Saturday, June 21, 2025
Homeవిశ్లేషణయోగా ముసుగులో మోదీ రాజకీయం

యోగా ముసుగులో మోదీ రాజకీయం

డీవీవీఎస్‌ వర్మ
దారి దీపం సంపాదకులు

జూన్‌ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందడి రాష్ట్రంలో ఊరూ వాడా మారుమోగుతున్నది. ఈ ఉత్సవానికి మోదీ ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్నారు. మోదీ ప్రాపకం కోసం ఉవ్విళ్లూరుతున్న చంద్రబాబు ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత నెల రోజులుగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అంతా యోగా చుట్టూ తిరుగుతున్నది. మంత్రులు, శాసన సభ్యులు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ యంత్రాంగం అంతా యోగా కోసం 2 కోట్ల మందిని సమీకరించే పనిలో తల మునకలై వున్నది. ఈ యోగా వెనుక అనేక కోణాలు కనిపిస్తున్నాయి. యోగాలో వ్యాయామం వుంది. ధ్యానం వుంది. ఆధ్యాత్మిక ముక్తి మార్గం వుంది. అంతకుమించి వ్యాపారం వుంది. కార్పొరేట్ల ప్రయోజనాలు వున్నాయి. అంతిమంగా మోదీ స్వార్థ పూరిత రాజకీయం వుంది. మోదీని మెప్పించి తమ పబ్బం గడుపుకోవాలనే రాష్ట్ర రాజకీయం వుంది. ఈ కోణాలను మరుగు పరిచే ప్రయత్నాలు ఎన్ని చేసినా అవి తమదైన రూపంలో ప్రత్యక్షమవుతూనే వున్నాయి. ఇలా బహురూపిగా మారిన యోగా రకరకాల కారణాలరీత్యా వివిధ తరగతుల ప్రజల్ని ఆకర్షిస్తున్నది.
మన సామాజిక ఆర్థికాభివృద్ధి క్రమంలో శారీరక శ్రమ చేయనివారు పెరుగుతున్నారు. గ్రామీణ పేదలు, వస్తూత్పత్తి చేసే పారిశ్రామిక కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు మాత్రమే శారీరక శ్రమజీవులుగా ఉన్నారు వారికి యోగా అవసరం అంతగా లేదు. వివిధ రంగాల మధ్య తరగతి వేతన జీవులు శారీరక శ్రమకు దూరం అయ్యారు. అలాంటి వారిని యోగా ఒక వ్యాయామ సాధనంగా ఆకర్షిస్తుంది. మన సమాజంలో నానాటికి వృద్ధుల సంఖ్య పెరుగుతున్నది. వారు వృద్ధాశ్రమాలలో వున్నా, మరోచోట వున్నా వారికి వ్యక్తిగతంగా శ్రమ చేయడానికి యోగా అనువైన సాధనం అయింది. ఇప్పుడు మన బడి పిల్లలు కూడా వ్యాయామానికి అవసరమైన ఆటపాటలు డ్రిల్లు క్లాసులు లేకపోవడంతో పాఠశాలలు యోగాను ఆశ్రయిస్తున్నారు. అదొక గౌరవ ప్రదమైన శిక్షణగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. అదనపు ఫీజులు చెల్లించి యోగాభ్యాసం చేయిస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థలు తమ ఉద్యోగులకు యోగాను అవలంబించమని ప్రచారం చేస్తున్నాయి. ఆ ఉద్యోగులు కూడా అది తప్పనిసరి అవసరంగా భావిస్తున్నారు. కార్పొరేట్‌ యాజమాన్యం తమ ఉద్యోగులకు పని ఒత్తిడి పెంచింది. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని ఆందోళనకు గురిచేసింది. పనిగంటల తగ్గింపు, రిక్రియేషన్‌ కార్యకలాపాల ద్వారా పని ఒత్తిడి తగ్గించడానికి బదులు వీరికి తాత్కాలిక ఉపశమనంగా యోగాను, ధ్యానాన్ని పరిష్కారంగా వారి ముందు పెట్టి, కార్పొరేట్‌ ప్రయోజనాలను కాపాడే సాధనంగా యోగాను వినియోగించుకున్నారు. ఇలా శారీరక శ్రమలేని తరగతులు, మానసిక ఒత్తిడికి గురవుతున్న తరగతులకు యోగా తప్పనిసరి అవసరంగా కనిపిస్తున్నది. దీనికి కారణమైన సామాజిక, ఆర్థిక కారణాల నుంచి దృష్టి మళ్లించే సాధకంగా యోగా వినియోగపడుతున్నది. ఈ కారణాలరీత్యా మధ్య తరగతి వేతనజీవులు, వృద్ధులు, పాఠశాల పిల్లలు యోగాను ఎంచుకుంటున్నారు. అలా వారు యోగాను ఆచరిస్తున్నారు. తక్షణ ఉపశమనాన్ని పొందుతున్నారు. అందుకే యోగాను వీరు ఆదరిస్తున్నారు.
యోగా, ధ్యానం పూర్తిగా వ్యక్తిగతమైనవి. అయితే ప్రారంభంలో నేర్చుకునేటప్పుడు మాత్రమే దానికి కొంత మేరకు గురువు అవసరం వుంటుంది. దానికి స్థానికంగా చాలా మంది గురువులు ఉన్నారు. వారు తగు ఫీజుతో శిక్షణ ఇస్తున్నారు. దేనికైనా వ్యాపారం చేయగల నేర్పరితనం మన పెట్టుబడీదారి వ్యవస్థకు వుంది. యోగాను కూడా వారు వ్యాపారం చేశారు. ప్రైవేటు వైద్యం దోపిడీలాగా ఈ ప్రైవేటు యోగా వ్యాపారం కూడా విపరీతమైన దోపిడీకి నిలయం అయింది. ప్రపంచవ్యాప్తంగా యోగా చుట్టూ 86,000 కోట్ల రూపాయల వ్యాపారం సాగుతున్నది. దీనికి ఆయుర్వేదాన్ని, గోమూత్రాన్ని జత చేసి మరీ విక్రయిస్తున్నారు. ఇప్పుడు యోగా నేర్చుకోవడానికి ఖరీదైన ఆన్‌లైన్‌ కోర్సులు వచ్చాయి. యోగా చెయ్యడానికి మాట్స్‌ వ్యాపారం వచ్చింది. యోగా దుస్తుల వ్యాపారం జోరుగా సాగుతున్నది. దేశంలో ఈ వ్యాపారంలో రాందేవ్‌ బాబాలు, శ్రీశ్రీ రవిశంకర్‌ అగ్రభాగాన వున్నారు. వారు సాధారణ బాబాలు కాదు. మోదీ ప్రభుత్వ ప్రాపకం వున్న బాబాలు. వీరి ప్రమేయంతో నడుస్తున్న సంస్థలు వెయ్యి కోట్లకు పైబడి ఆస్తులను పోగేసుకున్నాయి. యోగాను కార్పొరేట్‌ వ్యాపారంగా నడుపుతున్నారు. దీనిని మోదీ రాజకీయంతో జతచేసి మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరింప చేసుకుంటున్నారు. మోదీ ఏ నినాదం ఇచ్చినా, ఏ కార్యక్రమం తలపెట్టినా అందులో రాజకీయం వుంటుంది. స్వప్రయోజనం వుంటుంది. యోగాకు ప్రజాదరణ కల్పించి దానిని తన ఎన్నికల ఖాతాలో వేసుకోవాలని ఆయన భావిస్తున్నారు.
దేశాన్ని ‘‘విశ్వగురు’’ చేస్తానని మోదీ ప్రకటించారు. దానికి ‘‘వికసిత్‌ భారత్‌ను’’ నినాదం చేశారు. అంటే 2047 నాటికి ప్రపంచానికి దారి చూపించే దేశంగా అభివృద్ధి సాధించాలి. ఇప్పుడు ప్రపంచంలో స్థూల జాతీయోత్పత్తిలో 4వ స్థానం పొందడం ఘన విజయంగా డప్పు కొడుతున్నారు. 140 కోట్ల జనాభాగల దేశం 3, 4 కోట్ల జనాభాగల దేశాల జీడీపీని దాటిపోవడంలోని డొల్లతనాన్ని అసలు లెక్కలు తేల్చి చెబుతున్నాయి. తలసరి జీడీపీలో భారతదేశం 4వ స్థానంలో లేదు,140వ స్థానంలో వుంది. మానవాభివృద్ధిలో 131వ స్థానంలో వుంది. ఆకలిసూచీలో 106వ స్థానంలో వుంది. రానున్న 2, 3 దశాబ్దాలలో భారత్‌ ఈ రంగాలలో విశ్వగురు అయ్యే అవకాశాలు లేవని ఆర్థికవేత్తలకు తెలుసు. ఈ విషయం మోదీకి కూడా తెలుసు. విశ్వగురు స్థానాన్ని సంపాదించడానికి మరో మార్గాన్ని ఎంచుకున్నారు. ఐక్యరాజ్యసమితిలో జూన్‌ 21ని యోగా దినోత్సవంగా ప్రకటింపజేశారు. 196 దేశాలు దానిని ఆమోదించాయి. ఇప్పుడు యోగాలో మనమే ‘‘విశ్వగురు’’ అని మోదీ దేశ ప్రజలను మభ్యపెట్టదలుచుకున్నారు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పేదలున్న దేశం మనది. అత్యధిక అంతరాలు వున్న దేశం మనది. దీనిని యోగాతో కప్పిపుచ్చే ప్రయత్నం మోదీ చేస్తున్నారు.
