప్పుడు ఎయిర్ ఇండియా విమానం ఎక్కాలి.
సీనియర్ జర్నలిస్టు
సెల్: 9129 19929