ప్రతి వారం మొబలైజేషన్ కేబినెట్ కమిటీ భేటీ
ఎప్పటి నిర్ణయాలు అప్పుడే అమలు: భట్టి విక్రమార్క
విశాలాంధ్ర-హైదరాబాద్ : నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. రిసోర్స్ మొబలై జేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం గురువారం చైర్మన్ భట్టి విక్రమార్క అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగింది. ఈ సబ్ కమిటీ సమావేశం ప్రతి వారం జరుగుతుందని, తాజా నిర్ణయాలు వేగంగా అమలు చేయాలని అధికారులను భట్టి ఆదేశించారు. వచ్చే వారం జరిగే సమావేశంలో అంశాల వారీగా సమీక్ష ఉంటుందని తెలిపారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు చెప్పిన అంశాల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ కోసం ఆర్థిక శాఖలో ప్రత్యేక అధికారిని నియమిం చాలని భట్టి విక్రమార్క సూచించారు. సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజు, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, సీసీఎల్ఏ కార్యదర్శి నవీన్ మిట్టల్, మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, కమిషనర్లు హరిత, హరికిరణ్, విష్ణువర్ధన్, సురేంద్రమోహన్, బుద్ధ ప్రకాశ్ జ్యోతి, ఇలంబర్తి, ఆర్వీ కర్ణన్ పాల్గొన్నారు.