Saturday, June 14, 2025
Homeభూగర్భ జలాలు పుష్కలం

భూగర్భ జలాలు పుష్కలం

. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన నీటిమట్టం
. 3 మీటర్ల లోతులోనే ఉబికి వస్తున్న జలం
. గత ఏడాది కంటే మెరుగు

విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రంలో భూగర్భ జలాలు పైకి ఉబికి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం జలవనరుల శాఖాపరంగా తీసుకున్న సంస్కరణలు, ప్రత్యేక చర్యలు ఫలితాలిస్తున్నాయి. నీరు-చెట్టు పథకానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయడంతో పాటు జలవనరుల అభివృద్ధికి ముందస్తు ప్రణాళికతోనే ఇదంతా సాధ్యమైందని సంబంధిత శాఖ అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 38.84 శాతం ప్రాంతాల్లో కేవలం మూడు నుంచి ఎనిమిది మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉండడం ప్రభుత్వ పనితీరుకు అద్దంపడుతోంది. అలాగే 30.52 శాతం ప్రాంతాల్లో ఎనిమిది నుంచి 20 మీటర్ల లోతులోను, 11.66 శాతం ప్రాంతాల్లో 20 మీటర్ల లోతులో భూగర్భజలం లభిస్తోంది. ఈ ఏడాది అడపాదడపా రాష్ట్రంలో వర్షాలు కురవడం… ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాల శాతం గణనీయంగా పెరిగిందని అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో గతేడాది మే నెలలో 10.02మీటర్ల లోతులో భూగర్భ జలం ఉండగా, ఈ ఏడాది ఇదే నెలలో 9.68 మీటర్లలో జలాలు ఉన్నాయి. భూగర్భ జలాలు ఈ జిల్లాలో ఈ ఏడాది 0.26 శాతం పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విజయనగరం, పార్వతీపురం అటవీ ఏరియా, అల్లూరి సీతారామరామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో ఈ ఏడాది భూగర్భ జలాల శాతం గణనీయంగా పెరిగినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కోస్టల్‌ ఆంధ్రా రీజియన్లో ఈ ఏడాది చాలా మెరుగైన పరిస్థితి ఉందంటున్నారు. రాయలసీమ జిల్లాలో గతంతో పోలిస్తే ఈసారి 2.76 శాతం భూగర్భ జలాలు పెరిగాయంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం విశాఖపట్నం ఏరియాలో 1.91 మీటర్లలో భూగర్భ జలం పెరిగింది. అనకాపల్లి 1.32 మీటర్లు, కాకినాడ 1.66 మీటర్లు ఉండగా, తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం 0.63 శాతం తగ్గుదల ఉంది. ఏలూరులో 5.35 మీటర్ల పెరుగుదల ఉంది. అలాగే ఎన్టీఆర్‌ జిల్లాలో 1.72, పల్నాడులో 4.65 మీటర్లు, శ్రీసత్యసాయి జిల్లాలో 6.77 శాతం పెరుదల ఉందని అధికారులు వివరించారు. భూగర్భజలాల పరిస్థితి గతం కంటే ఎంతో మెరుగ్గా ఉందని అధికారులు తేల్చారు. ఇప్పటికే రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించామని చెప్పారు. జూన్‌, జులైలో కరువు పీడిత ప్రాంతాల్లో కూడా భూగర్భ భూగర్భజలాలు జలాలు పెరుగుతాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు