. మిలిటరీ దాడులను తిప్పికొట్టడంలో సిద్ధహస్తుడు
. చలపతి మరణంతో పార్టీ అతన్ని పక్కన పెట్టిందా?
. అనారోగ్యంతోనే సేఫ్ జోన్లో షెల్టర్ తీసుకున్నాడా…
చింతూరువిశాలాంధ్ర: మునుపెన్నడూ లేని రీతిలో మావోయిస్టు పార్టీలో అలజడి కొనసాగుతోంది. ఇటీవల భద్రతా బలగాలతో వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు అనేక మంది మృతి చెందారు. కీలక నేత చలపతి సైతం ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో పార్టీ వ్యూహకర్త హిడ్మా ఎక్కడున్నాడన్న ప్రశ్న తలెత్తుతోంది. దండ కారణ్యంలో భద్రతా బలగాలను మట్టు బెట్టడంలో హిడ్మా చేపట్టే ఆపరేషన్లు అత్యంత కీలకం. కవ్వింపు చర్యలకు పాల్పడి మరీ కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలను హతమార్చడంలో అతని భూమిక ప్రధానంగా ఉంటుంది. 2010లో కేంద్ర రిజర్వు బలగాలు ప్రయాణిస్తున్న మైన్ ప్రూఫ్ వాహనాన్ని పేల్చి 76 మందిని చంపిన ఘటనతో వెలుగులోకి వచ్చిన హిడ్మా మావోయిస్టు పార్టీకి కుడి భుజం వంటి వాడనే చెప్పాలి. దాదాపు నాలుగేళ్ల క్రితం తన సొంత గ్రామమైన పువ్వర్తి, జీనగూడ కీకారణ్యంలో కూంబింగ్ చేపట్టిన బలగాలను చుట్టుముట్టి 26 మందిని హతమార్చిన ఘటన కూడా హిడ్మా నేతృత్వంలోనే జరిగింది. ఈ సమయంలో ఒక జవాన్ను కిడ్నాప్ చేసి ప్రజా కోర్టులో ప్రవేశపెట్టగా స్థానిక జర్నలిస్టులు చొరవ తీసుకోవడంతో ఆ జవాన్ను ప్రాణాలతో వదిలారు. బస్తర్ పూర్వ జిల్లాలో అయినా... మాడ్ ప్రాంతంలో అయినా ఎలాంటి ఆపరేషన్ చేపట్టినా విజయవంతం చేయడంలో అతనిది కీలక పాత్ర. మావోయిస్టు పార్టీ బాల సంఘంలో చేరి... అత్యంత ముఖ్యమైన నేతగా ఎదిగాడు. కొంతకాలంగా మావోయిస్టు పార్టీ దాడులకు పూనుకున్న ఘటనల్లో మాత్రం హిడ్మా పేరు వినిపించడం లేదు. కుల్హారీ ఘట్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా ఇంఛార్జ్ రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి మరణించడంతో మరోసారి హిడ్మా పేరు తెరపైకి వచ్చింది. అయితే కేంద్ర మిలటరీ కమిషన్ ఇంఛార్జ్గా ఉన్న హిడ్మాకు సెంట్రల్ కమిటీలో ఎలాంటి బాధ్యతలు ఇంకా అప్పగించలేదని తెలుస్తోంది. కేంద్ర కమిటీ కనుసన్నల్లో వ్యూహ రచన చేసి బలగాలపై పైచేయి సాధించేందుకు అవసరమైన ఆపరేషన్లు నిర్వహించే బాధ్యతలు మాత్రమే అతనికి అప్పగించినట్టుగా సమాచారం. చలపతి ఎన్కౌంటర్ తర్వాత రక్షణ చర్యలు తీసుకోవడంలో హిడ్మా వైఫల్యం చెందడంతో బాధ్యతల నుంచి తప్పించారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఒడిశా
చత్తీస్గఢ్ సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ విషయంలో హిడ్మా సరైన వ్యూహం రచించలేకపోయాడని, ఈ కారణంగానే చలపతి లాంటి అత్యంత కీలకమైన నేతను పార్టీ పొగొట్టుకోవల్సి వచ్చిందన్న వాదనలు తెర పైకి వచ్చాయి. కేంద్ర కమిటీ ఈ విషయంలో హిడ్మాను దోషిగా ప్రకటించి ఆయనను బాధ్యతల నుంచి తప్పించిందన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది.
దేవ్కు ఇంఛార్జి బాధ్యతలు?: మావోయిస్టు పార్టీలో హిడ్మా స్థానాన్ని భర్తీ చేసేందుకు దేవ్కు కేంద్ర కమిటీ బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. హిడ్మా వారసుడిగా ఉన్న దేవ్… ఆవపల్లి బ్లాస్టింగ్కు, బలగాలపై దాడులు చేయడం వంటి కార్యకలాపాల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అయితే హిడ్మా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం అతనిని రహస్య ప్రాంతంలో షెల్టర్ తీసుకోవాలని కేంద్ర కమిటీ సూచించినట్లు సమాచారం. కానీ హిడ్మా కీలకమైన ఆపరేషన్లలోనే పాల్గొంటున్నాడన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో షెల్టర్ తీసుకున్నాడన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు కూడా అతనిని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్లకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కానీ హిడ్మా మాత్రం బలగాల చేతికి చిక్కకపోగా ఆ ఘటన నుంచి తప్పించుకున్నాడన్న ప్రచారం కూడా జరిగింది. అనారోగ్య సమస్యలతో హిడ్మా ప్రస్తుతం పార్టీ లక్ష్యాలను సాధించే బాధ్యతలకు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్నటుగా తెలిసింది. ఈ క్రమంలో జీనగూడ ఘటనతో బలగాలు కేంద్ర కమిటీ సభ్యులకంటే హై టార్గెట్ జాబితాలో హిడ్మాను చేర్చినట్టుగా పార్టీ నాయకత్వానికి కూడా సమాచారం అందింది. దీంతో హిడ్మా బలగాలకు చిక్కినట్టయితే మంచిది కాదన్న ఆలోచనతో పాటు అతనిని అనారోగ్య సమస్యలు వెంటాడుతుండడంతో దాదాపు రెండు మూడేళ్లుగా అండర్ గ్రౌండ్లో ఉంచినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ హిడ్మా పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరించినా పార్టీ పెట్టుకున్న ప్రధాన లక్ష్యాలను ఛేదించడం వరకే పరిమితం అయ్యేవాడు కానీ రక్షణ చర్యలకు ఆయనకు సంబంధమే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మావోయిస్టు హిడ్మా ఎక్కడ?
RELATED ARTICLES