Thursday, June 5, 2025
Homeఏడాది గడువు

ఏడాది గడువు

. ఎయిర్‌పోర్టులు, హార్బర్ల నిర్మాణం వేగవంతం
. సీఎం చంద్రబాబు ఆదేశం
. త్వరలో ఏపీ లాజిస్టిక్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు
. జాతీయ రహదారులతో రాష్ట్ర రహదారుల అనుసంధానం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఏడాదికల్లా నాలుగు ఎయిర్‌పోర్టులు, నాలుగు హార్బర్ల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట పోర్టుల మొదటి దశ పనులు, కాకినాడ గేట్‌ వే పోర్టు పనులు వచ్చే ఏడాది డిసెంబర్‌ కల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వీటితోపాటు జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హర్బర్ల మొదటి దశ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు మన రాష్ట్ర సంపదని, వాటి నిర్మాణం త్వరగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి మంగళవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పోర్టుల ఆపరేషన్‌-మెయింటెనెన్స్‌పైనా అధికారులతో చర్చించారు. మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా…ఆ ప్రాంతానికి మరింత ఆదాయం సమకూర్చేలా ఫిషింగ్‌ హార్బర్లను మైనర్‌ పోర్టులుగా అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు.
గిరిజన ప్రాంతాల్లో హెలీ పోర్టులు
రాష్ట్రంలో కొత్తగా నిర్మించ తలపెట్టిన కుప్పం, దగదర్తి, అమరావతి, శ్రీకాకుళం(పలాస) ఎయిర్‌ పోర్టుల నిర్మాణం ముందుగా చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు మొత్తం కలిపి 20కి తగ్గకుండా, అలాగే 14 ఎయిర్‌పోర్టులు ఉండేలా చూడాలని చెప్పారు. ట్రాఫిక్‌ రద్దీకి అనుగుణంగా రాష్ట్ర రహదారుల విస్తరణ చేపట్టాలని, వాటిని జాతీయ రహదారులతో అనుసంధానించాలని ముఖ్యమంత్రి సూచించారు. పీపీపీ విధానంలో వీటిని అభివృద్ధి చేయాలన్నారు. రోడ్లు, పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల అభివృద్ధే లక్ష్యంగా త్వరలో ఏపీ లాజిస్టిక్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చెందేలా హెలీ పోర్టుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
శరవేగంగా పోర్టులు,
ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం
మచిలీపట్నం పోర్టు మొదటి దశ పనులు 43.25 శాతం పూర్తి కాగా వచ్చే ఏడాది నవంబర్‌ నాటికి మొత్తం పనులు పూర్తికానున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. రామాయపట్నం పోర్టు మొదటి దశ పనులు 63.89 శాతం, మూలపేట పోర్టు మొదటి దశ పనులు 46.59 శాతం, కాకినాడ గేట్‌ వే పోర్టు పనులు 29.92 శాతం పూర్తయ్యాయని తెలిపారు. అలాగే జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ మొదటి దశ నిర్మాణం పనులు 97.72 శాతం, నిజాంపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ మొదటి దశ పనులు 81.17 శాతం, మచిలీపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ మొదటి దశ పనులు 69.20 శాతం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్‌ మొదటి దశ పనులు 78.94 శాతం పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించగా, మిగిలిన పనులు లక్ష్యాలకనుగుణంగా వేగవంతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రి జనార్థన రెడ్డితో పాటు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు