. విద్యుత్ ఉద్యోగులకు భరోసా
. 51,868 వేల మందికి వర్తింపు
. రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే పథకం
. డిప్యూటీ సీఎం భట్టి
విశాలాంధ్ర-హైదరాబాద్ : రాష్ట్రం, దేశ ప్రగతిలో కీలక పాత్ర వహించే విద్యుత్ ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా కల్పించడం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన ప్రజాభవన్లో 51,868 వేల మంది విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా కల్పించేందుకు బ్యాంకర్లతో ఒప్పందం చేసుకున్న అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే సంస్థల్లో విద్యుత్ సంస్థ ప్రధానమైందని… అందులో పనిచేసే సిబ్బంది కుటుంబాల యోగ క్షేమాల గురించి ఆలోచించి తీసుకున్న ఈ ప్రమాద బీమా పథకం వ్యక్తిగతంగా తనకు బాగా తృప్తిని ఇచ్చిందని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు రాత్రి, పగలు అని తేడా లేకుండా శ్రమిస్తారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణాలు పణంగాపెట్టి విధుల్లో నిమగ్నమవుతారు. అందుకే వారి కుటుంబాల యోగక్షేమాల కోసం ఈ ప్రమాద బీమా పథకాన్ని తీసుకువచ్చాం అన్నారు. విద్యుత్ శాఖ రాష్ట్ర జీడీపీ పెరుగుదలకు ఇందనంగా ఉపయోగపడే ప్రధాన శాఖ అని తెలిపారు. లైన్ మెన్ మొదలు సీఎండీ స్థాయి వరకు పనిచేసే ఉద్యోగులందరికీ కుటుంబాలు ఉంటాయి. హోదాలు వేరైనా కుటుంబం విషయానికి వచ్చేసరికి ఒకే రకమైన బంధం, అనుబంధం, బాధ్యత ఉంటుందని తెలిపారు. ఇంటి పెద్ద కు ఊహించని ప్రమాదం ఏదైనా ఎదురైతే ఆ కుటుంబాలు తలకిందులయ్యే పరిస్థితులు రాకుండా ఉండడానికే ఈ ప్రమాద బీమా పథకానికి శ్రీకారం చుట్టామని డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యుత్తు సిబ్బందిలో నమ్మకం, ధైర్యం ఇవ్వడం కోసం ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకుండా ఈ పథకాన్ని తీసుకువచ్చామని చెప్పారు. ఎస్బీఐలో ఖాతా తెరిచిన విద్యుత్ ఉద్యోగులకు కేవలం ప్రమాద బీమా నే కాకుండా పెళ్లి, విద్యాపరమైన ఆర్థిక సహాయం లోను రుణాలు అందించి చేయూతను ఇవ్వనున్నారని తెలిపారు. శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి 80 లక్షల పరిహారం అందుతుందని, ఈ ఖాతా తెరిచిన ఉద్యోగులు అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ సేవలు వినియోగించుకోవచ్చునన్నారు. ఎటీఎం కార్డు, చెక్ బుక్ సేవల పైన ఎటువంటి చార్జెస్ ఉండవని తెలిపారు. సహజ మరణం చెందితే పది లక్షల వరకు ప్రమాద బీమా ఉంటుందని, ఉద్యోగితోపాటు నలుగురు కుటుంబ సభ్యులకు కలిపి 20 లక్షల వరకు బీమా సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. 2023 తో పోలిస్తే 2025 లో విద్యుత్ పీక్ డిమాండ్ 17,162 మెగావాట్లు వచ్చిందని, గతంతో పోలిస్తే 2000 మెగావాట్ల డిమాండ్ అదనంగా పెరిగినప్పటికీ విద్యుత్ సరఫరా లో చిన్న అంతరాయం లేకుండా రాష్ట్ర విద్యుత్ సిబ్బంది చూసుకున్నారని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ సీఎండీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.