జానపద, గిరిజన నృత్యంతో ఘనస్వాగతం
విశాలాంధ్ర-హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రపంచ దేశాలకు చెందిన 22 మంది సుందరీమణులు నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో పర్యటించారు. తొలుత వారికి జానపద, గిరిజన నృత్య కళాకారులు ఘనస్వాగతం పలికారు. అందగత్తెలంతా అక్కడి పరిసరాలను చూసి అమితానందం పొందారు. బౌద్ధ థీమ్పార్క్లోని బుద్ధ విగ్రహాల వద్ద జరిగిన ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లీనమయ్యారు. అంతకుముందు పర్యాటక సంస్థ విజయ్ విహార్లో కొంతసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సుందరీ మణులంతా ఫొటోషూట్లో పాల్గొన్నారు. బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని వారంతా బుద్ధవన సందర్శనకు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇండియా, బంగ్లాదేశ్, కంబోడియా, మయన్మార్, వియత్నాం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేసియా, జపాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, లెబనాన్, మంగోలియా, నేపాల్, ఫిలిప్పీన్స్, సింగపూర్, శ్రీలంక, తుర్కియే, చైనా, థాయ్లాండ్, ఆర్మేనియా దేశాలకు చెందిన భామలు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొననున్నారు.