డా॥జ్ఞాన్పాఠక్
ఒడిశా రాష్ట్రాన్ని విభజించేందుకు బీజేపీ నాయకత్వం కుయుక్తులు ప్రారంభించింది. పశ్చిమ ప్రాంతంలోని కోశల్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని గతంలో చేసిన ఉద్యమం మళ్లీ తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ సీనియరు నాయకుడు జయ నారాయణ మిశ్రా ఇటీవల మాట్లాడుతూ కోశల్ ప్రాంతాన్ని ఒడిశాలో కలిపి వేయాలని పిలుపు ఇవ్వడం చారిత్రక తప్పిదమని అన్నారు. అయితే తమ నాయకుడితో విభేదిస్తున్నామని బీజేపీ ప్రకటించింది. దీర్ఘకాలం నుంచి కోశల్ ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం జరుపుతూనే ఉన్నారు. 2004 లో డిప్యూటి ప్రధానిగా ఉన్న బీజేపీ నాయకుడు లాల్కృష్ణ అడ్వానీ బొలంగీర్లో పర్యటించినప్పుడు ఒడిశా అసెంబ్లీ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమోదించినట్లయితే తాము కూడా ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నామని అన్నారు. 2004 లో బిజూ జనతాదళ్ (బీజేడీ) పాలక పార్టీగా ఉన్నది. అందువల్ల అడ్వానీ బాధ్యతను బీజేడీపైకి నెట్టారు. రెండు దశాబ్దాలు గడిచిన తరువాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు కేంద్రంలోను, రాష్ట్రంలోను బీజేపీ పరిపాలన చేస్తున్నది. రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియరు నాయకుడు జయ నారాయణ్ మిశ్రా కోశల్ ప్రాంతం ఒడిశాలో కలిసిపోవటం ‘చారిత్రక తప్పిదం’ అన్నారు. గతంలో చాలామంది బీజేపీ నాయకులు ప్రత్యేక కోశల్ రాష్ట్రం ఏర్పాటుకు డిమాండ్ చేశారు. ఆనాడు జరిగిన ఉద్యమానికి తోడ్పాటు పలికారు. అయితే ప్రస్తుతం కోశల్ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం మళ్లీ ఉద్యమం ప్రారంభమవుతోంది. ఉదాహరణకి బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, ఎంపీ బాల్గోపాల్ మిశ్రా మాట్లాడుతూ కోశల్ ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ పెరుగుతోందని అన్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీ, బొలంగీర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమ సూచనలను గమనించడంలో విఫలమయ్యారని చెప్పారు. 2004 ఉద్యమ సందర్భంగా బీజేపీ వైఖరి వేరుగా ఉంది. ప్రస్తుతం కొంతమంది బీజేపీ నాయకులు కోశల్ ప్రత్యేక రాష్ట్రానికి చేస్తున్న ఉద్యమానికి తోడ్పాటు ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. ఒడిశా పశ్చిమ ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా ఉన్న పది జిల్లాలు ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం ఈ జిల్లాలలో ఎక్కువగా ఆందోళన చేయనున్నారు. సంబల్పూర్, జెర్స్గుడా, సుందర్ఘర్, బర్గరప్ా, కలహండి, నౌపడ, దియోఘర్, సోనేపూర్, బౌద్ద్, బలంఫీుర్ జిల్లాలలో గిరిజనులు చాలా ఎక్కువగా ఉన్నారు.
బీజేపీ ఎంపీ బాలగోపాల్ మిశ్రా ‘కోశల్ ముక్త్ రథ్’ పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని ఉద్యమం కోసం జనాన్ని సమీకరించడానికి సిద్ధపడుతున్నారు. సంబల్పూర్ 1936 లో ఒడిశాలో విలీనం అయింది. దేశం స్వాతంత్య్రం పొందిన తరువాత 1948లో కోశల్ ప్రాంతాలు విలీనమయ్యాయి. భూస్వామ్య రాజ్యాలు సంస్థానాల విలీనాన్ని వ్యతిరేకించాయి. అయితే స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఒడిశాలో చేరడానికి అంగీకరించాయి. పాట్నా, కలహండి, సోనేపూర్ పాలకులు ఒడిశాలో విలీనానికి ప్రధానంగా వ్యతిరేకించారు. స్వయం ప్రతిపత్తి లేకుండా ఉండి ఒడిశాలో చేరితే కోస్తా ఒడిశా రాజకీయంగా తమను నియంత్రిస్తుందని భయపడ్డారు. 1948 లో ఈ ప్రాంతాలు ఒడిశాలో విలీనం అయినప్పటికీ ప్రత్యేక కోశల్ డిమాండ్ మాత్రం సమసిపోలేదు. బొలంగీర్కు చెందిన స్వతంత్ర పార్టీ నాయకుడు రాజేంద్రసింగ్దేవ్ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పాలనలో ప్రత్యేక కోశల్ రాష్ట్రానికి ఉద్యమం సమసిపోయింది. 1990 లలో మళ్లీ కోశల్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తలెత్తింది. సంబల్పూర్కు చెందిన న్యాయవాది ఒడిశా ప్రభుత్వం కోశల్ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తూ మరోసారి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించారు. కోశల్ సేన పేరుతో జనాన్ని సమీకరించారు. ప్రచారం కోసం కోశల్ ఖబర్ పత్రికను ప్రారంభించారు. ఈ ఉద్యమం క్రమంగా పెరిగింది. అనేక సంఘాలు ఈ ఉద్యమంలో చేరాయి. వీటిలో వెస్ట్రన్ ఒడిశా, యువ మంచ్, కోశల్ యూత్ కో ఆర్డినేషన్ కమిటీ, కోశల్ స్టేట్ కో ఆర్డినేషన్ కమిటీ, కోశల్ ముక్త్ బహనీ, కోశల్ ముక్త్ మోర్చా, కోశల్ ముక్త్ సేన తదితర సంఘాలు ఉద్యమంలో చేరాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే జయ నారాయణ్ మిశ్రా ఒడిశాలో కోశల్ విలీనంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒడిశా అసెంబ్లీలో కాంగ్రెస్ ఈ సమస్యను తిరిగి ప్రేరేపించింది. మంగళవారం ఈ సమస్య పైన బీజేపీ గందరగోళాన్ని సృష్టించింది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షం, పాలక పక్షానికి చెందిన సభ్యుల మధ్య తోపులాట జరిగింది.
జయనారాయణ్ మిశ్రా అయిదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రభుత్వం తరఫున సంబల్పూర్ నియోజక వర్గంలో ఒక సమావేశం జరిగింది. ఇందులో ఆయన ప్రసంగం చేస్తూ ‘‘అన్ని రంగాలలో అనగా గనుల తవ్వకం, వ్యవసాయం, అటవీ ఫలాలు, సేవలు తదితరాలలో మేము దోపిడీకి గురయ్యాం. మా సాంస్కృతిక హక్కులను తిరస్కరించారు. కోశల్ ప్రాంతం ఒడిశాలో విలీనమైనట్లయితే అది చరిత్రాత్మక తప్పిదం అవుతుంది.’’ అని అన్నారు. తాను ఏ మాత్రం తప్పుగా మాట్లాడలేదని ఒడిశాలో విలీనం కావటం కంటే ఈ ప్రాంతం అభివృద్ధి కావాలన్నదే తన లక్ష్యం అన్నారు. ఈ అంశంపై సమీక్షించేందుకు 1991 లో ముఖ్యమంత్రిగా ఉన్న బిజూపట్నాయక్ ఒక కమిటీని వేశారు. ఈ కమిటీ మూడు సంవత్సరాల తర్వాత తన నివేదికను అందజేసింది. ఈ నివేదికలో 25 వెనుకబడిన బ్లాకులను, 34 తీవ్రంగా వెనుకబడిన డెవలప్ మెంట్ బ్లాక్లను గుర్తించింది. పశ్చిమ ఒడిశా అభివృద్ధి మండలిని 1998 లో ఏర్పాటు చేశారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి బీజేడీ నాయకుడు నవీన్పట్నాయక్ ఈ ప్రాంతంలో వెనుకబాటు తనాన్ని అధ్యయనం చేసేందుకు కమిషన్ ఏర్పాటు చేశారు. ఎస్.కె.మొహంతి కమిషన్కు ఆధిపత్యం వహించి 2008 లో నివేదికను సమర్పించారు. 2024 25 ఆర్థిక సంవత్సరంలో కేటాయించినట్లుగానే 2025
26 వ ఆర్థిక సంవత్సరానికి ఈ ప్రాంత అభివృద్ధి కోసం బడ్జెట్లో 500 కోట్లు కేటాయించారు. ఉద్యమం మరింత తీవ్రం అవడానికి ముందే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా?