Thursday, June 5, 2025
Homeతెలంగాణ‘మిస్‌ వరల్డ్‌’కు రూ.30 కోట్లే ఖర్చు

‘మిస్‌ వరల్డ్‌’కు రూ.30 కోట్లే ఖర్చు

. రూ. 200 కోట్లు ఎక్కడ ఖర్చయ్యాయో బీఆర్‌ఎస్‌ నేతలు చెప్పాలి
. పోటీదారులకు 30 తులాల బంగారం… పచ్చి అబద్ధం
. మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మ్యాగీ ఆరోపణలు అవాస్తవం: మంత్రి జూపల్లి

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : మిస్‌ వరల్డ్‌ పోటీల నిర్వహణకు సుమారు రూ.30 కోట్లు ఖర్చు అయిందని, వీటి ద్వారా తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అంబేద్కర్‌ సచివాలయంలో మంగళవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ వేదికగా తెలంగాణ పర్యాటక అభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా నిర్వహించిన మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు విజయవంతం అయ్యాయన్నారు. పర్యాటకం, హస్తకళలు, చేనేత ఉత్పత్తులకు మంచి ప్రచారం వచ్చిందని, సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను ప్రపంచానికి పరిచయం చేశామని చెప్పారు. మిస్‌ వరల్డ్‌ పోటీల నిర్వహణపై అభినందించాల్సి పోయి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. స్పాన్సర్ల ద్వారానే రూ.21 కోట్లు వచ్చాయని, ప్రభుత్వానికి అయిన ఖర్చు రూ.తొమ్మిది కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. సుమారు రూ.11 కోట్ల ఆదాయంపై ఒప్పందాలు ఉన్నాయని వివరించారు. మిస్‌ వరల్డ్‌ పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు ఎక్కడ అయ్యాయో చెప్పాలని మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావుకు సవాల్‌ విసిరారు. రూ.200 కోట్లు ఖర్చు అయినట్లు నిరూపించకుంటే ముక్కు నేలకు రాయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో టూరిజం ప్రచారానికే రూ.115 కోట్లకు పైగా ఖర్చు చేశారని గుర్తు చేశారు. సొంత పత్రికలు, మీడియా, సోషల్‌ మీడియాలో అసత్యాలు ప్రచారం చేశారని, అందగత్తెల కాళ్లు కడిగారని విష ప్రచారం చేశారని మండిపడ్డారు. ఐఏఎస్‌ అధికారులతో కాళ్లు మొక్కించుకున్న ఘనత కేసీఆర్‌ దేనని అన్నారు. పోటీదారులకు 30 తులాల బంగారం ఇచ్చారనేది పచ్చి అబద్ధం అని, చౌమహల్లా ప్యాలెస్‌ విందులో ఒక్కో ప్లేట్‌ భోజనానికి లక్ష రూపాయాలు ఖర్చు చేశారనేది అవాస్తమని , ఒక్కో ప్లేట్‌ కు అయిన ఖర్చు రూ.8,200 మాత్రమేనని స్పష్టం చేశారు. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలను మంత్రి జూపల్లి ఖండిరచారు. ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలా జరిగి ఉంటే మిగతా 108 మంది పోటీదారులు చివరి వరకు ఉండేవారు కాదన్నారు. వాళ్లను ఇబ్బంది పెడితే… మళ్లీ మళ్లీ తెలంగాణకు రావాలని ఉందని ఎందుకు చెబుతారని ప్రశ్నించారు. మిస్‌ వరల్డ్‌ విన్నర్‌ థాయిలాండ్‌ సుందరి ఓపల్‌ సుచాత… తెలంగాణ ఆథిత్యం, ఇక్కడి పర్యాటక ప్రాంతాలు నచ్చాయని, అవకాశం వస్తే మళ్లీ ఇక్కడికి వస్తానని ఆమె చెప్పారన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ మిస్‌ వరల్డ్‌ పోటీలను విజయవంతంగా నిర్వహించడాన్ని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే రాజేష్‌ రెడ్డి, పర్యాటక శాఖ డ్కెరెక్టర్‌ హన్మంతు జండగే, స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ డైరెక్టర్‌ కె.లక్ష్మి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు