. దేశ ఆర్థిక భద్రత మీ చేతుల్లోనే
. తెలంగాణలో అవకాశాలు పుష్కలం
. ప్రతిభను… సేవకు వినియోగించాలి
. సీఏల జాతీయ సదస్సులో భట్టి
విశాలాంధ్ర – హైదరాబాద్ : తెలంగాణ… ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఇండియా హైదరాబాద్ శాఖల అధ్వర్యంలో గురువారం శిల్పకళా వేదికలో సీిఏ విద్యార్థుల జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన భట్టి మాట్లాడుతూ… ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు అనేక పరిశ్రమలకు తెలంగాణ కేంద్ర బిందువుగా మారిందని అన్నారు. ఐటీ, ఫార్మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధిలో ప్రపంచ పటంలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుందని వివరించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ లో సీఏ విద్యార్థులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. భారతదేశ ఆర్థిక, ధన, వినియోగ నైతికతకు మూలస్తంభంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఇండియా నిలుస్తుంది అన్నారు. చార్టెడ్ అకౌంటెంట్లు నైతికతకు కట్టుబడి ఉండాలన్నారు. టెక్నాలజీ ఆటోమేషన్ యుగంలో మీ నిజాయితీయే మీకు అత్యంత విలువైన ఆస్తి అన్నారు. మీ పని ఎల్లప్పుడూ నిజాయితీ, సమన్యాయం బాధ్యతను ప్రతిబింబించాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షిం చారు. దేశవ్యాప్తంగా 4.26 లక్షలకు పైగా సభ్యులు, దాదాపు పది లక్షల మంది విద్యార్థులతో మీరు ఒక బలమైన ఆర్థిక శక్తిగా మారారని డిప్యూటీ సీఎం అభివర్ణించారు. ఇందులో హైదరాబాద్ బ్రాంచ్ పాత్ర మరింత విశిష్టమైనది 14,500 మందికి పైగా సభ్యులు, 31 వేల మందికిపైగా విద్యార్థులతో ఇది ఐసీఏఐకి విలు వైన ఆభరణంగా నిలిచిందన్నారు. మీరు కేవలం అంకెలు, సంఖ్యలు కాదు ఒక శక్తి, ఒక ఆశయం, ఒక ప్రతిభకు ప్రతీక అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సేవలందించే ప్రతిభావంతులైన వృత్తి నిపుణులను ఐసీఏఐ తయారు చేయడం మనందరికీ గర్వకారణం అన్నారు. భారతదేశం ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న సమయంలో చార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర మరింత ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. వ్యాపార సంస్కరణలు, స్టార్టప్లకు చేయూత, ప్రజా ఆర్థిక వ్యవస్థల బలో పేతం ఇవన్నీ సీఏల పాత్రతోనే ముందుకు సాగుతాయన్నారు. సమకాలీన పరిజ్ఞానాన్ని మెరుగు పరుచుకోవాలని సూచించారు. ప్రతిభను కేవలం సంపాదనకే కాకుండా సేవకు వినియోగించాల న్నారు. ప్రభుత్వ ఆర్థిక ప్రణాళిక కార్యక్రమాలలో పాల్గొని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు.