న్యూదిల్లీ: కుంభమేళా తొక్కిసలాట దురదృష్టకరమని, ఆందోళన కలిగించే విషయమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిం చింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల భద్రత విషయంలో ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్ను సోమవారం తిరస్కరించింది. దీనిపై అలహాబాద్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా భారీగా భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగి… 30 మంది ప్రాణాలు కోల్పో యిన విషయం విదితమే. దీనికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలని విశాల్ తివారీ అనే న్యాయవాది ఇటీవల సుప్రీంలో పిల్ వేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. భక్తుల భద్రత ప్రమాదంలో పడకుండా నివారించేలా వీఐపీల కదలికలను ఆపాలని పిటిషన్లో ప్రస్తావించారు. దీనిపై యూపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరుగుతోందని, ఇదేతరహాలో ఓ పిల్ హైకోర్టులో దాఖలైందని సుప్రీంకు తెలియజేశారు. రెండు పక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది.