Saturday, June 21, 2025
Homeఅంతర్జాతీయంబాంబులు, బెదిరింపులకు లొంగం

బాంబులు, బెదిరింపులకు లొంగం

తెహ్రాన్‌ సహా ఇరాన్‌ వ్యాప్తంగా భారీ ప్రదర్శనలు: పాల్గొన్న వేలాది మంది

తెహ్రాన్‌: ఇజ్రాయిల్‌ఇరాన్‌ మధ్య ఎనిమిది రోజులుగా భీకర పోరు సాగుతోంది. అణ్వస్త్రాలు కలిగివున్న నెపంతో ఇరాన్‌ కీలక అణు కేంద్రాలు, స్థావరాలను ఇజ్రాయిల్‌ ధ్వంసం చేస్తోంది. ఇరాన్‌ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా బాలిస్టిక్‌ క్షిపణులతో ఇజ్రాయిల్‌ను దెబ్బ తీస్తోంది. ఇజ్రాయిల్‌కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగడంతో యూద దేశం పనైపోయినట్టేనని ఇరాన్‌ ఎద్దేవా చేస్తోంది. ఇదే క్రమంలో బాంబులకు, బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని ఇరాన్‌ ప్రజలు తేల్చిచెప్పారు. తమ నాయకుడు ఆయాతుల్లా ఖామేనీ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధమని ముక్తకంఠంతో నినదించారు. ఇజ్రాయిల్‌ దాడులు, అమెరికా బెదిరింపులకు వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు. తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తమ నాయకులకు అనుకూలంగా, ఇజ్రాయిల్‌అమెరికాకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు ఇచ్చారు. తమ దేశ వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని ఇరాన్‌ ప్రజలు తీవ్రంగా ఆక్షేపించారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థన తర్వాత రాజధాని తెహ్రాన్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. దేశ సైన్యానికి మద్దతుగా నిర్వహించిన ప్రదర్శనల్లో ఇరాన్‌ సీజే గులాం హుస్సేన్‌ మొహసెనీ, ఐఆర్‌జీసీ మాజీ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ మహమ్మద్‌ అలీ జాఫరీ, పార్లమెంటు డిప్యూటీ స్పీకర్‌తో పాటు అనేక మంది మంత్రులు, నాయకులు భాగస్వాములయ్యారు. తెహ్రాన్‌ ప్రదర్శనలో వేలాది మంది పాల్గొన్నారు. పలస్తీనా, ఇరాన్‌ జెండాలతో కదం తొక్కారు. ఇజ్రాయిల్‌ బాంబులకు, అమెరికా బెదిరింపులకు లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ‘అవసరమైతే మా నాయకుడి కోసం ప్రాణాలు ఇస్తాం’, ‘ఇజ్రాయిల్‌ దాడులను తిప్పికొడతాం’, అమెరికా బెదిరింపులకు భయపడబోం’ అన్న బ్యానర్లను ప్రదర్శించారు. నినాదాలతో ఆయా ప్రాంతాలను హోరెత్తించారు. వాయువ్య ఇరాన్‌లోని తబ్రీజ్‌, దక్షిణ ఇరాన్‌లోని షిరాజ్‌తో పాటు మషాద్‌, ఇష్ఫాహన్‌, ఖామ్‌, ఖాజ్విన్‌, యజ్ద్‌, గిలన్‌ సహా చిన్న, పెద్ద నగరాల్లో ర్యాలీలు జరిగాయి. ‘ఇది దేశ ప్రజల సంఫీుభావాం…. ప్రతిఘటనల శుక్రవారం’ అంటూ ఈ ర్యాలీలను స్థానిక మీడియా ప్రసారం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు