ఆపరేషన్ కగార్ తక్షణం విరమించాలి: కూనంనేని డిమాండ్
విశాలాంధ్ర బ్యూరో-కొత్తగూడెం : ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కక్షగట్టి మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేయిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశివ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళ వారం పాండురంగాపురం గ్రామంలో సీపీఐ పాల్వంచ మండల 19వ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కూనంనేని తొలుత అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అరుణ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు తోపాటు అనేక మంది మావోయిస్టుల ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణకు ఆదేశించాలన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాలు కమ్యూనిస్టులకు వ్యతిరేకంగానే పురుడు పోసుకున్నాయని గుర్తు చేశారు. దేశంలో కమ్యూనిస్టులు లేకుండా చేయాలన్న కుట్రల్లో భాగంగానే శాంతి చర్చలకు పిలవకుండా బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టు కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులను చంపుతూ ఏదో ఘనకార్యం చేసినట్లు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పైశాచిక ఆనందం వ్యక్తం చేస్తూ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఒక సిద్ధాంతం పై పోరాడుతున్న నక్సలైట్లను చంపుతూ శత్రుదేశంపై విజయం సాధించిన రీతిలో స్పందించడం విచారకరమన్నారు. స్థానిక ప్రజల హక్కులు, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వారిపై సైన్యాన్ని ఉసిగొల్పడం అప్రజాస్వామికమే కాక దుర్మార్గ విధానమన్నారు. ఫాసిస్ట్ శక్తులు చేస్తున్న ఆపరేషన్ కగార్ పై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని కూనంనేని పిలుపునిచ్చారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటిస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం లోనే ఈ ఫాసిస్ట్ ప్రభుత్వ లక్షణాలు స్పష్టం అవుతున్నాయని దుయ్యబట్టారు. ఇది ప్రజాస్వామిక హక్కులకు విఘాతం కలిగించే అంశమన్నారు. దేశ ప్రజలంతా ఈ పరిణామాలను అర్థం చేసుకొని క్రూరమైన ఆపరేషన్ కగార్ ని ఉప సంహరించుకునేలా ఉద్యమించాలని కూనంనేని పిలుపునిచ్చారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు న్యాయ విచారణ చేపట్టవలసిన అవసరం ఉందని కోరారు. పేద ప్రజలకు అంతిమంగా ఎర్ర జెండా మాత్రమే భరోసా అని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, ప్రతి పంచాయతీలో సిపిఐ ప్రాతినిధ్యం ఉండే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధంగా చేసుకోవాలన్నారు. తనను ఎమ్మెల్యే గా గెలిపించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానన్నారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె. సాబీర్ పాషా మాట్లాడుతూ… దోపిడీ, అణచివేతకు గురవుతూ దుర్భరజీవితం గడుపుతున్న ఏజెన్సీ పల్లె ప్రజల జీవన ప్రమాణాల మార్పునకు నాందీపలికి ఆధునికతవైపు నడిపించింది ఎర్ర జెండామాత్రమే అన్నారు. అసమానతలు లేని సమాజ నిర్మాణమే కమ్యూనిస్టుల అంతిమ లక్ష్యమన్నారు. గుండాల నాగరాజు, నిమ్మల రాంబాబు, కొంగర అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర, జిల్లా నేతలు ముత్యాల విశ్వనాథం, నరాటి ప్రసాద్, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, అడుసుమిల్లి సాయిబాబా, బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, పద్మజ, చెన్నయ్య, వేముల కొండలరావు అన్నారపు వెంకటేశ్వర్లు, ఇట్టి వెంకట్రావు, వేములపల్లి శ్రీను, మనేం వెంకన్న, శనగారపు శ్రీనివాసరావు, నరహరి నాగేశ్వరరావు, మేరమ్మ, ఎల్లంకి శివరావు, వగెల పద్మ, మేక రాంబాబు, శ్రీనివాసరావు, సాయిల శ్రీను, మోహన్, మాలోత్ హరి, రంగారావు, చందులాల్, ప్రభావతి, వీర మోహన్ రావు, బానోత్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.