విశాలాంధ్ర- హైదరాబాద్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా నిరంకుశ నిజాంను గజగజ వణికించి, రాచరిక పాలనకు చరమగీతం పాడిన గొప్ప కమ్యూనిస్టు యోధుడు రావి నారాయణరెడ్డి అని వక్తలు కొనియాడారు. హైదరాబాద్లో ఆ మహా నాయకుడిని విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు ఎల్బీ నగర్లో నిర్మిస్తున్న కొత్త ఆసుపత్రికి రావి నారాయణరెడ్డి పేరు పెట్టి సముచితంగా గౌరవం కల్పించాలని ప్రభుత్వానికి విజప్తి చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చి … ఉద్యమంలో అశువులు బాసిన అమరులపేర మ్యూజియం ఏర్పాటు చేసి వారి చిత్ర పటాలను అందులో పొందపర్చాలని కోరారు. తెలంగాణ అమరవీరుల సార్మక ట్రస్ట్ అధ్వర్యంలో పద్మ విభూషణ్ రావి నారాయణరెడ్డి 118వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ హోం మంత్రి కె.జానారెడ్డి జానారెడ్డి మాట్లాడుతూ రావి నారాయణరెడ్డి కమ్యూనిస్టు నాయకుడే కాక, మానవత్వం మూర్తీభవించిన గొప్ప గాంధేయవాది అన్నారు. తనకున్న 500 ఎకరాల భూమి పేదలకు పంచడం ద్వారా భూదాన ఉద్యమానికే స్ఫూర్తి ప్రదాతగా నిలిచారన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా … తలకిందులుగా తపస్సు చేసినా కమ్యూనిజాన్ని ఆపలేరన్నారు. మావోయిస్టు లను భౌతికంగా నిర్మూలించగలరోమో గాని సిద్దంతాన్ని ఆపడం వారితరం కాదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలన్ని ఏకం కావాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టుల చీలిపోవడంతో లక్ష్యాన్ని సాధించకలేక పోతున్నామన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ సాయుధ పోరాట విరమణ తర్వాత రావి నారాయణ రెడ్డి ప్రభుత్వతో చర్చలు జరిపి సామాజిక, ఆర్థిక మార్పు లకు పూనుకోవాలని చేసిన ప్రతిపాదన ముందుకు సాగిఉంటే ఈ రోజు పరిస్థితులు ఎలా ఉండేవనేది ఊహాకు అందని విషయమని పేర్కొన్నారు. మాజీ ఎంపీ బి.వినోద్కుమార్ మాట్లాడుతూ… రావి స్ఫూర్పితోనే ఆయన పేరు మీద ఉన్న ఇదే ఆడిటోరియం నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమానికి అంకురార్పణ జరగడమే కాకుండా ఆ లక్ష్యాన్ని సాధించామని చెప్పారు. ట్రస్ట్ సభ్యుడు బొమ్మగాని ప్రభాకర్ మాట్లాడుతూ ఎవరూ అంగీకరించినా, అంగీకరించకపోయినా హైదరాబాద్ సంస్థానం విమోచన ఉద్యమంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి రావి నారాయణరెడ్డి, మఖ్ధూం మోయినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి పిలుపుతోనే తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తి రగిలించి నైజాంను గద్దె దించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్రెడ్డి, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాశం యాదగిరి, సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, రావి ప్రతిభ, ట్రస్ట్ కోశాధికారి ఉజ్జని రత్నాకర్ రావు మాట్లాడారు. పేదలకు భూమి లక్ష్యంగా దానిని సాధించేందుకు కృషి చేద్దామని సురవరం సుధాకర్రెడ్డి పిలుపునిచ్చారు. తొలుత అతిథులు రావి నారాయణరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.