Friday, June 6, 2025
Homeఅంతర్జాతీయంగాజాలో శాశ్వత కాల్పుల విరమణ కోసం ఐరాస తీర్మానం: వీటో చేసిన అమెరికా

గాజాలో శాశ్వత కాల్పుల విరమణ కోసం ఐరాస తీర్మానం: వీటో చేసిన అమెరికా

వాషింగ్టన్‌/టెల్‌అవీవ్‌/ఐరాస: గాజాలో శాశ్వత కాల్పుల విరమణను డిమాండ్‌ చేసే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. సహాయ సామాగ్రి సరఫరాపై ఆంక్షలు తొలగింపునకూ పిలుపునిచ్చింది. హమాస్‌ నిరాయుధీకరణ, గాజా నుంచి నిష్క్రమణకు మద్దతివ్వని, హమాస్‌ను ఖండిరచని చర్యలకు మద్దతు ఇవ్వబోమని అమెరికా స్పష్టం చేసిందని ఐరాసకు అమెరికా రాయబారి దొరోతి షియా వెల్లడిరచారు. వాస్తవికతలకు అద్దంపడుతూ కాల్పుల విరమణ దిశగా జరుగుతున్న దౌత్యపరమైన ప్రయత్నాలను నీరుగార్చేదిగా ఈ తీర్మానం ఉందన్నారు. 10 మంది తాత్కాలిక సభ్యదేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, 14 సభ్యదేశాలు అనుకూలంగా ఓటు వేశాయి.
అమెరికాకు కృతజ్ఞతలు: నెతన్యాహు
తన వీటో అధికారాన్ని అమెరికా వినియోగించడంతో అగ్రరాజ్యానికి ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఎక్స్‌ మాధ్యమంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘మా మధ్య పొద్దు పొడిచేందుకు ప్రసక్తే లేదని మా శత్రువులకు మరోమారు స్పష్టం చేసినందుకుగాను అమెరికాకు, డొనాల్డ్‌ ట్రంప్‌కు కృతజ్ఞతలు’ అని ఆయన పేర్కొన్నారు. గాజా జైళ్లలో 58 మంది అమాయకులను బందీగా ఉంచిన హమాస్‌ ఉగ్రవాదుల వినాశనానికి ఇదొక్కటే మార్గం. తక్షణమే, బేషరతుగా బందీలను విడుదల చేయాలని నాగరిక ప్రపంచం డిమాండ్‌ చేయాలి’ అని నెతన్యాహు ట్వీట్‌ చేశారు.
చైనా ఆగ్రహం: మానవతా సాయంపై ఆంక్షలు ఎత్తివేయడం, గాజాలో తక్షణమే కాల్పుల విరమణ కోసం డిమాండ్‌ చేస్తూ ఐరాస భద్రతా మండలి ముసాయిదా తీర్మానాన్ని అమెరికా వీటో చేయడాన్ని చైనా తీవ్రస్థాయిలో ఆక్షేపించింది. ఇది నిరాశపర్చిందని ఐరాసలో చైనా శాశ్వత ప్రతినిధి ఫూ కాంగ్‌ అన్నారు. గాజా ప్రజల ప్రధాన డిమాండ్లు ప్రతిబింబించే… అంతర్జాతీయ సమాజం గొంతు ప్రతిధ్వనించే ఈ తీర్మానాన్ని వీటో చేయడం ద్వారా గాజా ప్రజల చిరు ఆశలను అమెరికా మళ్లీ చంపేసిందని వ్యాఖ్యానించారు. క్రూరంగా రెండు మిలియన్ల మందికిపైగా ప్రజలను అంధకారంలోకి నెట్టివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజం ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గాజాలో ఘర్షణను ముగించడంలో భద్రతా మండలి అసమర్థత మరోమారు బహిర్గతమైందని, ఇజ్రాయిల్‌కు కవచంగా అమెరికా ఉందన్నారు. భద్రతా మండలి శాశ్వత సభ్యదేశంగా అమెరికా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇజ్రాయిల్‌ చర్యలు అంతర్జాతీయ మానవతా చట్టంలోని అన్ని రెడ్‌ లైన్‌లను దాటేశాయని, భద్రతా మండలి, జనరల్‌ అసెంబ్లీ తీర్మానాన్ని తీవ్రంగా ఉల్లంఘించాయని ఫూ కాంగ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అగ్రరాజ్యం అండదండలతో దానిని నిలదీసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఇటువంటి ద్వంద్వ వైఖరి, లక్షిత చర్యలను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. గాజాలో శాంతి నెలకొల్పేందుకు, మానవతా విపత్తును నియంత్రించేందుకు, ‘టూ స్టేట్‌’ అమలు చేసేందుకు, సమగ్రంగా న్యాయం చేకూరేందుకు, పలస్తీనా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి పని చేసేందుకు చైనా సిద్ధమని ఫూ కాంగ్‌ ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు