. ఎస్ఎస్ ఫార్మాలో విష వాయువు లీక్
. ఇద్దరి మృతి: మరొకరి పరిస్థితి విషమం
విశాలాంధ్ర-పరవాడ: అనకాపల్లి జిల్లా, పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో విషాదం చోటుచేసుకుంది. సాయి శ్రేయస్ (ఎస్ఎస్ ఫార్మా) ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో విష వాయువులు లీకయ్యాయి. వాటిని పీల్చిన ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను తెలంగాణకు చెందిన పరిమి చంద్రశేఖర్ (సేఫ్టీ మేనేజర్), అనకాపల్లి జిల్లా మునగపాక గ్రామానికి చెందిన శరగడం కుమార్ (సేఫ్టీ అధికారి)గా గుర్తించారు. మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు. ఒడి శాలోని బోడెన్కు చెందిన బైడూ బైసాల్ అనే కార్మికుడు షీలా నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కంపెనీలోని రసా యన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద స్థాయిలను తనిఖీ చేయడానికి వెళ్లిన ఈ ముగ్గురు విష వాయువులు పీల్చి అస్వస్థత కు గురయ్యారు. ఆపై ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరొకరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సమాచారం తెలిసిన వివిధ శాఖల అధికారులు ఘటనాస్థలానికి సందర్శించారు. ఈ ఘటనపై పరవాడ సీఐ మల్లికార్జునరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలావుంటే, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరహారాన్ని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. భద్రతా ప్రమాణాలు లేకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రూ.కోటి పరిహారమివ్వాలి: రామకృష్ణ
ఎస్ఎస్ ఫార్మా కంపెనీ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారంగా ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోవడంపై విచారం వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స ఉచితంగా అందించాలని కోరారు. విశాఖపట్నం పరిసరాల్లో ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయని, అధికారుల అలసత్వమే వీటికి కారణమన్నారు. యాజమాన్యాలు పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలకు తిలోదకాలు ఇవ్వటం వల్ల కార్మికులు చనిపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వాలు మారినా నిర్థిష్ట చర్యలు చేపట్టడంలో లోపం కొనసాగుతోందని విమర్శించారు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో దుర్ఘటనల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.