ఆచార్య చందు సుబ్బారావు
సెల్: 9441360083
ఇటీవల మరణించిన ప్రగతిశీల చైతన్యవాది, విద్యాధికురాలు పి.చిరంజీవినీ కుమారి రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది. తొలుత కాంగ్రెస్ అనంతరం కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలై సానుభూతి పరురాలుగా మారింది. తూర్పు గోదావరి జిల్లా పార్టీ నాయకురాలైంది. వామపక్ష భావజాలంతో ఆమె ఒక చిన్న విద్యాసంస్థను స్థాపించి దాన్ని అంచెలంచెలుగా కాలేజీ స్థాయికి తెచ్చారు. ఆ కాలేజీ ప్రజాతంత్ర భావజాలానికి కూడా కేంద్రమైంది. సభ్యులు, సానుభూతిపరులు సమావేశాలను తమ సంస్థలోనే నిర్వహించేవారు. సాహిత్యంలో కూడ ప్రవేశం ఉండటం వలనే నాలాంటి (చందు సుబ్బారావు) కవులను, విమర్శకులను కూడా కాలేజీకి రప్పించింది. వందల కొలది ఉపన్యాసాలు ఇప్పించారు. వచ్చిన వారికి అతి చక్కని ఆతిథ్యాన్ని ఆమె ఇచ్చేవారు. అటు విద్యా సంస్థలు, ఇటు అభ్యుదయ రచనల సంస్థలో రెండిరటిలోను చిరంజీవినీ దీపంలా వెలిగింది. ఒక్కమాట పడకుండా జిల్లా నాయకురాలిగా ఎదిగింది. రాష్ట్ర స్థాయిలో రచయితలని కూడదీసి నాలాంటివాళ్లను సభ్యులను చేసి నాయకత్వం అప్పగించింది. మేము నిద్రాణ స్థితిలో ఉన్నా, మేల్కొని తిరుగుతున్నా ఫోన్ చేసి మా కర్తవ్యాలను గుర్తు చేసేది. అన్ని విద్యాసంస్థలు నడపటం మాటలు కాదు. ఎంత కష్టమో అందరికీ తెలుసు. అటు రాజకీయ ప్రవేశంతో పాటు, ఇటు విద్యాసంస్థల నిర్వహణ విజయవంతంగా కొనసాగించింది.
ప్రతిరోజూ ప్రతిక్షణం సమాజం గురించే తప్ప తన గురించి ఎప్పుడూ ఆలోచించేది కాదు. పిల్లలు ఏం చేస్తున్నారమ్మా! అని అడిగేవాడిని. నవ్వి ఎక్కడో ఉద్యోగం చేస్తున్నారులే అనేవారు. సాహితీ కవుల కార్యక్రమాలను చాలా చురుకుగా నిర్వహించేవారు. వచ్చేవారం శ్రీశ్రీ జన్మదినోత్సవం చేయాలి. మల్లారెడ్డిని, రాంభట్లను, పురిపండాను వివిధ రచయితలను ఆహ్వానించాలి. మీరు కూడా రావాలి అనేది. నాకు పెద్దలతో సాంగత్యం అలాగే ఏర్పడిరది. పైగా నేను యూనివర్శిటీలో ఆచార్యుడిని కావటం వలన కళాశాలలకు పరీక్షాధికారిగా, విశిష్ట అతిధిగా వెళ్తుండేవాడిని. చెప్పొద్దు… మా చిరంజీవినీని చూడటానికే వెళ్లేవాడిని. గంటల తరబడి మాట్లాడినా, చర్చించినా, నిర్ణయాలు తీసుకున్నా ప్రగతిశీల కార్యక్రమాలు తప్ప ప్రైవేటు విషయాలు శూన్యం. మీ వారి పేరేమిటని నేనూ అడగలేదు, నీ శ్రీమతి పేరేమిటని ఆమె అడగలేదు. నాకు సాహిత్యం రాజకీయ చర్చల్లో ప్రవేశాన్ని కల్పించి గౌరవించిన సోదరి మా పాలెపు చిరంజీవినీ కుమారి. తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.