Friday, June 6, 2025
Homeతెలంగాణమొక్కలు నాటదాం మానవాళికి మేలు చేకూరుద్దాం

మొక్కలు నాటదాం మానవాళికి మేలు చేకూరుద్దాం

సీపీఐ మాజీ ఎంపీ అజీజ్‌ పాషా

విశాలాంధ్ర-హైదరాబాద్‌ : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా మానవాళికి మేలు చేకూర్చాలని సీపీఐ మాజీ ఎంపీ, ఆల్‌ ఇండియా తంజీమ్‌ ఇన్సాఫ్‌ అధ్యక్షుడు సయ్యద్‌ అజీజ్‌ పాషా అన్నారు. జూన్‌ 5వ తేదీ గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇస్కఫ్‌ (ఇండియన్‌ సొసైటీ ఫర్‌ ఎపీస్‌ అండ్‌ కల్చరల్‌ అఫైర్స్‌), ఆల్‌ ఇండియా తంజీమ్‌ ఇన్సాఫ్‌ అధ్వర్యంలో సుందరయ్య పార్క్‌లో జరిగిన ప్రదర్శన, బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజీజ్‌ పాషా మాట్లాడుతూ 2019 నుంచి 2022 వరకు 5.8 మిలియన్ల చెట్లు నరికివేతకు గురవడంతో భారతదేశం అటవీ నిర్మూలనలో బ్రెజిల్‌ తర్వాత ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉందని అన్నారు. ఉపగ్రహ సర్వేలో 11 శాతం పూర్తిగా పెరిగిన చెట్లు నరికివేయబడినట్లు తేలిందని వివరించారు. దక్షిణ భారతదేశంలో తెలంగాణ అత్యధికంగా ఉందని, ఇక్కడ 2014 నుంచి 2024 వరకు 11,422 హెక్టార్ల అటవీ భూమిని కోల్పోవడం జరిగిందని చెప్పారు. సుప్రీం కోర్టు జోక్యం కంచ గచ్చి బౌలిని కాపాడటానికి సహాయపడిరదని, లేకుంటే వేలాది చెట్లను నరికివేసేవారని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం 1997 క్యోటో ప్రోటోకాల్‌, 2015 పారిస్‌ ఒప్పందం, సీవోపీ 29, బాకు సిఫార్సులను కచ్చితంగా అమలు చేయాలన్నారు. గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదల నుంచి ప్రపంచాన్ని కాపాడాలన్నారు. ఇంటి నిర్మాణానికి అనుమతి పొందే ముందు రెండు చెట్లను నాటడానికి ముందస్తు షరతు బెంగళూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన నమూనాను అనుసరించాలని ఆయన జీహెచ్‌ఎంసీ, ఇతర మునిసిపాలిటీలను కోరారు. ఇస్కఫ్‌ అధ్యక్షుడు ఆర్‌.గోపాల్‌ మాట్లాడుతూ ఊహించని రీతిలో వేడి గాలులు, వరదలు, తుపానులు తీవ్రతరం అవుతుండటం గ్లోబల్‌ వార్మింగ్‌ మొత్తం ప్రపంచానికి అతిపెద్ద ప్రమాద సంకేతమని భావిస్తున్నట్లు చెప్పారు. మన జీవితాలకు ఊహించలేని నష్టాన్ని కలిగిస్తున్న ప్లాస్టిక్‌ను ఒక్కసారి కూడా వాడవద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుత వర్షా కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో మొక్కలు నాటాలని ఆయన నొక్కి చెప్పారు. ఇస్కఫ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సీనియర్‌ న్యాయవాది కె.ప్రభాకర్‌ రావు మాట్లాడుతూ అంటార్కిటికా, పచ్చని భూములలోని హిమానీనదాలు చాలా వేగంగా కరిగిపోతున్నందున ప్రస్తుత వాతావరణాన్ని మెరుగుపరచడానికి బహుముఖ విధానాన్ని నొక్కి చెప్పారు. తంజీమ్‌ ఇన్సాఫ్‌కు చెందిన మునీర్‌ పటేల్‌ మాట్లాడుతూ ప్రజా అవగాహనా ప్రచారం, సమాజ భాగస్వామ్యాన్ని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది విజయలక్ష్మి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు