విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మిక తనిఖీ సందర్భంగా రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రిలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ ఐదుగురు వైద్యులు, నలుగురు కార్యాలయ సిబ్బందిని సస్పెండ్ చేశారు. సోమవారం మంత్రి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో కొందరు వైద్యులు, సిబ్బంది హాజరు నమోదు చేసుకుని తమ కర్తవ్యాలను నిర్వర్తించకుండా ఆసుపత్రి నుంచి వెళ్లిపోతున్నట్లు గుర్తించారు. మంత్రి హాజరు నమోదు పుస్తకాలను పరిశీలించగా, కొందరు హాజరు నమోదు చేయకపోవడం, కొందరు హాజరు నమోదు చేసి వెంటనే వెళ్లిపోవడం, మరికొందరు సమస్యలకు సరైన సమాధానం ఇవ్వకపోవడం వంటివి గుర్తించారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న మంత్రి, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫలితంగా బాధ్యతారహితంగా వ్యవహరించిన సిబ్బంది పై సస్పెన్షన్ ఆదేశాలు జారీ అయ్యాయి. రోగుల సంరక్షణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించమని, మంత్రి ఆదేశాలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకోబడతాయని డైరెక్టర్ వెల్లడిరచారు. వైద్యులు, ఇతర ఆసుపత్రి సిబ్బంది తమ విధులను నిబద్ధతతో సతప్రవర్తన తో నిర్వహించాలని, ఈఎస్ఐ పథకం కింద లబ్ధిదారుల సంక్షేమానికి కృషి చేయాలని డైరెక్టర్ కోరారు.
రాజమండ్రి ఈఎస్ఐలో 9 మందిపై సస్పెన్షన్ వేటు
RELATED ARTICLES