మే ఆరు-ఏడు తేదీల అర్థరాత్రి నుంచి మొదలై పదవ తేదీన ముగిసిన ఆపరేషన్ సిందూర్ను నిలిపి వేయించింది ఎవరు అనే ప్రశ్నకు ఇంతవరకు స్పష్టమైన సమాధానం రానే లేదు. ట్రంప్ మాత్రం భారత్-పాకిస్థాన్ మధ్య ‘‘యుద్ధం’’ ఆపించింది తానేనని ఇప్పటికి 15 సార్లు చెప్పారు. కెనడాలో జరిగిన జి-7 దేశాల సమావేశానికి ప్రధానమంత్రి మోదీకి ఆహ్వానం అందడమే గగనమైంది. మొత్తం మీద ఆఖరి దశలో ఆహ్వానం అందింది. మోదీ హాజరయ్యారు. భారత్ లాంటి దేశాలు జి-7 బృందంలో లేవు. కానీ ఆ బృందంలో లేని కొన్ని దేశాల అధిపతులను కూడా ఆహ్వానించడం ఆనవాయితీ. ఇలా ఆహ్వానాలు అందిన దేశాల అధిపతులకు ప్రధానమైన చర్చల్లో పాల్గొనే అవకాశం ఉండదు. కానీ ఇలాంటి దేశాల అధిపతులు అక్కడికి వచ్చిన వివిధ దేశాల అధిపతులతో చర్చలు జరిపే అవకాశం ఉంటుంది. మోదీ చేసింది అదే. అదే సమావేశంలో భారత ప్రధానమంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య కూడా చర్చలు జరగుతాయనుకున్నారు. కానీ ట్రంప్ హడావుడిగా స్వదేశం వెళ్లిపోయారు. అది పాకిస్థాన్ సైన్యాధిపతి అసీం మునీర్కు విందు ఇవ్వడానికి కావొచ్చు. లేదా ఇరాన్ మీద ఇజ్రాయిల్ చేస్తున్న దాడి నేపథ్యంలో రణతంత్రాల గురించి చర్చించడానికీ కావొచ్చు. అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్నవారు కేవలం విందులతోనే కాలక్షేపం చేయరు. వారు చేయాల్సిన పనులు అనేకం ఉంటాయి. కెనడాలో ట్రంప్తో చర్చించే అవకాశం రాలేదు కనక మోదీ ట్రంప్తో ఫోన్లో 35 నిముషాల పాటు సంప్రదించారట. విందు సందర్భంగా పాక్ సేనాధిపతి అసీం మునీర్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయో బయటకు రాలేదు. అది మునీర్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందు కనక మీడియా ప్రతినిధులతో తప్ప ఇతరులెవరికీ ప్రవేశం లేదు. కానీ మోదీ 35 నిముషాలపాటు ట్రంప్తో ఫోన్లో జరిపిన సంభాషణ గురించిన పూర్తి వివరాలూ బయటకు రాలేదు. కానీ భారత విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ 4 నిముషాల 40 సెకన్ల వీడియో విడుదల చేశారు. దాని ప్రకారం ఆపరేషన్ సిందూర్ను ఆపించింది మీరు కాదు అని మోదీ స్పష్టంగా చెప్పిన దాఖలాలైతే లేవు. కానీ పాకిస్థాన్ అభ్యర్థన మేరకు మాత్రమే కాల్పుల విరమణకు అంగీకరించామని మోదీ ట్రంప్తో అన్నారు. విచిత్రం ఏమిటంటే మోదీతో సుదీర్ఘంగా ఫోన్తోమాట్లాడిన తరవాత కూడా ట్రంప్ భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఘర్షణ ఆపించింది తానే అంటున్నారు. ఆయన ఈ మాట చెప్పడం పదిహేనోసారి. ట్రంప్ తో మోదీ సంభాషణలో పాకిస్థాన్తో తగవు విషయంలో తాము మూడో వ్యక్తి లేదా దేశాధిపతి మధ్యవర్తిత్వానికి అవకాశం ఇవ్వలేదని స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే పాక్తో వైరం కేవలం ద్వైపాక్షికమైందని 1971లో సిమ్లా ఒప్పందం కుదిరినప్పటి నుంచి భారత్ చెప్తోంది. ‘‘యుద్ధం’’ ఆపించింది తానేనని ట్రంప్ పదే పదే చెప్తున్న మాటలను భారత్ నిరాకరిస్తూ ఉండవచ్చు. కానీ ట్రంప్ తో ఫోన్లో సంభాషించినప్పుడు కూడా మోదీ ట్రంప్ వాదనను నేరుగా ఖండిరచలేదు. ఆపరేషన్ సిందూర్ మొదలైన తరవాత ఇతరులెవరితోనూ ఈ విషయంలో చర్చించలేదని మోదీ అంటున్నారు. అంటే ట్రంప్తో కూడా చర్చించలేదనుకోవాలి. ఈ విషయం చర్చకు వచ్చిందల్లా మోదీ-ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలోనే. అందులోనూ మోదీ నేరుగా ట్రంప్ వాదనను ఖండిరచలేదు. అన్యాపదేశంగా మాత్రమే యుద్ధం ఆపించింది తానేనని ట్రంప్ చెప్పుకోవడాన్ని నివారించే ప్రయత్నం చేశారు. ఫోన్ సంభాషణ తరవాత కూడా ట్రంప్ పదిహేనవ సారి ‘‘యుద్ధం’’ ఆపించింది తానేనని, రెండు దేశాలతోనూ వాణిజ్య సంబంధాల గురించి ఒత్తిడి చేసి ‘‘యుద్ధం’’ ఆపించానని అంటున్నారంటే అది కేవలం ధూర్తత్వమే అయి ఉండాలి. ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ గురించి అమెరికా నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.
పాక్ సైన్యాధిపతి మునీర్కు విందు ఇవ్వడానికి ముందు కూడా మీడియా ప్రతినిధులు ట్రంప్ను ఈ విషయం గురించి అడిగారు. ‘‘అవును యుద్ధం ఆపించింది నేనే. నాకు పాకిస్థాన్ అంటే ఇష్టం. మోదీ అద్భుతమైన నాయకుడు అని ట్రంప్ బదులిచ్చారు. నేను రాత్రి మోదీతో ఫోన్లో మాట్లాడాను అని కూడా చెప్పారు. భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నాం. కానీ భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ఆపించింది మాత్రం నేనే’’ అని ట్రంప్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం గురించి ఏ దశలోనూ, ఎవరితోనూ చర్చించలేదని మాత్రం మోదీ ట్రంప్కు గట్టిగానే చెప్పారు. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య వివాదంలోనూ మూడో పక్షం మధ్యవర్తిత్వం ప్రసక్తే లేదు అని కూడా మోదీ చెప్పారట. భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు సడలడానికి మునీర్, మోదీ కృషి చాలా ఉందని ట్రంప్ అనడం ఒక రకంగా ఒక దేశ సైన్యాధిపతిని, ప్రధానిని ఒకే గాట కట్టి భారత్ను అవమానించడమే. ఈ మధ్యలో భారత్-పాక్ దేశాలను సమానంగా చూసే వైఖరి ఎక్కువైంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి తన మద్దతు ఉంటుందని ట్రంప్ అంటున్నారు. అలాంటప్పుడు పాకిస్థాన్ సైన్యాధినేతను ఎలా సమర్థిస్తున్నారు? ఆయనకు విందు ఎందుకు చేస్తున్నారు. పాకిస్థాన్ అధినేతకు ట్రంప్ విందు ఇవ్వడాన్ని అర్థం చేసుకోవచ్చు. పాక్ ప్రేరేపిత తీవ్రవాద ఆగడాలకు అసలు బాధ్యుడు మునీరే కదా! మే ఆరు-ఏడు తేదీల మధ్య అర్థరాత్రి భారత్ పాకిస్థాన్ మీద చేసిన విమాన దాడులు ‘‘చాలా పరిమితమైనవి, కచ్చితమైనవని, ఉద్రిక్తతలను పెంచడానికి ఉద్దేశించినవి కావు’’ అని ట్రంప్కు సంజాయిషీ ఇచ్చుకోవలసిన అగత్యం మోదీకి ఎందుకు వచ్చింది. ఇది అమెరికాకు దాసోహం అనడమే కదా! పాకిస్థాన్ తూటా ప్రయోగిస్తే తాము ఫిరంగులతో సమాధానం చెప్తామన్న మోదీ పాకిస్థాన్ ప్రాధేయపడినందువల్ల కాల్పుల విరమణకు అంగీకరించడం ఏమిటి? ఆపరేషన్ సిందూర్ ఇంకా ఆగలేదని పదే పదే చెప్పడం కాల్పుల విరమణకు అంగీకరించడం మధ్యలో ఫిరంగి గుండు ఎక్కడ మాయమైనట్టో! మే 9వ తేదీన అంటే కాల్పుల విరమణకు అంగీకరించే రోజుకు ముందు రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు వాన్ తనతో మాట్లాడుతూ పాకిస్థాన్ భీకరమైన దాడికి దిగబోతోందని చెప్పారట. కాల్పుల విరమణకు ఈ హెచ్చరిక కూడా తోడ్పడిరదనుకోవాలా? అలాంటప్పుడు ‘‘యుద్ధం’’ ఆపడంలో ట్రంప్ ప్రమేయం లేదని ఎలా అనగలం! పాకిస్థాన్ మీద అత్యంత అభిమానం ఒలకబోస్తూ, తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కొనసాగించే పోరాటాన్ని సమర్థిస్తామని ట్రంప్ చెప్పడాన్ని వర్ణించడానికి ధూర్తత్వం కన్నా తక్కువ మాట ఏమైనా ఉంటుందా!