Monday, April 7, 2025
Homeతాగునీటి ఎద్దడి రానివ్వొద్దు

తాగునీటి ఎద్దడి రానివ్వొద్దు

. ముందు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలు నివారించాలి
. అందుబాటులో మజ్జిగ, చలివేంద్ర కేంద్రాలు
. పశువుల కోసం రూ.35 కోట్లతో 12,138 నీటితొట్ల నిర్మాణం
. పాఠశాలల్లో వాటర్‌ బెల్‌ విధానం అమలు చేయాలి
. సీఎం చంద్రబాబు ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేసవి ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సోమవారం విపత్తు నిర్వహణా సంస్థ, పంచాయతీ రాజ్‌, మున్సిపల్‌, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం నిర్ధిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎండల తీవ్రతపై ముందుగా వివిధ విభాగాల నుంచి సమాచారం తెప్పించి ప్రజలను అప్రమత్తం చేయాలని విపత్తు నిర్వహణా సంస్థ అధికారులకు సీఎం సూచించారు. ఎండ వేడిమి సమాచారాన్ని మొబైల్‌ ఫోన్‌ల ద్వారా అందజేసి… ఆయా ప్రాంతాల ప్రజలను ఎండలబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ముందస్తు జాగ్రత్తల ద్వారా వడదెబ్బ మరణాలు నివారించవచ్చన్నారు. మార్కెట్లు, బస్‌స్టాండ్లు, కూలీ అడ్డాలు, జన సమూహం ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వపరంగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వశాఖల పరంగా సహకారం అందించాలని సూచించారు. 2014-19 మధ్య ప్రజలకు ఉచితంగా ప్రభుత్వం తరపున మజ్జిగ అందించామని గుర్తు చేశారు. ఈసారి కూడా ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాలో పశుగ్రాసం, తాగునీరు పశువులకు లభించని పరిస్థితి ఉంటుందని, ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ముఖ్యంగా పశువులకు నీరు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో రూ.35 కోట్లతో 12,138 నీటితొట్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. వేసవిలో పశువులు, పక్షులు దాహం తీర్చుకోడానికి ఇబ్బందులు పడకుండా సాధ్యమైనంత వరకు నీటి సదుపాయం కల్పించాలని చెప్పారు.
పాఠశాలల్లో వాటర్‌ బెల్‌ విధానం అమలు
పాఠశాలల్లో వాటర్‌ బెల్‌ విధానం అమలు చేయాలని, తప్పనిసరిగా తాగునీరు అందుబాటులో ఉంచాలని చంద్రబాబు సూచించారు. అడవుల్లో అగ్నిప్రమాదాలు, కార్చిచ్చులపై అప్రమత్తంగా ఉండాలని, డ్రోన్లతో పర్యవేక్షించాలన్నారు. ఎవరైనా బాధ్యతా రాహిత్యంగా కార్చిచ్చుకు కారణమైతే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అగ్నిప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండే పరిశ్రమల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన రూ.39 కోట్లు విడుదలకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. నీటి లభ్యత పెంచేందుకు గ్రామాల్లో నరేగా ద్వారా ఫాం పాండ్స్‌ నిర్మాణం, చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలన్నారు. వేసవిలో నరేగా కూలీలకు అదనపు పనిదినాలు మంజూరు చేయడంతో పాటు పని ప్రాంతంలో నీళ్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపు ఉపాధి హామీ కూలీలు పనులు ముగించుకుని ఇంటికి చేరుకునేలా చూడాలని, ఉపాధి కూలీలు, ప్రయాణికులు వడదెబ్బ బారిన పడకుండా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. మున్సిపల్‌ కార్మికులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట ప్రాంతాల్లో పని అప్పగించకుండా చూడాలని, అన్ని ఆసుపత్రుల్లో బెడ్లు, వైద్యులు, వడదెబ్బకు చికిత్స అందించే సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్షలో సీఎస్‌ విజయానంద్‌తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు