Wednesday, May 28, 2025
Homeఅంతర్జాతీయంభారత్‌కు వెళితే…25% సుంకంమరోసారి ‘యాపిల్‌’కు ట్రంప్‌ హెచ్చరిక

భారత్‌కు వెళితే…25% సుంకంమరోసారి ‘యాపిల్‌’కు ట్రంప్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ను మరోసారి బెదిరించారు. ఐఫోన్లు భారత్‌లో కాకుండా అమెరికాలోనే తయారు చేయాలని, లేనిపక్షంలో దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తామని ఆయన హెచ్చరించారు. భారత్‌ సుంకాలు లేని ఒప్పందాలను ప్రతిపాదించినప్పటికీ, దేశీయంగానే ఉత్పత్తి జరగాలన్నది తన కోరిక అని ట్రంప్‌ స్పష్టం చేశారు. అణుశక్తిపై కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసే కార్యక్రమం కోసం వైట్‌ హౌస్‌ ఓవల్‌ ఆఫీస్‌లో ఉన్న సందర్భంగా ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌తో జరిగిన చర్చల్ని ప్రస్తావిస్తూ… ‘‘టిమ్‌ ఇలా చేయరని నేను భావించాను. భారత్‌లో ప్లాంట్లు నిర్మించబోతున్నట్లు ఆయన చెప్పారు. ‘సరే, భారత్‌ కు వెళతారా.. వెళ్లండి… కానీ సుంకాలు లేకుండా ఇక్కడ (అమెరికాలో) అమ్మలేరు’ అని నేను చెప్పాను’’ అని ట్రంప్‌ తెలిపారు. ఐఫోన్ల గురించి తాము మాట్లాడుతున్నామని, వాటిని అమెరికాలో అమ్మాలంటే, అవి అమెరికాలోనే తయారుకావాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన నొక్కి చెప్పారు. మొదట యాపిల్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించిన ట్రంప్‌, ఆ తర్వాత ఈ సుంకం బెదిరింపును శాంసంగ్‌, హువావే వంటి అన్ని స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలకు వర్తింపజేస్తూ… ‘‘ఆ ఉత్పత్తిని తయారుచేసే ఎవరికైనా ఇది వర్తిస్తుంది, లేకపోతే అది న్యాయంగా ఉండదు’’ అని అన్నారు. ఈ సుంకాలు 2025 జూన్‌ ఆఖరుకు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. అంతకుముందు ఒక సోషల్‌ మీడియా పోస్ట్‌లో కూడా ట్రంప్‌ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు