. బడ్జెట్లో రూ.48 కోట్లు కేటాయింపు
. తెలంగాణ చేనేత వస్త్రాలకు ప్రత్యేక లేబుల్: మంత్రి తుమ్మల
విశాలాంధ్ర – హైదరాబాద్ : నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులోభాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన తెలంగాణ చేనేత అభయహస్తంలో నేతన్నకు భరోసా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ. 48 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా జియో ట్యాగ్ చేయబడిన మగ్గాలపై పనిచేస్తున్న కార్మికులకు, అనుబంధ కార్మికులకు వేతన ప్రోత్సాహకం కింద గరిష్టంగా సంవత్సరానికి రూ. 18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.ఆరువేలు అందించడం జరుగుతుందన్నారు. దీంతో 40 వేల మంది లబ్ధి పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చేనేత వస్త్రాలకు యూనిక్ లోగో జతచేయడం జరుగుతుందన్నారు. తద్వారా చేనేత ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలను, నేత కార్మికుని వివరాలను వినియోగదారులు తెలుసుకోవచ్చని తెలిపారు. దీంతో తెలంగాణ చేనేత ఉత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పెరిగే అవకాశాలు ఏర్పడతాయని మంత్రి వివరించారు. 18 సంవత్సరాలు నిండి జియో ట్యాగ్ చేయబడిన మరమగ్గాలపై పనిచేసే కార్మికులు, ప్రీలూమ్, ప్రిపరేటరి పనులైన డైయింగ్, టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండిరగ్, సైజింగ్ తదితర అనుబంధ పనులు చేసే కార్మికులు, చేనేత వృత్తి ద్వారా వారి వార్షిక ఆదాయంలో కనీసం 50 శాతం పొందుతున్నవారు అర్హులు ఉన్నారన్నారు. జియో ట్యాగ్ చేయబడిన మగ్గాల ద్వారా వార్పులలో కనీసం 50 శాతం కంటే ఎక్కువ పూర్తి చేసిన నేత అనుబంధ కార్మికులకు నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలోకి వేతన ప్రోత్సాహకం కింద సంవత్సరానికి రెండు విడతలుగా రూ. తొమ్మిది వేలు, అనుబంధ కార్మికునికి రూ. మూడువేలు జమ చేయడం జరుగుతుందని అన్నారు.