దేశంలో మోదీ సాగిస్తున్న రాజకీయం మనకు తెలిసిందే. దేశాన్ని మతపరంగా విభజించి, మత విద్వేషపరంగా మెజారిటీ ప్రజల ఓట్లు దండుకునే రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు యోగాని ఒక మతపరమైన సాంస్కృతిక సాధనంగా వినియోగించే ప్రయత్నం చేస్తున్నారు. యోగా పుట్టుపూర్వోత్తరాల గురించి మోదీ మాట్లాడరు. అది హిందూ సాంస్కృతిక సంప్రదాయంగా ప్రచారం చేయడానికి సంఫ్‌ు పరివారం యోగా చరిత్ర వక్రీకరణలకు పూనుకున్నారు. యోగా మీద 100 కీలక గ్రంథాలను ఐదేళ్లపాటు పరిశోధన చేసి మార్క్‌సింగిల్‌ టన్‌, జామెస్‌ మల్లీసన్‌లు ‘ది రూట్స్‌ ఆఫ్‌ యోగా’ అన్న పుస్తకాన్ని ప్రకటించారు. యోగా ఆదిలో మొదలైంది మతపరమైన సంప్రదాయం నుంచి కాదని ఆ పుస్తకంలో వారు నిగ్గు తేల్చారు. 13వ శతాబ్దికి చెందిన ‘‘దత్తాత్రేయ యోగ శాస్త్రం’’ లో యోగా మతానికి, కులానికి అతీతమైందని పేర్కొంటూ సాధువులు, బౌద్ధులు, బ్రాహ్మణులు, జైనులు, భౌతికవాదులకు కూడా ఆచరించదగినదిగా చెప్పారు. బౌద్ధం నుంచి వైదిక మతం యోగాను కాపీ కొట్టిందని దేవరాజు మహారాజు ఒక వ్యాసంలో స్పష్టం చేశారు. పతంజలి యోగ శాస్త్రంలోని అభూత కల్పనలను పక్కనబెట్టి మోదీ పరివారం దానిని హిందూ సాంస్కృతిక వారసత్వంగా యోగాను ప్రకటిస్తున్నది. హిందూ సాంస్కృతిక ఆధిపత్యానికి చిహ్నంగా యోగాపై ప్రచారం సాగిస్తున్నది. దీని ద్వారా ఇతర మతాలకంటే హిందూ మత ఆధిక్యతను చాటడానికి వాడుకుంటున్నారు. మతపరమైన విభజనకు యోగాను పరోక్షంగా వినియోగిస్తున్నారు.
యోగా వ్యక్తిగతంగా ఆచరించాల్సినిది కాగా దానిని సామూహికం చేసి సాంస్కృతికపరమైన గుంపు భావన పెంపొందిస్తున్నారు. ఈ గుంపుతత్వంతో యోగాకు ఏకైక నాయకునిగా మోదీ భజనకు ద్వారాలు తెరుస్తున్నారు. మోదీ ఇప్పుడు రాజకీయంగా దక్షిణాది జైత్రయాత్రకు ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింల సంఖ్య తగినంత లేకపోవడం సాధారణ మత విద్వేష రాజకీయం ఇక్కడ అంతగా పనిచేయదు. ఆ పనిచేసి పెట్టడానికి ‘‘సనాతన ధర్మ’’ వేషం ధరించిన ‘‘చాక్‌లెట్‌ బాయ్‌’’ పవన్‌ కల్యాణ్‌ వున్నారు. చంద్రబాబును వశపరుచుకోడానికి మత విద్వేష రాజకీయానికి బదులు మరోదారి అవసరం. యోగా ద్వారా హిందూ సాంస్కృతిక గుంపు భావోద్వేగాన్ని కల్పించడం ద్వారా రాష్ట్రంలో మెజారిటీ ప్రజలను ఆకట్టుకునే కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. దీనికి చంద్రబాబును పావుగా వాడుకుంటున్నారు. రాజకీయంగా రాష్ట్రంలో విస్తరించడానికి యోగా డేలో మోదీనే స్వయంగా పాల్గొంటున్నారు. రాష్ట్రంలో మోదీని మెప్పించడానికి తెలుగుదేశం, జనసేన పార్టీలు పోటీ పడుతున్నాయి. మొదటి ఛాన్స్‌ సనాతన ధర్మం పేరుతో మోదీకి సన్నిహితం కావడంలో పవన్‌ కల్యాణ్‌ ముందున్నారు. వెనుకబడిన చంద్రబాబు మెగా యోగా కార్యక్రమాలతో మోదీ దగ్గర తన స్థానాన్ని మెరుగు పరుచుకోవ డానికి శక్తివంచన లేని ప్రయత్నాలు చేస్తున్నారు. జూన్‌ 21న రెండు కోట్ల మందితో రాష్ట్ర వ్యాప్తంగాను, మోదీ చెంతన రెండు లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని చేపట్టారు. నెల రోజులుగా స్వర్ణాంధ్రప్రదేశ్‌ నినాదం పక్కకు పోయింది యోగాంధ్ర నినాదం ముందుకొచ్చింది. మోదీ రాజకీయ విస్తరణకు చంద్రబాబు కొత్త ద్వారాలు తెరిచారు. ఇది రాష్ట్ర భవిష్యత్‌కు మతపరమైన రాజకీయ ముప్పుకానుంది. రాష్ట్ర ప్రజలు తమ తమ శారీరక , మానసిక అవసరాల కోసం యోగాను ఆదరించండి. కాని యోగా ముసుగులో మోదీ రాజకీయ పన్నాగాలను నిరసించండి.
సెల్‌ : 8500678977

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు