Thursday, June 5, 2025
Homeతెలంగాణభూ భారతిదేశానికే తలమానికం

భూ భారతిదేశానికే తలమానికం

. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
. 20 వరకు ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సులు: భట్టి

విశాలాంధ్ర బ్యూరో -ఖమ్మం : దేశానికే తలమానికంగా భూ భారతి చట్టాన్ని రూపొందించినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో మంగళవారం భూ భారతి సర్వే, రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీసీఎల్‌ఏ నవీన్‌ మిట్టల్‌, సర్వే సెటిల్మెంట్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ డాక్టర్‌ జ్యోతి బుద్ధ ప్రకాష్‌, ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌లతో కలిసి ప్రారంభించారు. భట్టి మాట్లాడుతూ… భూ భారతి చట్టం ద్వారా 413 గ్రామాల ప్రజలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు సర్వే చేయించి సరిహద్దు లను నిర్ణయించి ఇబ్బందులు లేకుండా చేయాలని పైలెట్‌ ప్రాజెక్టు కింద ములుగుమాడు గ్రామాన్ని ఎంపిక చేశామని చెప్పారు. ఈ నెల 20వ తేదీవరకు ప్రతి మండలంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తెలంగాణ టెనెన్సీ యాక్ట్‌ 1950 ద్వారా పేదలకు భూ హక్కులను కల్పించామని , 1971 ఆర్‌.ఓ.ఆర్‌. చట్టం, 1973 భూ సంస్కరణల కారణంగా రైతులకు చాలా మేలు జరిగిందని వివరించారు. 2020లో ధరణి చట్టం వల్ల అనేక సమస్యలు వచ్చాయని, భూ హక్కులను కాలరాస్తూ మరొకరి పేరు మీద భూములు ఎక్కించడం వంటి అనేక సమస్యలు ఉత్పన్నం అయ్యాయని అన్నారు. ప్రతి సంవత్సరం గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, భూమి అమ్మకాల, కొనుగోలు వివరాలను అప్‌డేట్‌ చేస్తూ, భూ రికార్డులను పంచాయతీ కార్యాలయంలో అతికించడం జరుగుతుందని అన్నారు. భూ సంస్కరణల కారణంగా రాష్ట్రంలో దాదాపు 26 లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ధరణి లో ఇలాంటి భూములను పార్ట్‌ బీ లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారని, అర్హులైన వారికి భూ భారతి చట్టం ద్వారా పట్టాలు పంపిణీ చేస్తామని అన్నారు. భూ సమస్యలను రెవెన్యూ అధికారుల దగ్గరే పరిష్కరించుకునేలా అప్పీల్‌ వ్యవస్థ ఏర్పాటు చేశామని చెప్పారు. తుమ్మల మాట్లాడుతూ పట్టాపాస్‌ పుస్తకాలలో ఉన్న తప్పుల కారణంగా రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఒకే సంవత్సరంలో రూ.36 వేల కోట్లు నేరుగా అందించామని తెలిపారు. నాట్లకు ముందే రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామన్నారు. రోడ్డు విస్తరణ కోసం ప్రజలు ముందుకు రావాలని మంత్రి కోరారు. పొంగులేటి మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి ప్రజలకు భద్రత కల్పిస్తామని అన్నారు. రాష్ట్రంలోని 413 గ్రామాలలో సరైన భూ రికార్డులు, నక్షాలు లేవని, వీటిలో ఐదు గ్రామాలను పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద చేపట్టి ఐదు ప్రముఖ సంస్థల ద్వారా సర్వే చేస్తున్నామని వివరించారు. డ్రోన్‌, డీజీపీఎస్‌ వంటి ఆధునిక పద్ధతులను వినియోగించి పకడ్బందీగా నక్షా తయారు చేస్తామని అన్నారు. అసైన్డ్‌ భూముల్లో జరిగిన అక్రమాలను పరిశీలిస్తామన్నారు. నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ భూముల సర్వే నెంబర్లలో రెండు కోట్ల వరకు సబ్‌ డివిజన్లు ఉంటే, 40 లక్షల వరకు మాత్రమే మ్యాప్‌ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విలేజ్‌ మ్యాప్‌ లేని 413 గ్రామాల్లో నూతనంగా సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. మనిషికి ఆధార్‌ కార్డు ఉన్నట్లు భూమికి భూ దార్‌ నెంబర్‌ భూమికి సంబంధించిన అన్ని వివరాలతో అందించడం జరుగు తుందని అన్నారు. పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌ నాయక్‌, డీసీసీబీ చైర్మన్‌ దొండపాటి వెంకటేశ్వర రావు, అదనపు కలెక్టర్‌ పి. శ్రీనివాస రెడ్డి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ జేడీ ప్రసన్న లక్ష్మీ, ఆర్‌ అండ్‌ బి ఎస్‌ఈ యాకుబ్‌, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాసులు, ఎర్రుపాలెం తహసీల్దార్‌ ఉషా శారద పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు